Velishala | అదొక అడవంచు ఊరు. నాలుగు దిక్కులా వాగులు. అయినా నీళ్లు లేక నోళ్లు తెరిచిన బీళ్లు. అభివృద్ధి అంటే తెలియని ప్రజలు.వెరసి.. వలసలు, ఎగిసిన విప్లవోద్యమాలు.అ అంటే అడవి.. ఆ అంటే ఆయుధమని మాత్రమే తెలిసిన యువకులు. నిత్యం పోలీసు బూట ్లచప్పుళ్లు. కూంబింగ్లు. ఎన్కౌంటర్లు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని రోజులు. తెల్లబట్టలోళ్లను చూస్తేనే వణికిపోయే ప్రజలు.దినదిన గండంగా బతుకులు. ఇదంతా తెలంగాణ రాక ముందు వెలిశాల కథ. కన్నీటి వ్యథ. 75 ఏండ్ల స్వాతంత్య్రం అనంతరం.. స్వరాష్ట్రంలో ఆజాదీ ఫలాలను అందుకుంటున్నది ఆ పల్లె. మండుటెండలోనూ మత్తడి దుంకే వాగు, చెరువులోకి ఎదురెక్కుతున్న గోదావరి జలాలతోకొత్త చిగుళ్లను తొడుగుతున్నది. పట్టెడు మెతుకుల కోసం తండ్లాడిన పల్లె పుట్లకొద్దీ ధాన్యపు రాశులను చూస్తూ మురిసిపోతున్నది. ఇదీ తెలంగాణ ఫలం. సాకారమవుతున్న స్వప్నం.
ఉమ్మడి వరంగల్ జిల్లా..
చిట్యాల మండలం..
ఓ మారుమూల గ్రామం.. వెలిశాల..
ఇదొక అడవంచు పల్లె. ఒక పక్క పెద్దవాగు, మరో పక్క మోరంచ వాగు, ఇంకోపక్క మానేరు. వర్షాకాలంలో మూడు నెలలపాటు గ్రామానికి బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. చుట్టూ జల వనరులు పుష్కలంగా ఉన్నా తాగునీటికి కటకటే. సేద్యం పూర్తిగా వర్షాధారితం. ఏ చిన్నరోగం వచ్చినా చిట్యాలకో, పరకాలకో పరుగెత్తాల్సిందే. ప్రాణాల మీదికొస్తే వరంగల్ ఎంజీఎం దవాఖాన ఒక్కటే దిక్కు. అక్కడికి వెళ్లాలన్నా అంత సులభం కాదు. రవాణా సదుపాయం అంతంతమాత్రమే. ఎప్పుడో చుక్క తెగినపడినట్లుగా అప్పుడప్పుడూ ఆర్టీసీ బస్సులు. మరో వాహన సదుపాయం లేని దుస్థితి. ప్రాణం నిలబడేదాన్క నమ్మకం లేదు. సూటిగా చెప్పాలంటే అభివృద్ధి జాడ తెలియని ఊరది. పూర్తిగా వెనకబాటుతనం. ఈ నేపథ్యంలోనే ఉపాధి లేక.. పాలకుల నిర్లక్ష్యాన్ని చూడలేక ఒక తరం మొత్తం అడవిబాట పట్టింది. అన్నలలో కలిసింది. అప్పుడెప్పుడో పోలీసులు ఏర్పాటు చేసిన శాంతి స్థూపం తప్పించి.. ఒక్క అభివృద్ధి ఫలకమూ, ప్రారంభోత్సవ ఆనవాలూ కనిపించేది కాదు. పాలకులకు అంత నిర్లక్ష్యం. గ్రామీణులది అంత ఇబ్బందికర జీవనం.
చేరువైన పాలన..
