హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు అద్భుతంగా ఉన్నాయని, అవి దేశమంతా అమలు కావాలన్నదే తమ అభిలాష అని కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాల నేతలు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని కొనియాడారు.
ఆ మూడు రాష్ట్రాల రైతు సంఘాల నేతలు హైదరాబాద్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో మంగళవారం భేటీ అయ్యారు. రైతు బీమా, రైతు బంధు వంటి పథకాలు సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అనడానికి నిదర్శనమని ఈ సందర్భంగా వారు తేల్చిచెప్పారు. దేశంలో ఎక్కడ లేని విధంగా 24 గంటల పాటు ఉచిత విద్యుత్ అందిచడం బీఆర్ఎస్ ప్రభుత్వానికి మాత్రమే సాధ్యమైందని చెప్పారు.
సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ రైతులు అత్యంత సంతోషంగా ఉన్నారని, ఇతర రాష్ట్రాల రైతులు కూడా కేసీఆర్ వైపు చూస్తున్నారని తెలియజేశారు. రైతు సంక్షేమం కోసం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు, చేపడుతున్న పనులు దేశానికి స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని కొనియాడారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో మార్పులు సాధ్యమని ధీమా వ్యక్తం చేశారు. అబ్ కి బార్ కిసాన్ సర్కార్ నినాదంతో దేశంలో సమగ్ర మార్పు సాధ్యమని రైతు నేతలు స్పష్టం చేశారు.
రైతుల సంక్షమం కోసం తీవ్రంగా కృషి చేస్తున్న కేసీఆర్ నాయకత్వంలో పని చేయడానికి రైతు నేతలు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ మేరకు కవితతో చర్చలు జరిపారు. ఆయా రాష్ట్రాల్లోని రైతుల సమస్యలు కవిత దృష్టికి తీసుకొచ్చారు. గీత కార్మికుల సమస్యల పై కూడా చర్చించారు.