Godowns | హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రం జాతీయ స్థాయిలో మరో అరుదైన ఘనత సాధించింది. రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ (ఎస్డబ్ల్యూసీ) ఆధ్వర్యంలో నిర్మించిన గోదాముల నాణ్యతా ప్రమాణాలను, వినియోగించిన సాంకేతికతను కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది. అంతేకాకుండా రాష్ట్రంలోని 8 గోదాములకు రూ.6 కోట్ల సబ్సిడీని విడుదల చేసింది. నాణ్యతా ప్రమాణాల కారణంగా ఇలా సబ్సిడీ పొందిన ఏకైక రాష్ట్రం తెలంగాణ కావడం విశేషం. ఈ నేపథ్యంలో త్వరలో మరో పది, పన్నెండు గోదాములకు సంబంధించిన డీపీఆర్లను కేంద్రానికి పంపించాలని ఎస్డబ్ల్యూసీ అధికారులు నిర్ణయించారు. వీటికి కూడా కేంద్రం ఓకే చెబితే మరో రూ.8-10 కోట్ల వరకు సబ్సిడీ అందనున్నది.
శాస్త్రీయ విధానంలో నిర్మించిన గోదాములకు కేంద్ర ప్రభుత్వం అగ్రికల్చర్ మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్(ఏఎంఐ) కింద సబ్సిడీ ఇస్తున్నది. ఇందులో భాగంగా నాబ్కాన్స్ సంస్థ ప్రతినిధులు మూడుసార్లు రాష్ర్టానికి వచ్చి గోదాములను పరిశీలించారు. నిర్మాణ విధానం, వినియోగించిన సాంకేతికత తదితర 13 అంశాలను పరిశీలించి 20 గోదాములకు ఏఎంఐ కింద సబ్సిడీ అందించొచ్చని కేంద్రానికి ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో తొలి దశలో 8 గోదాములకు రూ.6 కోట్ల సబ్సిడీని కేంద్రం విడుదల చేసింది.
రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ గోదాముల నిర్మాణంలో జాతీయ స్థాయి నిబంధనలను పాటిస్తున్నది. నిల్వ ఉంచిన పంటలు పాడవ్వకుండా, వర్షాలకు చెమ్మ దిగకుండా, నిల్వ నష్టాన్ని తగ్గించేందుకు అవసరమైన సాంకేతిక పద్ధతులను అనుసరిస్తున్నది. అదేవిధంగా ఎస్డబ్ల్యూసీ పరిధిలోని గోదాములను ఇటీవల కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని వేర్హౌజింగ్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేటరీ అథారిటీ (డబ్ల్యూడీఆర్ఎల్) పరిధిలోకి తీసుకెళ్లింది. తద్వారా గోదాముల్లో నాణ్యతా ప్రమాణాలను సదరు సంస్థ నిరంతరం పర్యవేక్షించి గోదాములకు గ్రేడింగ్ ఇస్తుంది. ఈ గ్రేడింగ్ ఆధారంగా గోదాముల్లో పంట ఉత్పత్తుల నిల్వకు డిమాండ్ పెరుగుతుంది. డబ్ల్యూడీఆర్ఎల్లోకి వెళ్లడం కూడా మన గోదాములకు సబ్సిడీ రావడానికి ఉపయోగపడింది.
సీఎం కేసీఆర్ విప్లవాత్మక నిర్ణయాలతో రాష్ట్రంలో వ్యవసాయం సుభిక్షంగా మారింది. పంటల ఉత్పత్తి భారీగా పెరిగింది. అందుకు అనుగుణంగా గోదాముల సామర్థ్యం పెంపుపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. కొత్త గోదాముల నిర్మాణాన్ని చేపట్టింది. 2014లో రాష్ట్రంలో 39 లక్షల టన్నుల సామర్థ్యం గల గోదాములు ఉంటే ప్రస్తుతం 74 లక్షల టన్నుల సామర్థ్యానికి పెంచింది. ఇందులో ఎస్డబ్ల్యూసీ ఆధ్వర్యంలో 2.61 లక్షల టన్నులు గల గోదాముల సామర్థ్యాన్ని 7.24 లక్షల టన్నులకు పెంచింది.
తెలంగాణలోని గోదాములకు జాతీయ స్థాయి గుర్తింపు దక్కడం గర్వకారణం. మన గోదాముల నిర్మాణ విధానాన్ని మెచ్చిన కేంద్రం ఏఎంఐ స్కీంలో 8 గోదాములకు రూ.6 కోట్ల సబ్సిడీ విడుదల చేసింది. త్వరలో మరో 10 గోదాములకు సంబంధించిన డీపీఆర్లను కేంద్రానికి అందిస్తాం.
– జితేందర్రెడ్డి, గిడ్డంగుల కార్పొరేషన్ ఎండీ