తెలంగాణ అవతరణ తర్వాత.. సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలతో ప్రస్తుతం గ్రామ స్వరూపమే మారిపోయింది. జిల్లాల పునర్విభజనలో వెలిశాల గ్రామం ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భాగమైంది. అటు తర్వాత చిట్యాల మండలం నుంచి కొత్తగా ఏర్పాటైన టేకుమట్ల మండలంలో చేరింది. వెరసి ప్రభుత్వ పాలన గ్రామానికి మరింత చేరువైంది. ఇక ఉమ్మడి రాష్ట్రంలో చిట్యాల మండలం వరకు సింగిల్ రోడ్డు మాత్రమే ఉండేది. నేడు వెలిశాల వరకూ డబుల్ రోడ్డు వచ్చింది. ముఖ్యంగా భూపాలపల్లి, పరకాల, జమ్మికుంట నుంచి టేకుమట్ల మండలం మీదుగా గిద్దెముత్తారం, గర్మిళపల్లి వరకు రెండువరుసల రోడ్లను, వాగులపై వంతెనలను నిర్మించారు. దీంతో రవాణా వ్యవస్థ ఎంతో మెరుగుపడింది. ప్రతి గంటకు ఒక బస్సు ఠంచనుగా వస్తున్నది. హారను కొడుతున్నది. రవాణా వ్యవస్థ కూడా.. మెరుగుపడటంతో వెలిశాల గ్రామం అత్యంత వేగంగా ప్రగతిబాట పట్టింది. గతంలో పిల్లలు పదో తరగతి వరకు మాత్రమే చదివేవారు. ఆర్థిక స్తోమతలేక అంతటితో ఆపేయాల్సిన దుస్థితి ఉండేది. నేడు సమీప పట్టణాలకు వెళ్తున్నారు. కాలేజీ చదువులు చదువుతున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రమూ ఏర్పాటైంది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా ఇక్కడికే వచ్చి వైద్యం చేయించుకుంటున్నారు. మిషన్ భగీరథ తాగునీటి కష్టాలు తీర్చింది. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలతో గ్రామస్తుల ఆలోచనల్లో మార్పులు స్పష్టంగా కనబడుతున్నాయి.
మండుటెండల్లోనూ ..
గ్రామంలో చెరువు, చుట్టూ వాగులు ఉన్నా ఒకప్పుడు తాగునీటికి, సాగునీటికి కటకట తప్పని దుస్థితి. వాగు నుంచి 15 ఏండ్ల క్రితమే 15 హెచ్పీ మోటర్లతో రెండు చిన్నపాటి లిఫ్ట్లను ఏర్పాటు చేసుకుని చెరువులోకి నీళ్లను ఎత్తిపోసుకునే సదుపాయం చేసుకున్నా.. అదీ ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ఆ వాగులోనూ నీళ్లు రాని దుస్థితి. కానీ ప్రస్తుతం జలవనరులకు కొదవ లేకుండా పోయింది. దీనివెనుక పాలకుల కృషి ఉంది. తెలంగాణ ప్రభుత్వం తొలుత మిషన్ కాకతీయ పథకం ద్వారా వెలిశాల చెరువును పునరుద్ధరించింది. ఉమ్మడి పాలకులు దశాబ్దాల తరబడి తాత్సారం చేస్తూ వచ్చిన ఎస్సారెస్పీ మొదటి దశలో భాగంగా.. డీబీఎం 38 కెనాల్ ద్వారా వెలిశాల చెరువును నింపడం ప్రారంభించింది. అదీగాక సమీప పెద్దవాగు (చలివాగు)పై రూ. 9 కోట్లు వెచ్చించి చెక్డ్యామ్ నిర్మించింది. ఫలితంగా నేడు మండుటెండల్లోనూ అది మత్తళ్లు దుంకుతున్నది. దాంతో, గ్రామ పరిధిలో ఉన్న 250 ఎకరాలకు సాగునీటికి ఎలాంటి ఢోకా లేకుండా పోయింది. నాడు కేవలం ఆముదాలు, పత్తి తదితర మెట్టపంటలను వర్షాధారంగా సాగుచేసిన రైతులు, నేడు రెండు పంటలూ సాగుచేస్తున్నారు. అన్ని కాలాల్లోనూ చెరువులు నిండుకుండలా కళకళలాడుతున్నాయి. వేల ఎకరాల బీడు భూములు సాగులోకివచ్చాయి. దీంతో చిట్యాల ప్రాంతం ధాన్యరాశులకు నెలవుగా మారిపోయింది. చెక్డ్యామ్ నిర్మాణంతో గ్రామంలోని మత్స్యకారులకు ఉపాధి పెరిగింది.
