Summer | హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో 40 డిగ్రీలకు చేరగా, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో 38 డిగ్రీలు దాటింది. రానున్న రోజుల్లో ఎండలు మరింత పెరగొచ్చని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు సూచించారు. ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తర కర్ణాటకతో పాటు మహారాష్ట్ర, ఒడిశాలోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ రోజులు వేడిగాలులు వీస్తాయని తెలిపింది.
మార్చి, మే నెలల్లో దేశంలోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణశాఖ డైరెక్టర్ మృత్యుంజయ మహాపాత్ర తెలిపారు. మార్చిలో ఉత్తర, మధ్య భారత్లో మాత్రం వడగాలుల తీవ్రత ఉండకపోవచ్చని తెలిపారు. ప్రస్తుత ఎల్నినో ప్రభావం వేసవి వరకూ ఉండొచ్చని, ఆ తర్వాత పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటాయని పేర్కొన్నారు. మరోవైపు దేశంలో అనుకూల వర్షపాతానికి కారణమైన లానినా పరిస్థితులు మాత్రం వర్షాకాలం మధ్య నుంచి ఏర్పడతాయని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం వివిధ ప్రాంతాల్లో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు..