హైదరాబాద్, నవంబర్30 (నమస్తే తెలంగాణ): పోలవరం జలాశయం డెడ్ స్టోరేజీ నుంచి నీటిని వాడుకునేందుకు ఏపీ ప్రభుత్వం కొత్తగా చేపట్టిన ఎత్తిపోతల పథకం పనులను వెంటనే నిలిపివేయించాలని, ఆ దిశగా గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ) తక్షణమే చర్యలు చేపట్టాలని తెలంగాణ సర్కారు డిమాండ్ చేసింది. ఈ మేరకు జీఆర్ఎంబీ చైర్మన్కు తెలంగాణ సాగునీటి పారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్ బుధవారం లేఖ రాశారు. ఏపీ ప్రభుత్వం చేపట్టిన కొత్త ఎత్తిపోతల పథకం పోలవరం ప్రాజెక్టు టీఏసీ నిబంధనలను ఉల్లంఘిస్తున్నదని పేర్కొన్నారు. అదీగాక కొత్త ఎత్తిపోతల పథకం వల్ల ఇప్పటికే ఉన్న గోదావరి డెల్టా సిస్టమ్పై తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరించారు. ఈ కొత్త ఎత్తిపోతల అంశం పోలవరం ప్రాజెక్టు అథారిటీ 14వ సమావేశంలో చర్చకు వచ్చిందని గుర్తుచేశారు.
ఈ సందర్భంగానే ఆ పథకం డీపీఆర్లను అనుమతుల కోసం వెంటనే సీడబ్ల్యూసీ, జీఆర్ఎంబీకి అందజేయాలని, అప్పటివరకు పనులను నిలిపేయాలని ఏపీ ప్రభుత్వానికి పీపీఏ ఆదేశాలు జారీ చేసిందని గుర్తుచేశారు. కేంద్ర జల్శక్తి శాఖ కూడా కొత్త ఎత్తిపోతల పథకంపై ఇప్పటికే అనేక అభ్యంతరాలను వ్యక్తం చేసిందని, ఆ పనులను నిలిపేయాలని ఏపీని గత మే నెలలోనే ఆదేశించిందని తెలంగాణ సర్కారు ఈ సందర్భంగా గుర్తుచేసింది. అయినప్పటికీ ఏపీ ప్రభుత్వం కేంద్ర ఆదేశాలను బేఖాతర్ చేస్తూ పనులను కొనసాగిస్తున్నదని తెలంగాణ సర్కారు ఆక్షేపించింది. గతంలో పోలవరం ప్రాజెక్టు క్షేత్రపర్యటనకు వెళ్లిన కేంద్ర అధికారులు సైతం దానిని గుర్తించారని, పనులను నిలిపేయాలని ఆదేశించారని తెలిపింది. అందుకు సంబంధించిన వార్తలు కూడా పలు పత్రికల్లో వచ్చాయని తెలిపింది. ఏపీ ఏమాత్రం పట్టించుకోకుండా పనులను కొనసాగిస్తున్నదని మండిపడింది. ఇకనైనా జీఆర్ఎంబీ వెంటనే జోక్యం చేసుకుని ఏపీ సర్కారు కొనసాగిస్తున్న ఎత్తిపోతల పనులను వెంటనే నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. లేఖతో పాటు కొత్త ఎత్తిపోతల పథకంపై ఇటీవల పలు పత్రికల్లో వచ్చిన కథనాలను కూడా జతచేసి జీఆర్ఎంబీకి అందజేసింది.