యుద్ధంతో గడగడలాడుతున్న ఉక్రెయిన్ నుంచి భారత్కు వచ్చిన తెలుగు విద్యార్థులు.. శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్నారు. శనివారం నాడు బుకారెస్ట్ నుంచి ముంబై చేరుకున్న విమానంలో 219 మంది భారతీయులు ఉన్నారు. ఆ తర్వాత ఢిల్లీ వచ్చిన మరో విమానంలో 250 మంది విద్యార్థులు ఉన్నారు.
ఇప్పుడు మరో విమానం బుడాపెస్ట్ నుంచి ఢిల్లీకి బయలుదేరింది. దీనిలో 240 మంది భారతీయులు ఉన్నారు. ముంబై చేరుకున్న విమానంలో ఉన్న 20 మంది తెలుగు విద్యార్థులు శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండయ్యారు. అలాగే ఢిల్లీ చేరిన విమానంలో 17 మంది తెలుగు విద్యార్థులు ఉన్నారు.
ఈరోజు సాయంత్రానికి మరికొంతమంది తెలుగు విద్యార్థులు ఢిల్లీ చేరుకుంటారని సమాచారం. శంషాబాద్ చేరుకున్న విద్యార్థులు మాట్లాడుతూ.. శనివారం రాత్రి 11 గంటలకు ముంబై చేరుకున్నామని తెలిపారు. భారత ఎంబసీ, రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చాలా సాయం చేశాయని వివరించారు.