నల్లగొండ, మార్చి 4 : జీడీపీ వృద్ధి రేటులో దేశంలోనే తెలంగాణ ముందంజలో ఉన్నదని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి తెలిపారు. జీఎస్టీతోపాటు 19 శాతం జీడీపీలోనూ వృద్ధి సాధించి పట్టణాలు, గ్రామాలను కూడా సీఎం కేసీఆర్ ప్రగతి పథంలో నడిపిస్తున్నారన్నారు. శుక్రవారం నల్లగొండలో జడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి అధ్యక్షతన జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం మునుగోడులో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఆయా సమావేశాల్లో మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా కొవిడ్ వల్ల ఎన్నో రాష్ట్రాలు ఆర్థికంగా నష్టాలు చవిచూసి బడ్జెట్లో కోతలు విధించుకున్నాయన్నారు. ఇంతటి క్లిష్ట సమయంలోనూ సీఎం కేసీఆర్ తీసుకొన్న చర్యల వల్ల రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఆగకుండా కొనసాగిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రధానంగా వ్యవసాయ రంగంలో తీసుకొచ్చిన మార్పుల వల్ల ఆ రంగంలో మూడు, నాలుగింతల ఆదాయం పెరిగి.. మన ఆర్థిక వ్యవస్థ కూడా గణనీయంగా పెరిగిందని చెప్పారు. కేసీఆర్ నాయకత్వ పటిమను చూసి పొరుగు రాష్ర్టాల ప్రజలు.. తమను తెలంగాణలో కలుపుకోవాలని కోరుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం కొత్త పాలసీలు తీసుకొచ్చి మన రాష్ర్టానికి రావాల్సిన నిధులు ఇవ్వడం లేదని మంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు.