తెలంగాణొచ్చింది.. పాతాళంల ఉన్న నీళ్లు చేతికందుతున్నయి. బీడువారిన భూములన్నీ పచ్చగ కళకళలాడుతున్నయి. మోడువారిన చెట్లు ఇగురువెట్టి సల్లటి గాలినిస్తున్నయి. ఇంకేం గావాలె.. ముల్లె, మూట సదురుకొని వలసపోయిన అచ్చమైన మనుషులు స్వచ్ఛమైన పల్లెటూరుకు వాపసొస్తున్నరు. ఆ మట్టి మనుషుల రాక కోసం ఎదురుజూస్తున్న పల్లెటూరి పెద్దర్వాజలు సాదరంగా స్వాగతం చెప్తున్నయి. గూడు చెదిరిన పచ్చులు ఇప్పుడు పిల్లాపాపలతో సంతోషంగా, సంబురంగా జీవనం సాగిస్తున్నయి. తెలంగాణ మట్టి మనుషులు వలసలు పోవుడు పక్కనవెడితే.. తెలంగాణకే పక్క రాష్ర్టాల నుంచి వలసొస్తున్నరు. అవును, ఇప్పుడు తెలంగాణ నిండు కుండ. ఆ సల్లటి కుండల నీళ్లు తాగుతాంటే పానం లేసొస్తున్నది.
అది అచ్చమైన పల్లెటూరు, స్వచ్ఛమైన మనుషులు. కానీ, నాటి ఉమ్మడి పాలకుల పుణ్యమాని ఆ పల్లె ఇచ్చుకవోయింది. కారణం.. పచ్చగుండాల్సిన పల్లె పొలాలు బీడువారిపోయినయి. కూలోనాలో జేసి ఉన్నకాన్నే ఎన్నో కొన్ని పైసలు కూడవెట్టాలనుకుంటే.. ఆ మట్టి మనుషులకు కూలీ కరువైంది. కూడుకు, కూలీకే దిక్కులేదంటే ఇగ ఎదిగిన ఆడివిల్లల్ని అత్తగారింటికి సాగదోలేదెట్ల? అందుకే కలకాలం కలిసుండాల్సిన ఆలుమగలు గూడు చెదిరిన పచ్చులోలె చెట్టుకొగలు పుట్టకొగలైర్రు. కన్నీళ్లు దీసుకుంట వలస బాట వట్టిర్రు. అంతే.. ఆ అచ్చమైన పల్లెటూరు పెద్దర్వాజలన్నీ మూసుకుపోయినయి. తెలంగాణ వచ్చినంకనే తెరుసుకున్నయి. బతుకులు మారినయి.
2006.. ఎవుసం అంటే వేణుకు ఎనలేని ప్రేమ. అందుకే సదువు మీదికన్న ఎవుసం మీదనే ఎక్కువ శ్రద్ధ వెట్టిండు. పన్నెండైపోంగనే నాన్న దంటకు వొయి నాగలి వట్టిన వేణుకు కొన్నొద్దులు జేసిన తర్వాత ఎవుసం అంటే ఏవగింపొచ్చింది. ఎందుకంటే వాళ్ల నాన్న కమలాకర్రావు ఆయనను ఓ రోజు అద్దుమనాత్రి పొలం కాడికి తోల్కవోయిండు. పన్నెండు గంటలకు నిద్రలకెల్లి లేసి బాయికాడికి వోయిన వేణు కరెంటు వెట్టి ఇటు మల్గిండో లేదో.. నీళ్ల సప్పుడుకు ఒడ్లపొంటి వన్న పెద్ద నాగుంబాము లేసి బుసలు కొట్టింది. అదేడ కాటేస్తదోనని భయపడ్డ వేణు నాన్న దగ్గర్కి ఉర్కుడువెట్టిండు. ఇదిట్లా ఉంటే.. తనతోని సదువుకున్న దోస్తు గంగాధర్ ఓ రోజు గిట్లనే అద్దుమనాత్రి బాయికాడికి కరెంటు వెట్టవోతే అది షాక్ కొట్టి కాలంజేసిండు. గంగాధర్కు అప్పటికే పెండ్లయి, ఇద్దరు సంటి పిల్లలు. గంగాధర్ భార్య ఏడుపు జూసిన వేణుకు మస్తు బాధనిపించింది. ఈ ఎవుసం జేత్తే మన బతుకు గూడ గిట్లనే అయితది గావచ్చునని భయపడి దూరదేశం దుబాయి బాట వట్టిండు.“ఒక్కగానొక్క కొడుకువు బిడ్డా.. దుబాయి వద్దు, దూరదేశం వద్దు. కలో, గంజో.. అందరం కలిసే ఉందాం, కలిసే తిందాం” అని అమ్మా-నాన్న మస్తు బతిలాడిర్రు. కానీ, వేణుకిక్కడ బతుకుదెరువు దొర్కలే.
