హైదరాబాద్, జనవరి 24 : ముఖ్యమంత్రి కేసీఆర్కు ఉన్న మొక్కవోని జల సంకల్పం, నిధుల వినియోగంలో ప్రదర్శిస్తున్న పారదర్శకత రాష్ర్టానికి మరో గౌరవాన్ని సాధించి పెట్టింది. కొద్దిరోజుల క్రితం కాళేశ్వరం కార్పొరేషన్ లిమిటెడ్కు ఏ గ్రేడ్ ప్రకటించిన రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఆర్ఈసీ) తాజాగా తెలంగాణ రాష్ట్ర జలవనరుల మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ (టీఎస్డబ్ల్యూఆర్ఐడీసీఎల్)కు ఏ ప్లస్ గ్రేడ్ను ప్రకటించింది. నవరత్న హోదా కలిగిన కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఆర్ఈసీ ఇచ్చిన ఏ ప్లస్ గ్రేడింగ్తో తెలంగాణ పరపతి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింత ఇనుమడించింది. దీనితో ప్రాజెక్టుల నిర్మాణానికి తెచ్చిన రుణాలు, వాటి దన్నుతో సాధించిన విజయాలు, ఆయా అప్పులకు సంబంధించిన రుణ వాయిదాల చెల్లింపులో తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వమే క్లీన్చిట్ ఇచ్చినట్టయ్యింది. తరాల తండ్లాటను తీరుస్తూ.. ఏండ్లనాటి జల స్వప్నాలను ముఖ్యమంత్రి కేసీఆర్ సాకారం చేస్తున్న తీరుకు ఇది అద్దంపడుతున్నది. కేంద్ర విద్యుత్తుశాఖ పరిధిలోని ఆర్ఈసీ వివిధ రాష్ర్టాల్లో ప్రాజెక్టు నిర్మాణం కోసం సేకరించిన నిధులు, వాటిని వినియోగించిన తీరు, సాధించిన ఫలితాలు, రుణ వాయిదాల చెల్లింపులు, ఆయా ప్రాజెక్టుల నిర్వహణపై ఆడిటింగ్ తదితర అంశాలను లోతుగా అధ్యయనం చేసి, గ్రేడింగ్లను ప్రకటిస్తుంది. ఈ సంస్థ ఏ ప్లస్ గ్రేడింగ్ ఇవ్వడమంటే ప్రాజెక్టుల నిర్మాణం కోసం నిధులన్నీ పారదర్శకంగా ఖర్చయ్యాయని, ఆ నిధులతో చేపట్టిన పనుల వల్ల ఫలితం వచ్చిందని, రుణ వాయిదాలను సక్రమంగా చెల్లిస్తున్నారని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే సర్టిఫికెట్ ఇచ్చినట్టని నిపుణులు చెప్తున్నారు. భవిష్యత్తులో ప్రాజెక్టుల కోసం అవసరమైన రుణాలను తక్కువ వడ్డీతో, మరింత సులభంగా పొందేందుకు ఏ ప్లస్ గ్రేడ్ ఉపకరిస్తుందని సాగునీటి రంగ నిపుణులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.
ఏమిటీ టీఎస్డబ్ల్యూఆర్ఐడీసీఎల్..?
