కరీంనగర్ కలెక్టరేట్, ఆగస్టు 17 : కాంగ్రెస్ సర్కార్పై కరీంనగర్ పాడి రైతులు కన్నెర్రజేశారు. డెయిరీ డెవలప్మెంట్ ఫెడరేషన్ పేరిట భూభారతిలో మార్చిన భూములను తిరిగి ‘కరీంనగర్ డెయిరీ’కి అప్పగించాలని ఆందోళనబాట పట్టారు. ఈ మేరకు సోమవారం ఉదయం ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పదివేల మందికిపైగా పాడి రైతులు కరీంనగర్ పద్మనగర్లోని ‘కరీంనగర్ డెయిరీ’కి చేరుకున్నారు. అక్కడి నుంచి ప్లకార్డుల ప్రదర్శిస్తూ ర్యాలీగా కలెక్టరేట్కు తరలివచ్చారు. కలెక్టరేట్ ఎదుట గంటకుపైగా నిరసన చేపట్టిన అనంతరం కలెక్టర్ చిత్రా మిశ్రాకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా డెయిరీ చైర్మన్ చల్మెడ రాజేశ్వర్రావు మాట్లాడుతూ.. కరీంనగర్ డెయిరీపై సర్కార్ కక్షసాధింపు చర్యలు చేపట్టడం దారుణమని మండిపడ్డారు. ఫెడరేషన్ పేరిట డెయిరీ భూములు లాక్కొనే యత్నం చేస్తున్నదని ఆరోపించారు.
అందులోభాగంగానే డెయిరీకి సంబంధించిన 19.5 ఎకరాల భూమిని భూభారతిలో డెయిరీ డెవలప్మెంట్ ఫెడరేషన్ పేరిట డిసెంబర్లో మార్చిందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఆధీనంలోని డెయిరీలను అభివృద్ధి చేయాల్సింది పోయి, రైతులు ఏర్పాటు చేసుకున్న డెయిరీ భూములు స్వాధీనం చేసుకునే యత్నాలు చేయడం దుర్మార్గమని అన్నారు. పాడి రైతుల సంక్షేమమే ధ్యేయంగా కరీంనగర్ డెయిరీ కొనసాగుతున్నదని, సబ్సిడీతో గేదెలు అందించడం, పాడి రైతుల పిల్లలకు కల్యాణమస్తు, ఉపకారవేతనాలు, రైతు భరోసా అందిస్తున్నామని చెప్పారు. షాపింగ్ కాంప్లెక్స్, పెట్రోల్ బంక్లాంటి స్థిరాస్తులతో రాష్ట్రంలోనే నంబర్ వన్ స్థానంలో ఉన్నదని తెలిపారు. ప్రభుత్వ డెయిరీలకు దీటుగా కొనసాగుతుండటాన్ని జీర్ణించుకోలేక లక్ష కుటుంబాలకు చెందిన డెయిరీ ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించడం సరికాదని అన్నారు. కరీంనగర్ డెయిరీపేరిట భూములను నమోదుచేయని పక్షంలో లక్షకుటుంబాల ఉసురు తాకుతుందని పేర్కొన్నారు.