2007… ‘దూరపు కొండలు నునుపు’ అనే సామెత దుబాయికి వోయినంక గుర్తుకొచ్చింది వేణుకు. మస్తు సంపాదించుకోవచ్చనే ఆశతో దుబాయికి వోయిన వేణు పరిస్థితి.. పెనం మీదినుంచి పొయ్యిల వడ్డట్టయ్యింది. ఓ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కంపినీల వేణుకు స్టోర్ కీపర్గా నౌకరి దొరికింది. నెలకు రూ.9 వేల జీతం. వాడు వెట్టింది తినాలె, వాడు చెప్పిన పన్జెయ్యాలె. ఓ రోజు మబ్బుల నాలుగ్గంటలకు పనిమీదికి వోయిన వేణు.. 36 గంటల దాన్క ఇరాం లేకుండ పనిజేసిండు. కడుపు నిండా అన్నం లేదు, కంటి నిండా నిద్ర లేదు. ‘ఎందుకురా ఈ బతుకు! ఉన్నదో లేందో ఇంటికాన్నే తిని, ఊళ్లెనే ఉంటే అయిపోవు!’ అనిపించిందట. అట్లనో.. ఇట్లనో కట్టానికి అలవాటువడ్డ వేణు.. తెలంగాణొచ్చినంక 2016లో మళ్లా అల్లీపూర్ల కాలువెట్టిండు.
జైతాల జ్లిలా రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన దాసారపు వేణు.. భార్య, ఇద్దరు పిల్లలతోని ఇప్పుడు సంబురంగ ఉంటున్నడు. తనను కన్న అమ్మా-నాన్నలను కంటినిండా జూసుకుంటున్నడు. కలో, గంజో కడుపు నిండా తింటున్నడు. నాన్న కమలాకర్రావు నుంచి తనకు వారసత్వంగా వచ్చిన మూడెకరాల భూమిని సాగు జేసుకుంటూ.. పల్లి, చెరుకు, వరి ఇలా తీరొక్క పంట పండిస్తున్నడు. మొన్ననే తన మామిడితోట నుంచి 12 టన్నుల మామిడికాయలను మార్కెట్కు పంపించిండు. పెట్టుబడి సాయం కింద ‘రైతుబంధు’ పైసల్ ఏటా వడ్తున్నయి. 24 గంటల కరెంటొస్తున్నది. “ఇప్పటి ‘రైతుబీమా’ పథకం నాడుంటే నా దోస్తు గంగాధర్ కుటుంబానికి రూ.5 లక్షలన్న వస్తుండె!” అని బాధవడ్తున్నడు. “మళ్లోసారి దుబాయికి వోతవానే వేణన్నా!?” అనడిగితే.. “దుబ్బ బుక్కనా దుబాయికి వోవుడు?” అని ఉల్టా నన్నే ప్రశ్నిస్తున్నడు. అవును కదా..? తెలంగాణ ప్రభుత్వం అన్నిరకాల సౌలత్లు కల్పిస్తున్నది. రెండుజేతులా ఇక్కన్నే పని ఉన్నంక, ఇగ దూర దేశంతోని మనకేం పని ఉంటది?
