హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): గోదావరి బేసిన్లో నీటి లభ్యతపై తెలంగాణ చేస్తున్న వాదనే నిజమని తేలింది. ఉమ్మడి ఏపీకి నీటి లభ్యత 1,486 టీఎంసీలు అని స్వయంగా కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ) స్పష్టం చేసింది. ఈ మేరకు తాజాగా గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ)కు లేఖ రాసింది. గోదావరి నదిలో మొత్తం నీటి లభ్యతను 3,396 టీఎంసీలుగా సీడబ్ల్యూసీ అంచనా వేసింది. 75 శాతం డిపెండబిలిటీ ఆధారంగా 1941-42 నుంచి 1979-80 దాకా తీసిన లెకల ప్రకారం ఈ మేరకు నీటి లభ్యత ఉన్నట్టు పేర్కొన్నది. ఇందులో ఏపీ వాటా 1,486 టీఎంసీలుగా తెలిపింది. గోదావరిలో నీటి లభ్యతను తేల్చాలని బోర్డు జనవరి 19న సీడబ్ల్యూసీకి లేఖ రాసింది. దీనిపై మార్చి 9న సీడబ్ల్యూసీలోని హైడ్రాలజీ విభాగం అధికారులు, గోదావరి బోర్డు చైర్మన్, సభ్యులు సమావేశమయ్యారు. ఈ మేరకు నీటి లభ్యతను గణించిన సీడబ్ల్యూసీ వివరాలను బోర్డుకు అందజేసింది. గోదావరి నదికి సంబంధించి 8 సబ్ బేసిన్లు తెలంగాణలో ప్రవహిస్తున్నాయి.
గోదావరిలో నీటి లభ్యత 1,486 టీఎంసీలుగా ఉన్నదని తెలంగాణ మొదటి నుంచీ వాదిస్తున్నది. ఇందులో తమకు 968 టీఎంసీలు, ఏపీకి 518 టీఎంసీల కేటాయింపులు ఉన్నాయని చెప్తున్నది. ఈ మేరకే సాగు, తాగునీటి అవసరాలకు ప్రాజెక్టులు చేపట్టామని చెప్తున్నది. ఏపీ మాత్రం 2004లో వ్యాపోస్ నివేదిక ఆధారంగా 1,360 టీఎంసీలు మాత్రమే లభ్యత ఉన్నదని వాదిస్తున్నది. నీటి లభ్యత తేలేదాకా తెలంగాణ సమర్పించిన ప్రాజెక్టుల డీపీఆర్లకు అనుమతి ఇవ్వొద్దంటూ సీడబ్ల్యూసీకి, గోదావరి బోర్డుకు పదే పదే లేఖలు రాస్తున్నది. దీంతో గోదావరి బోర్డు సీడబ్ల్యూసీని ఆశ్రయించింది. తాజా నివేదికతో నీటి లభ్యతపై ఏపీ చేస్తున్న అడ్డగోలువాదనలన్నీ పటాపంచలలయ్యాయి.
సీడబ్ల్యూసీ తాజా మదింపులో రీ జనరేషన్ వాటర్ను లెక్కించలేదని అధికారులు చెప్తున్నారు. సాగునీటికి వినియోగించే నీళ్లల్లో 10 శాతం, పారిశ్రామిక అవసరాలకు వాడిన నీటిలో 80 శాతం, తాగునీటికి సంబంధించి 97.5 శాతం నీళ్లు తిరిగి నదిలోనే కలుస్తుంటాయని గుర్తు చేశారు. తాజా నివేదికలో ఈ నీటిని కూడా పరిగణనలోకి తీసుకుంటే ఉమ్మడి ఏపీకి 1,500లకు పైగా టీఎంసీల నీటి లభ్యత ఉండేదని పేర్కొంటున్నారు.