హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మండే ఎండలు కాస్తున్నాయి. గురు, శుక్రవారాల్లో వివిధ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు ఏకంగా 40 డిగ్రీలు దాటడం ఆందోళన కలిగిస్తున్నది. మండే ఎండలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శుక్రవారం భద్రాద్రి-కొత్తగూడెం, నల్లగొండ, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో భానుడు నిప్పులు కురిపించాడు. ఆయా జిల్లాల్లో 40.4 డిగ్రీల నుంచి 40.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీచేశారు.
అదే విధంగా జగిత్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నారాయణపేట, పెద్దపల్లి జిల్లాల్లో 39.6, జనగామ, మంచిర్యాల జిల్లాల్లో 39.5 డిగ్రీల చొప్పున నమోదైనట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్లో 37.3డిగ్రీలు నమోదయ్యాయి. శనివారం సాధారణ ఉష్ణోగ్రతలు మరో 2 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు హెచ్చరించారు. ఆదివారం నుంచి వరుసగా మూడురోజుల పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.