సంక్షేమ పథకాలు సదా కొనసాగాలి
బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం
తిరుమల శ్రీవారికి ప్రత్యేక పూజలు
హైదరాబాద్, మే2 (నమస్తే తెలంగాణ): బీసీల సమగ్ర వికాసం, సమున్నత లక్ష్యాల సాధన దిశగా బృహత్తర ప్రణాళికతో తెలంగాణ సర్కారు ముందుకు వెళ్తున్నదని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావు కొనియాడారు. ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు నిర్విఘ్నంగా కొనసాగాలని ఆకాంక్షించారు. సంక్షేమ ప్రదాతగా నిలుస్తున్న సీఎం కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉండాలని అభిలషించారు.
ఈ మేరకు తిరుమల శ్రీవారిని ప్రార్థించినట్టు ఆయన తెలిపారు. కుటుంబసమేతంగా తిరుమల శ్రీనివాసుడిని సోమవారం ఆయన దర్శించుకొన్నారు. అనంతరం రంగనాయక మండపంలో స్వామివారి శేష వస్త్రంతోపాటు లడ్డు, వడ, తీర్థ ప్రసాదాలను ఆలయ అధికారులు ఆయనకు అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీసీల ప్రగతి సామాజిక, విద్య, ఆర్థిక ఉపాధి రంగాలపై పటిష్టమైన చర్యల నిమిత్తం అధ్యయనం కొనసాగిస్తున్నామని చెప్పారు. అందులో భాగంగా ఈ నెలలోనే తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలో కమిషన్ సభ్యులతో కలిసి పర్యటించనున్నట్టు తెలిపారు.