రెడ్డిపేట్ గ్రామం, రామారెడ్డి మండలం, కామారెడ్డి జిల్లాకు చెందిన పొనుగంటి లక్ష్మీనర్సింహులుకు ఎనిమిదెకరాల భూమున్నది. ఎవుసం అంటే లచ్నారికి మస్తిష్టం. పేరుకే ఎనిమిదెకరాలన్నట్టుగని దాన్ని సాగుజేద్దామంటే సరిపడా నీళ్లు లెవ్వు. ఓయేడు కాలాన్ని నమ్ముకొని ఎవుసం జేద్దామని అడుగు ముందుకేసిండు. లాగోడి కర్సుల కోసం పైసల్ మిత్తికి దెచ్చిండు. నాగలినెత్తుకొని పొలాన్ని దున్నితే.. పొలం పొట్టకొచ్చే మోపున కాలం కానరాకుండ వోయింది. లాభమేమోగానీ, లాగోడి కర్సులు గూడ మీదవడ్డయి. ఇగ ఈ ఎవుసాన్ని నమ్ముకొంటే జీవితంల పెద్దగ్గామని లచ్నారికి ఎర్కయింది. అందుకే తన భూమిని బీడుంచిండు. లచ్నారికి ఇద్దరు బిడ్డలు, ఒక కొడుకు. రోజులు గడుస్తుంటే.. వాళ్లు పెద్దగైతున్నరు గనీ లచ్నారి సంపద మాత్రం పెరుగుతలేదు. అదివోను మీదికెల్లి అప్పులైతున్నయి. అందుకే లచ్నారి సౌదీ బాటవట్టిండు. ఒక్కేడు గాదు, రెండేండ్లు గాదు.. ఏకంగా ఇరువై ఆరేండ్లు అక్కన్నే ఉన్నడు.
ఇంతకీ లచ్నారి సౌదీల ఏంజేసిండో ఎరుకేనా!? ఎవుసమే జేసిండు. గొర్లు గాసిండు, మ్యాకలకు మ్యాతేసిండు. వంకాయ తోటకు నీళ్లు వెట్టిండు, బెండకాయలు దెంపిండు, టమాటలు పార్శల్ జేసిండు. ఒక్క వరి దప్ప.. అన్ని పంటలు పండిచ్చిండు. లచ్నారి ఎవుసం జేసినకాడ మొత్తం ఇసుకే.. ఆ ఇసుకల్నే ఎవుసం జెయ్యాలె. ఎర్రటెండకు భూమ్మీదనే నడువలేం. అసొంటిది ఎర్రటి ఎండల, సుర్కుమనిపించే ఇసుకల ఎవుసం జేసిండంటే.. లచ్నారి కట్టం ఎంతటిదో అర్థం జేసుకోవచ్చు. తెలంగాణొచ్చినంక రైతుల బతుకులు బాగుపడ్డయని లచ్నారికి ఎర్కయింది. ఇగ ఇంటికి బైలెల్దామనుకునే మోపున.. కరోనా అడ్డమొచ్చింది. కంపినోళ్లే టిక్కెట్టు వెట్టుకొని ఇంటికి పంపాల్సింది వోయి..
ఉన్న నౌఖరి ఊడగొట్టిర్రు. అదివోను 43 వేల రియాళ్ల జీతం ఆగవట్టుకున్నరు. ‘ఎవ్వలతోని చెప్పుకొంటవో చెప్పుకో పో!’ అని తరిమేసిర్రు. ఇన్నొద్దులు పన్జేసినందుకు బోనసొస్తదని ఆశవడ్డ లచ్నారికి.. నిరాశే ఎదురైంది. పది నెలలు సోపతిగాళ్ల దగ్గర తినుకుంట ఉత్తగున్నడు. వాళ్లే తలా ఇన్ని పైసల్ జమజేసి ఇస్తే.. 2021ల రెడ్డిపేట్లోని తనింటికి చేరుకున్నడు.
