Harish Rao | సిద్దిపేట రూరల్, మార్చి 5: ‘కేంద్రం కొనకపోతే మనకు కేసీఆర్ ఉన్నాడు. యాసంగి రైతులకు అన్యాయం జరుగనివ్వడు. బాయిల్డ్రైస్ కొనుగోలుమీద ఒకవేళ కేంద్రం మొరాయిస్తే.. రైతును ఆదుకొనేందుకు కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులకు నష్టం కలుగకుండా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ధాన్యం సేకరణకు సిద్ధపడాలని ఆయన ఇప్పటికే పౌరసరఫరాల శాఖకు సూచనలిచ్చారు.. గత ఏడాది కూడా యాసంగి వడ్ల కొనుగోలుకు కేంద్రం ఇబ్బంది పెడితే, కేసీఆర్ చొరవ తీసుకొని కొనుగోలు చేశారు. కేసీఆర్ రైతు పక్షపాతి. రైతులకోసం అనేక పథకాలు చేపట్టారు.
కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టి నీళ్లిచ్చారు. ఉచితంగా కరెంటు ఇస్తున్నారు’ అని ఆర్థిక మంత్రి హరీశ్రావు రైతులకు భరోసా ఇచ్చారు. ఆదివారం ఆయన సిద్దిపేట రూరల్ మండలం చిన్నగుండవెళ్లి, రావురూకుల, బుస్సాపూర్ గ్రామాల్లో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్తో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. యాసంగి వడ్ల కొనుగోలు విషయంలో కేంద్రం మళ్లీ పాతపాటే పాడుతున్నదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఈ యాసంగి కూడా రైతులు భారీగా వరి సాగు చేశారు. దీంతో బాయిల్డ్రైస్ సేకరించాలని ఇటీవల పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కేంద్రాన్ని కోరారు. కేంద్రం మాత్రం గింజకూడా తీసుకోబోమని మొండికేసింది. ఈ నేపథ్యంలో రైతులకు నష్టం రానివ్వబోమని మంత్రి హరీశ్రావు భరోసా ఇచ్చారు.
తెలంగాణ ప్రజలకు అన్నం తినడం నేర్పింది తామేనంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించడం విడ్డూరమని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు జొన్న, మక్కగట్క తప్ప ఏమీ తినలేదని చంద్రబాబు అనడం తెలంగాణ ప్రజలను అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణకు ఘనమైన చరిత్ర ఉన్నదనే విషయాన్ని చంద్రబాబు తెలుసుకోవాలని హితవు చెప్పారు. ఢిల్లీలోని బీజేపీ మంత్రులు కూడా తెలంగాణ ప్రజలకు నూకలు తినడం నేర్పించాలంటూ హేళనగా మాట్లాడారని గుర్తుచేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణలో 16 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి పండించగా ప్రస్తుతం 54 లక్షల ఎకరాల్లో వరి సాగవుతున్నదని, దేశానికే అన్నం పెట్టే స్థాయికి ఎదిగిందని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతోనే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు.
కేసీఆర్ అందిస్తున్న చేయూతతో తెలంగాణ రైతులు సాగులో అద్భుతాలు సృష్టిస్తున్నారని చెప్పారు. తెలంగాణ ధాన్యం నాలుగు రాష్ర్టాలకు సరఫరా అవుతున్నదని తెలిపారు. యాసంగి ధాన్యం కొనుగోలుపై కేంద్రం పేచీ పెడుతున్నదని మండిపడ్డారు. తెలంగాణలో ఆయిల్పాం సాగుకు మంచి భవిష్యత్తు ఉన్నదని, దీని సాగుకు రైతులు ముందుకు రావాలని సూచించారు. ఆయిల్పాం సాగు కోసం రాష్ట్ర బడ్జెట్లో రూ.1,000 కోట్లు కేటాయంచామని తెలిపారు. ఆయిల్పాం రైతులను సబ్సిడీల రూపంలో ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని చెప్పారు. తెలంగాణలో రైతు రాజ్యం నడుస్తున్నదని పేర్కొన్నారు.
తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఏమీ మాట్లాడాలో తెలియక నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మంత్రి హరీశ్రావు విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్ రాష్ర్టాల్లో తెలంగాణ తరహా పథకాలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. చేతకాని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. వ్యవసాయ బోరు బావులకు కేంద్రం మీటర్లు పెట్టాలని ఒత్తిడి తెస్తున్నదని విమర్శించారు. రైతుల శ్రేయస్సుకోరే సీఎం కేసీఆర్ మీటర్ల ప్రతిపాదనను తిరస్కరించడంతో తెలంగాణకు రావాల్సిన రూ.30 వేల కోట్ల నిధులు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. ఎఫ్ఆర్బీఎం పరిమితిని పెంచాలని తెలంగాణ ప్రభుత్వం కోరినా కేంద్రం పెడచెవిన పెడుతున్నదని, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా సంక్షేమ, అభివృద్ధి పథకాలు కొనసాగుతాయని స్పష్టంచేశారు.