హైదరాబాద్, మే 27(నమస్తే తెలంగాణ) : మక్కల కొనుగోలులో ఆలస్యం చేస్తున్న ప్రభుత్వం.. కొనుగోలు తర్వాత పైసలు ఇవ్వడంలోనూ అంతకు మించి నిర్లక్ష్యం చేస్తున్నదని రైతులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో మక్క రైతులకు రూ.1,173 కోట్లు విడుదల చేస్తున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇప్పటివరకు 13.42 లక్షల టన్నుల మక్కలను కొనుగోలు చేశామని వెల్లడించారు. ఇందుకు సంబంధించి రైతులకు రూ.3,220 కోట్లు చెల్లించాల్సి ఉన్నది.
అయితే, ప్రభుత్వం ప్రస్తుతం రూ.1,173 కోట్లు మాత్రమే విడుదల చేసింది. ఇంకా రూ.2,047 చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే మక్కలు కొనుగోలు చేసి నెల రోజులవుతున్నది. అయినప్పటికీ ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో నయా పైసా కూడా జమ చేయలేదు. ప్రస్తుతం విడుదల చేసిన నిధులు కూడా మరో రెండు రోజుల తర్వాతనే రైతుల ఖాతాల్లో జమవుతాయని ప్రభుత్వం పేర్కొన్నది. ఇక మిగిలిన నిధులు ఎప్పుడు జమ చేస్తుందోననే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.