సౌదీకి వోయే ముందు.. బీడువడి ఉన్న తన భూముల్ల తుమ్మలు మొల్శి ఉండె. ఇప్పుడు గవ్వే భూములు.. పచ్చగ రామశిల్కోలె మెరుస్తున్నయి. 24 గంటల కరెంటు, రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ వంటి రైతులకు మేలుజేసే ఎన్నో పథకాలు లచ్నారిని సంబురవెడుతున్నయి. “లచ్నారీ! మళ్ల వోతవా సౌదీకి!?” అనగడిగితే.. “సావడానికా సౌదీ వోవుడు” అంటున్నడు. ఇప్పుడు ఇంటికాన్నే ఎవుసం జేసుకుంట.. తన కట్టం తనే తింటున్నడు. మనుమలు, మనమరాండ్లతో సంబురంగ ఉంటున్నడు.
నారాయణ, వేణు, లచ్నారి అసొంటి తెలంగాణ మట్టి మనుషులెందరో నాడు ఉపాధి లేక వలసబాట వట్టిర్రు. దూరదేశాలే కాదు.. మన దేశంలోని సూరత్, షోలాపూర్, భీవండి లాంటి పట్టణాలకూ వలసవోయిర్రు. తెలంగాణొచ్చినంక ఇక్కడికే మస్తుమంది వలసొస్తున్నరని దెల్సి.. తెలంగాణ వలస కూలీలందరూ తమ తమ ఇండ్లకు చేరుకున్నరు. తమ భూములు తామే సాగు జేసుకుంటూ ఇంటోళ్లతోని సంతోషంగ ఉంటున్నరు. మొత్తంగా తెలంగాణల వలసలు తగ్గినయనేది ఎంత వాస్తవమో, తెలంగాణకు వలసలు పెరిగినయనే ముచ్చట గూడ అంతే వాస్తవం!
మచ్చుకొక ఉదాహరణ.. గత యాసంగిలో నాట్లేసేటందుకు యూపీ నుంచి మొగ కూలీలు తెలంగాణలోని అల్లీపూరుకు వలస వచ్చిర్రు. “మా రాష్ట్రంలో ఉపాధి కరువైంది. ఉపాధి ఉన్నా కూలీ తక్కువ ఇస్తున్నరు. తెలంగాణలో పని ఎక్కువే! కూలి ఎక్కువే! ఆ కష్టమేదో ఇక్కడ జేస్తే నాలుగు పైసల్ ఎక్కువొస్తయి. అందుకనే మేం తెలంగాణకు వచ్చినం!” అంటున్నరు యూపీ కూలీలు. ఒక్క యూపీనే కాదు.. బీహార్, రాజస్థాన్ తదితర రాష్ర్టాల నుంచి కూలీలు తెలంగాణకు వలస వస్తున్నరు.
నారాయణ-రాధవ్వలది నిరుపేద రైతు కుటుంబం. ఓ చింతచెట్టు, దాని సుట్టూ నాలుగు గుంజలు పాతుకొని, వాటిమీదికెల్లి నాలుగు తాటికమ్మలు కప్పుకొన్నరు. వాళ్లకదే పెద్ద బంగ్లా. ఆ బంగ్లాలనే వాళ్ల జీవితం గడిసింది. వీరికి ఇద్దరాడివిల్లలు, ఒక్క మొగవోరడు. పెద్ద బిడ్డ ఏడు దాన్క సదివింది. “సదివినకాడికి సాల్తియ్ బిడ్డా.. ఇద్దరం జేసినా తిండికెల్తలేదు” అని తల్లి రాధవ్వ అంటే.. ఎంతకంతే ఆసరా అని పెద్ద బిడ్డ పద్దుమ బీడీలు సుట్టే పనికి కుదిరింది. ఎదిగిన ఆడివిల్ల ఇంటిమీదుంటే పాలోల్లు, సుట్టాలు సూటిపోటి మాటలతోని సంపుతరని పెద్ద బిడ్డకు జెప్పన లగ్గంజేసి ఎల్లగొట్టాలని ముందటవడ్డరు నారాయణ దంపతులు. పెద్ద బిడ్డకు లగ్గమైంది. ఏడాది, రెండేండ్లు తిరుగకముందే చిన్నబిడ్డ భాగ్యవ్వ
గ్గూడ లగ్గం జేసిర్రు.
