హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): ‘నాడు సాగరహారమై సమరాంగణమైన తెలంగాణ నేడు సముజ్వల తేజమై విలసిల్లుతున్నది. పాలరాతి శిల్పంపై పాలవెల్లి ప్రవహించినట్టు స్వచ్ఛమైన పాలనకు అచ్చమైన సందర్భాన్ని తెలంగాణ ఆవిష్కరించింది. 60 ఏండ్లలో జరిగిన విధ్వంసాన్ని పదేండ్లలోనే రూపుమాపింది’ అని శుక్రవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం వేదికగా ప్రారంభమైన తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ప్రారంభం నిరూపించింది. ‘నిన్నటి ఉద్యమ తెలంగాణ.. నేడు ఉజ్వల తెలంగాణగా వాసికెక్కింది’ అని తెలంగాణ అవతరణ సందేశంలో సీఎం కేసీఆర్ సోదాహరణగా ఒక్కొక్క రంగంలో సాధించిన ప్రగతిని ఆవిష్కరించారు. గత ఏప్రిల్ 30న నూతన సచివాలయం ప్రారంభమైన తర్వాత జరిగిన తొలి రాష్ట్ర అవతరణ వేడుకలు కావడంతో అసాధారణ ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ అన్ని రంగాల్లో సాధించిన ప్రగతిని అక్షరబద్ధం చేశారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం కొత్త చరిత్రకు వారధి కట్టింది. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పదేండ్లకాలంలో చేపట్టిన ప్రగతిని దోసిటపట్టింది. రాష్ట్రంలోని అన్ని వర్గాలు, అన్ని సమూహాల సమాహారంగా తెలంగాణ విల్లసిల్లుతున్నదనే సత్యాన్ని సీఎం కేసీఆర్ గణాంకాలతో సహా ఆవిష్కరించారు. అనతికాలంలోనే అన్ని రంగాల్లో తెలంగాణ దేశానికి దిక్సూచిగా ఎలా మారిందో.. దాని నేపథ్యం ఏమిటో తనకు మాత్రమే తెలిసిన సీఎం కేసీఆర్ తనదైన శైలిలో ప్రజల ముందు ఉంచారు. శుక్రవారం ఉదయం 10.35 గంటలకు ప్రారంభమైన సీఎం కేసీఆర్ అవతరణ సందేశం 12.59 గంటల దాకా నిరాఘాటంగా కొనసాగింది. 40.6 డిగ్రీల ఉష్ణోగ్రత.. జోరుగా వడగాడ్పు.. అయినా సరే సీఎం కేసీఆర్ తన ప్రసంగాన్ని ఎక్కడా ఆపలేదు. తన ఎదురుగా ఆసీనులైన వందలాది మంది ప్రజాప్రతినిధులు, వివిధ విభాగాల అధిపతులు తదేక దీక్షతో ఆయన ప్రసంగాన్ని ఆసాంతం వింటూనే ఉన్నారు. 60 ఏండ్లపాటు తెలంగాణలో అన్ని రంగాల్లో జరిగిన విధ్వంసాన్ని చెప్తూనే 9 ఏండ్ల కాలంలో చేపట్టిన కార్యక్రమాలను హేతుబద్ధంగా వివరించారు. ఒక్కొక్క రంగంలో ఎక్కిన నిచ్చెనమెట్ల ప్రగతి సౌధాన్ని కండ్లముందు ఉంచారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 48 పేజీల ప్రగతి గ్రంథాన్ని ప్రజల కండ్లకుగట్టారు. సీఎం కేసీఆర్ గంటన్నర ప్రసంగం ఆసాంతం స్పష్టమైన పదబంధాలతో కొనసాగింది. తెలంగాణ రిథమ్ ఉట్టిపడే సోదాహరణలతో తనదైన శైలిలో సాధించిన ప్రగతిని ఆయన ప్రజలకు నివేదించారు.
‘తెలంగాణ స్వరాష్ట్ర సాధన ఉద్యమానికి, తెలంగాణ పునర్నిర్మాణానికి రెండింటి సారథ్యం వహించే సువర్ణావకాశాన్ని, అదృష్టాన్ని నాకు ప్రసాదించిన తెలంగాణ ప్రజానీకానికి నేను సర్వదా..శతదా..సహస్రదా కృతజ్ఞుడను. నాకు ప్రాణ సమానమైన తెలంగాణ చేరాల్సిన గమ్యాలు, అందుకోవాల్సిన అత్యున్నత శిఖరాలు మరెన్నో ఉన్నాయి. మీ అందరి దీవెనలతో నా శరీరంలో సత్తువ ఉన్నంత వరకూ నేను తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికోసం పరిశ్రమిస్తూనే ఉంటానని మాట ఇస్తున్నాను’ అని ఉద్యమానికి నాయకత్వం వహించిన నేతగా, దేశం గర్వపడే రాష్ట్రంగా తీర్చిదిద్దే అవకాశం కల్పించిన యావత్తు తెలంగాణ సమాజానికి సీఎం కేసీఆర్ వినమ్రపూర్వక కృతజ్ఞతలు చెప్పారు. మొత్తంగా ఎవరు పనిమంతులో.. ఎవరివి పనికిమాలిన మాటలో తేల్చుకోవాల్సింది ప్రజలేనని ఆయన చెప్పకనే చెప్పారు. ‘ఇది దశాబ్ది ముంగిట నిలిచిన తెలంగాణ విప్లవాత్మక విజయయాత్ర. ఉద్యమం నుంచి ఉజ్వల ప్రగతి దాకా సాగిన జయ పరంపరల జనగాథ. నేడు నా రాష్ట్రం భారత వినీలాకాశంలో వెలుగులు విరజిమ్ముతున్న ధ్రువతార’ అని చెప్పటం ద్వారా రాబోయే కాలంలో తెలంగాణ మరింత ఉజ్వలంగా ఎదిగి దేశంలోనే మహోజ్వల సంపన్న రాష్ట్రంగా నిలుస్తుందని ఆకాంక్షించారు.