గోదావరి జలాల్లో రాష్ర్టానికి ఉన్న వాటా జలాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఏకకాలంలో అనేక ప్రాజెక్టులను చేపట్టింది. అందులో భాగంగా సీతారామ లిఫ్ట్, తుపాకులగూడెం (సమ్మక్క సాగర్), దేవాదుల, వరదకాలువ, సీతమ్మసాగర్తో పాటు పలు బరాజ్లు, కాలువలను నిర్మిస్తున్నది. వీటికి నిధుల కొరత లేకుండా, పనుల్లో జాప్యం జరగకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2018లో తెలంగాణ రాష్ట్ర జలవనరుల మౌలికవసతుల అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ను ఏర్పాటుచేసింది. ఇటీవల దీని పరిధిలోకి సీతమ్మసాగర్ ప్రాజెక్టును కూడా చేర్చింది. ప్రస్తుతం దీనికి చైర్మన్గా నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్, ఎండీగా కరీంనగర్ ఈఎన్సీ బీ శంకర్ వ్యవహరిస్తున్నారు. ఈఎన్సీలు మురళీధర్, అదనపు కార్యదర్శి ఎన్ శంకర్, టీఎస్ ట్రాన్స్కో డైరెక్టర్ జే సూర్యప్రకాశ్, ఆర్థికశాఖ అదనపు కార్యదర్శి ఆర్ రవి, వరంగల్ సీఈ విజయభాస్కర్, కొత్తగూడెం సీఈ శ్రీనివాస్రెడ్డి డైరెక్టర్లుగా ఉన్నారు. ఈ కార్పొరేషన్ ఆయా ప్రాజెక్టుల డిజైనింగ్ మొదలుకొని నిర్మాణం, నిధులు, రుణాల సేకరణ, ప్రాజెక్టు సాధిస్తున్న ఫలితాల వరకు అన్ని కీలక బాధ్యతలను పర్యవేక్షిస్తున్నది. ఇప్పటికే కార్పొరేషన్ పరిధిలోని సీతమ్మసాగర్ మినహా ఆయా ప్రాజెక్టుల పనులన్నీ దాదాపు తుదిదశకు చేరుకోవడమే కాకుండా, రైతులకు జల ఫలాలను అందిస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్ర జలవనరుల మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ ముఖ్యాంశాలు
ఏర్పాటైన సంవత్సరం: 2018 మార్చి 31
లక్ష్యం: గోదావరి జలాల్లో రాష్ర్టానికి ఉన్న వాటాను పూర్తిగా సద్వినియోగం చేసుకోవడం
పరిధిలోని ప్రాజెక్టులు: సీతారామ లిఫ్ట్, తుపాకులగూడెం (సమ్మక్కసాగర్), దేవాదుల, వరదకాలువ, సీతమ్మసాగర్, మరికొన్ని బరాజ్లు, కాలువలు.
కొత్త ఆయకట్టు: 11.18 లక్షల ఎకరాలు
స్థిరీకరణ ఆయకట్టు: 10.47 లక్షల ఎకరాలు
పారిశ్రామిక అవసరాలకు వినియోగం: 10 టీఎంసీలు
రుణాలు ఇచ్చిన బ్యాంకులు, సంస్థలు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఆర్ఈసీ, పీఎఫ్సీ
రాష్ట్ర ప్రగతికి సాక్ష్యం
ఆర్ఈసీ ప్రకటించిన ఏ ప్లస్ గ్రేడ్ సీఎం కేసీఆర్ జల సంకల్పానికి నిలువెత్తు నిదర్శనం. ప్రాజెక్టుల నిర్మాణం, వాటి ఫలాలు రైతులకు అందించడంలో రాష్ట్రం సాధించిన ప్రగతికి సాక్ష్యం. ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే జాతీయ స్థాయి గుర్తింపు దక్కింది. రాష్ట్ర ఇంజినీర్ల ప్రతిభకు ఇదొక గీటురాయి. చాలా ఆనందంగా ఉన్నది. కొత్త ఉత్సాహాన్ని నింపింది. -వీ ప్రకాశ్, చైర్మన్, టీఎస్డబ్ల్యూఆర్ఐడీసీ
తెలంగాణకు గర్వకారణం
జల వనరుల అభివృద్ధి కార్పొరేషన్కు ఆర్ఈసీ నుంచి ఏ ప్లస్ గ్రేడ్ రావడం తెలంగాణకు గర్వకారణం. జాతీయస్థాయిలో రాష్ట్ర పరపతి మరింత పెరిగింది. సీఎం కేసీఆర్ దార్శనికత, మొక్కవోని జల సంకల్పానికి ఇదొక నిదర్శనం. సీఎం నేతృత్వంలో ప్రాజెక్టులు రికార్డు సమయంలో పూర్తవుతున్నాయి. వాటి ఫలాలు రైతులకు అందుతున్నాయి.
– రజత్కుమార్, టీఎస్డబ్ల్యూఆర్ఐడీసీఎల్ చైర్మన్, సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
సీఎం దార్శనికతకు గుర్తింపు
టీఎస్డబ్ల్యూఆర్ఐడీసీఎల్ను ఏ ప్లస్ క్యాటగిరీలో చేర్చడం ఆనందంగా ఉన్నది. సీఎం కేసీఆర్ దార్శనికత వల్లే జాతీయ స్థాయి గుర్తింపు దక్కింది. సాగునీటి రంగంలో తెలంగాణ సాధిస్తున్న ప్రగతికి, పాటిస్తున్న పారదర్శకతకు ఆర్ఈసీ సర్టిఫికెట్ నిదర్శనం. గ్రేడ్ రావడం మాలో మరింత ఉత్సాహాన్ని నింపింది. – బీ శంకర్, ఈఎన్సీ, టీఎస్డబ్ల్యూఆర్ఐడీసీఎల్ ఎండీ