ఈడిదాన్క మంచిగనే ఉంది, ఇప్పుడే మొదలైతది అసలు కథ. కన్నీళ్లతో కన్నబిడ్డలను సాగనంపిన నారాయణ-రాధవ్వలు తిరిగి ఎన్కకు జూసుకుంటే.. నడి నెత్తిమీన అప్పు కుప్పయి కూసున్నది. ఎవుసం జేసి ఎట్లనో అట్ల తీరుద్దామనే ధైర్నంతోని అప్పుదెస్తే కాలం పాడుగాను పగవట్టినట్టు అటేవోయింది. ‘కాలంగాకున్నా కరెంటన్న సహకరించదా!?’ అని దాన్ని నమ్ముకుంటే అదీ సక్కగుండదు. కరెంటున్నా.. బాయిల నీళ్లు సక్కగుండయి. ఇగ నాటెక్కడిది? కోతెక్కడిది? ఒక్కేడా, రెండేండ్లా.. ఇట్లా ఏండ్లకేండ్లు! నారాయణ భూమంతా పడావువడే ఉన్నది. వాళ్ల బాధల్ని జూసి అప్పు ఇచ్చిన సేటు ఊకుంటడా.. ఇచ్చిన పైసలు మిత్తితోని కలిపి తిరిగియ్యకుంటే ఇజ్జత్ దీస్తడు. ఓ రోజు అప్పిచ్చిన సేటు ఇంటికాడికొచ్చి లొల్లిలొల్లి జేస్తే.. ఎదుటి మనిషితోని మాటవడని నారాయణ “సేటూ! నేనిగ దూరదేశం వోతున్న.. నీ పైసలు నీకు రూపాయి వోకుండ ముట్టజెప్పుత” అని మాటిచ్చి ముల్లె, మూట సదురుకున్నడు. కన్నోళ్లను, కట్టుకున్నదాన్ని ఇడిసివెట్టి గాలి మోటరెక్కిండు. 2001-02ల దుబాయికి వోయిన నారాయణ.. తెలంగాణొచ్చినంక 2018ల తనింటికి తానొచ్చిండు. “నేన్జూసిన తెలంగాణనేనా ఇది!?” అని ఇప్పుడు
బిత్తరవోతున్నడు.
నాకు ఎకురం మీద పద్దెనిమిది గుంటల భూమి ఉన్నది. ఏం లాభం? దాన్ని సాగుజేసేటందుకు మాత్రం సుక్క నీళ్లు లెవ్వు. నీళ్లు వడ్తయనే ఆశతోని 300 ఫీట్లు బోరేసిన. 200 వందల ఫీట్లకు సుక్క నీళ్లు వల్లేదు గని సూక బండ వడ్డది. ఆ బండ తేలిపోతదనే ఆశకొద్ది ఇంకో వంద ఎక్కువనే ఏపిచ్చిన. అది తేలిపోలేదు గని నన్ను నిండా ముంచింది. అప్పులపాలై 2004ల దుబాయి వోయిన. అక్కడ స్టోర్ కీపర్గ పన్జేసిన. తెలంగాణొచ్చినింక మన బతుకులు బాగుపడుతున్నయని దెల్సి వాపసొచ్చిన. ఎకురం మీద పద్దెనిమిది గుంటల భూమి ఇప్పుడు నాలుగెకురాలైంది. ఇప్పుడు నీళ్లకు సావు లేదు. బాయి నిండా నీళ్లుంటున్నయి. ఏటా రెండు పంటలు దీసుకుంట పెండ్లాం పిల్లలతో సంబురంగా ఉంటున్న.
– కొండపల్కుల రత్నాకర్రావు, అల్లీపూర్, రాయికల్ మండలం, జైతాల
-గడ్డం సతీష్
-చిన్న యాదగిరి గౌడ్