ఉత్తమ పంచాయతీ
ఒకవైపు ప్రభుత్వ పాలన చేరువ కావడం, మరోవైపు మౌలిక వసతులు, రవాణా సదుపాయాలు మెరుగుపడటంతో వెలిశాల స్వరూపమే మారిపోయింది. దీంతో ప్రభుత్వమంటే ఎలా ఉంటుందో గ్రామస్తులకు తెలిసివచ్చింది. వెరసి వెలిశాల క్రమంగా విప్లవపంథాను వీడి వికాసపథంలో దూసుకుపోతున్నది. టేకుమట్ల మండలంలోని 24 గ్రామాల్లో అభివృద్ధిలో వెలిశాల ఉత్తమ గ్రామ పంచాయతీగా నిలిచింది. ఇటీవలే ఊరిలోని పురాతన ఆలయాన్ని సైతం పునరుద్ధరించుకుని సమష్టిగా పునః ప్రతిష్ఠించుకున్నారు. సూటిగా చెప్పాలంటే 75 ఏండ్ల తర్వాత వెలిశాల స్వాతంత్య్ర ఫలాలను అనుభవిస్తున్నది. ఇది ముమ్మాటికీ తెలంగాణ సర్కారు సాధించిన విజయం. ముందుచూపుతో చేపట్టిన పాలన వికేంద్రీకరణ ఫలితం.
మార్పు అంటే ఇది.
తెలంగాణ పునర్నిర్మాణం అంటే ఇదీ.
నిమ్మలంగ ఉంటున్నం
ఒకప్పటి వెలిశాలకు ఇప్పటికి పొంతనే లేదు. సింగిల్ రోడ్డు. అదీ అతుకులు గతుకులు. చుక్క తెగిపడినట్లు ఎప్పుడో పొద్దునొకటి, మాపటేలకు ఒకటి, చీకటి పూట ఒకటి బస్సులు వచ్చేటియి. వానకాలమొస్తే బురద. ఎండకాలం వస్తే నీళ్ల కరువు. మనుషులకే కాదు జీవాలకు సుత తాపేందుకు నీళ్లుండేటియి కాదు ఒక్కోసారి. ఇప్పుడు ఎటు చూసినా డబుల్ రోడ్లే. భూపాలపల్లి నుంచి, జమ్మికుంట నుంచి, పరకాల నుంచి మూడు దిక్కుల నుంచి బస్సులు గంటకొకటి వత్తన్నయి. కేసీఆర్ వచ్చినంక కాలువ నీళ్లు వత్తున్నయి. డ్యాం కట్టినంకయితే నీళ్ల కరువే లేకుంట పోయింది. రెండు పంటలకు ఢోకా లేదు. ఊరోళ్ల ఆలోచనలు కూడా మారినయి. అందరం కలిసి గుడిని బాగుచేసుకున్నం. మనుషులు నిమ్మలంగా ఉంటున్నరు. ఇంతకంటే ఏం గావాలె?
కటకట తప్పింది..
మా చిన్నతనంలో ఎండకాలం వచ్చిందంటే తాగునీళ్లకు ఎంత గోస పడేది? బండ్లు కట్టుకుని బాయిలకాడికి ఉరికేది. ఎప్పుడు పడితే అప్పుడు పోదామన్నా కరెంటుండేది కాదు. పొద్దంతా చెట్లకింద కాలం గడుపుడే. పొద్దుగూకినంకనే కరెంటు వచ్చేది. కేసీఆర్ వచ్చినంక ఊరే మారింది. నీళ్ల గోస తీరింది. అడుగు బయట పెట్టకుంట మిషన్ భగీరథ నీళ్లు ఇంటిముందటికే వచ్చినయి. రోడ్లు, దవాఖాన వచ్చినయి.
-బోగిన శ్రావణి, వెలిశాల
ఊరు మారింది
మా ఊరు ఎంతో మారింది. నేను చిన్నప్పుడు చూసిందాన్కి ఇప్పటికి పోలికే లేదు. దవాఖాన వచ్చింది. బడి మారింది. రోడ్డు ఏసిన్రు. ఇంటింటికీ నల్లా నీళ్లు ఇస్తున్నరు. 24 గంటలపాటు కరెంటు ఉంటున్నది. ఊర్లనే పదో తరగతి చదివిన. మైనారిటీ గురుకులంలో ఇంటర్ చదువుతున్న.
-మారుతి, విద్యార్థి
పోలికే లేదు..
