IT Returns | హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): అనతికాలంలోనే తెలంగాణ దేశంలోనే తిరుగులేని ఆర్థిక శక్తిగా ఎదిగింది. తలసరి ఆదాయం, జీఎస్డీపీలో అనూహ్య వృద్ధి సాధించి దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ.. ఆదాయ పన్ను (ఐటీ) చెల్లింపుల్లోనూ నంబర్ వన్ స్థానానికి ఎగబాకింది. 2019-20 ఆర్థిక సంవత్సరం నాటికి తెలంగాణలో 21,58,703గా ఉన్న ఐటీ చెల్లింపుదారుల సంఖ్య 2022-23 ఆర్థిక సంవత్సరంలో 26,92,185కి పెరిగింది. తద్వారా గత నాలుగేండ్లలో దాదాపు 25 శాతం వృద్ధిరేటు నమోదైంది. ఇదే సమయంలో దేశ సగటు వృద్ధిరేటు 15 శాతానికే పరిమితమైంది. ఇది తెలంగాణ వృద్ధిరేటు కంటే 10 శాతం తక్కువ. ఎన్నో ఏండ్ల చరిత్ర కలిగిన, ఆర్థికంగా ఎంతో బలమైనవిగా పేరుపొందిన రాష్ర్టాలు సైతం తెలంగాణ ముందు చిన్నబోయాయి. 2019-20లో దేశవ్యాప్తంగా 6,69,14,905 మంది ఆదాయ పన్ను చెల్లించారు. 2022-23 చివరి నాటికి ఈ సంఖ్య కేవలం 70,94,141 మాత్రమే పెరిగి 7,40,09,046 చేరింది. ఇదే సమయంలో తెలంగాణలో ఐటీ చెల్లింపుదారుల సంఖ్య 5.33 లక్షలకుపైగా పెరగడం గమనార్హం.
గుజరాత్, ఉత్తరప్రదేశ్కు అందనంత ఎత్తులో తెలంగాణ
ఐటీ చెల్లింపుల వృద్ధిలో తెలంగాణ దేశంలోని ఏ రాష్ర్టానికీ అందనంత ఎత్తులో నిలిచింది. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాలు కనీసం తెలంగాణ దరిదాపుల్లో కూడా లేవు. ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్తోపాటు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్ కంటే తెలంగాణలో ఆదాయ పన్ను చెల్లింపుల వృద్ధిరేటు చాలా ఎక్కువ. 2019-23 మధ్య కాలంలో ఐటీ రిటర్నులు గుజరాత్లో 15 శాతం పెరగగా.. ఉత్తరప్రదేశ్లో 19 శాతం వృద్ధిరేటు నమోదైంది. ఈ నాలుగేండ్లలో తెలంగాణ వృద్ధిరేటు గుజరాత్ కంటే 10 శాతం, ఉత్తరప్రదేశ్ కంటే 6 శాతం అధికం. మిగిలిన బీజేపీ పాలిత రాష్ర్టాలు కూడా తెలంగాణ కంటే చాలా వెనుకబడ్డాయి. కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల పరిస్థితి మరింత దయనీయంగా ఉన్నది. గత నాలుగేండ్లలో ఐటీ చెల్లింపుదారుల వృద్ధిరేటు రాజస్థాన్లో 17 శాతానికి, ఛత్తీస్గఢ్లో 15 శాతానికి మించలేదు.