ఎన్ని బాధలుపడినమో! తాగు, సాగు నీళ్లకు ఎంత తల్లడిల్లినమో! ప్రభుత్వమనేది ఉందా అనిపించేది. వానాకాలం వస్తే మోకాళ్లలోతు బురద. రోడ్డు లేదు. ఒకప్పటి మా ఊరికి, ఇప్పటి ఊరికి పోలికే లేదు. ఎప్పుడూ ఏదో ఆందోళన. భూములున్నా నీళ్లు లేకపాయె. ఇప్పుడు దేనికీ కొరత లేదు. పుష్కలంగా నీళ్లు. చేతినిండా పనులు. జనం ఆలోచనలూ మారాయి. అభివృద్ధిని కోరుతున్నారు. ప్రభుత్వానికి సహకరిస్తున్నారు. అంతా తెలంగాణ సర్కారు అందిస్తున్న ప్రోత్సాహమే. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తాం. ప్రభుత్వం సహకారంతో గ్రామాన్ని మరింత బాగుచేసుకుంటాం.
– చింతలపల్లి విజయ, సర్పంచ్, వెలిశాల
ఇంత మంచి సర్కారును సూడలే..
ఊరి సంగతి ఏం చెప్పేది? ఎప్పుడు ఏం జరుగుతదోనని ప్రాణాలు అరచేతిల పెట్టుకుని బతికేది. కొత్త మనుషులు కనిపిస్తే గుండె దడదడమనేది. మా ఊరు మొఖాన వచ్చేటోళ్లే లేకపోయేది. బడి పంతుళ్లు సుత సక్కగా వచ్చేటోళ్లు కాదు. వాన పడితే పంట. లేకుంటే సున్నా. కేసీఆర్ సర్కారు వచ్చినంక ఊరు ఎంతో మారింది. అన్ని దిక్కుల రోడ్లు పడినయి. గంటకో బస్సు వత్తంది. కాలువ నీళ్లతో చెరువు నింపుతాండ్లు. పోయినేడు వాగుమీద డ్యాం కట్టిండ్లు. ఎప్పుడో 20, 30 ఏండ్ల కింద చూసిన ఇన్ని నీళ్లను. మళ్లా ఇప్పుడు సూత్తున్న. ఒక్క పంట తీసుడే కట్టంగా ఉండే. ఊర్ల అందరూ పత్తులు ఏసేది. ఇప్పుడు అందరూ బంద్ చేసిన్రు. రెండు వరి పంటలు దీస్తున్నరు. నాకు ఆరు ఎకరాలున్నది. నేను చేత్తున్న. డ్యాంల నీళ్లున్నయనే చానారోజుల తరువాత గొర్లను కొన్న. మళ్లా వానకాలం దాన్క మేపి వాటిని అమ్ముకుంట. ఆ తరువాత ఎవుసం చేస్త. ఇప్పుడు ఊర్ల అందరికీ చేతినిండా పని. రంది లేదు. దవాఖాన కూడా ఊర్లనే కట్టిన్రు. నేనెప్పుడూ ఇసొంటి సర్కారును చూడలే.
-మోహన్రావు, గ్రామస్తుడు
చేపలు మస్తు వడ్తున్నయ్..
ఎన్కటి ముచ్చట.. తిప్పల గురించి ఎంత చెప్పినా ఒడ్వదు. ఒకనాటి కట్టం కాదది. ఊర్ల నుంచి బయటికి పోను బస్సు సౌలతు సక్కగ ఉండకపోయేది. నీళ్లు లేక పంటలు పండుడు కూడా వానదేవుడి దయపై ఆధారపడి ఉండేది. నేనే జీపు నడుపుకొంటూ కుటుంబాన్ని ఎల్లదీసుకుంటూ వచ్చిన. ఇప్పుడు ఆ పరిస్థితులే లేవు. బస్సులు పెరిగినయ్. జీపు ట్రిప్పులు సుత తగ్గినయ్. అయినా ఇప్పుడు రంది లేదు. డ్యాం కట్టినంక ఊటలు పెరిగినయ్. వాగుల ఎప్పుడూ నీళ్లు ఉంటున్నయ్. రెండు పంటలు పండుతున్నయ్. మళ్లా చేపలు మస్తు పడుతున్నయ్. రోజు రెండు కిలోల చేపలు పట్టుకుని అమ్ముకున్నా కూలి పడ్తది. పనికి ఢోకా లేకుంట పోయింది.
– నరెడ్ల రాజయ్య