హైదరాబాద్, డిసెంబర్ 29(నమస్తే తెలంగాణ): ఈ యాసంగి సీజన్లో అన్నదాతలు రికార్డు స్థాయిలో వరి సాగు చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే సాగు మొదలైనప్పటికీ గత ఏడాదితో పోల్చితే వరిదే జోరు కనిపిస్తున్నది. 2020-21లో కేంద్రం కొర్రీలతో వెనుకంజ వేసిన అన్నదాతలు.. తెలంగాణ రాష్ట్ర సర్కారు ఇచ్చిన భరోసాతో ఈ ఏడాది వరిసాగువైపే ఎక్కువగా మొగ్గుచూపారు. రాష్ట్రవ్యాప్తంగా గురువారం వరకు 4 లక్షల ఎకరాల్లో వరి సాగు అయినట్టు వ్యవసాయశాఖ వెల్లడించింది. గత యాసంగిలో ఈ సమయానికి కేవలం 75 వేల ఎకరాల్లో మాత్రమే వరి సాగైంది. గత ఏడాదితో పోల్చితే ఈ సీజన్లో ఐదు రెట్లు ఎక్కువగా సాగు కావడం విశేషం. ఈ నేపథ్యంలో ఈ సారి రికార్డు స్థాయిలో వరి దిగుబడి ఖాయమని అధికారులు అంచనా వేస్తున్నారు. 2020-21 యాసంగిలో 53 లక్షల ఎకరాల్లో రికార్డు స్థాయి వరి సాగు కాగా.. ప్రభుత్వం 92 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. ఇది ఉమ్మడి ఏపీ, తెలంగాణ చరిత్రలోనే అత్యధికం. ఈ సీజన్లో వరిసాగు గత రికార్డును మించిపోనున్నది. వరి సాధారణ సాగు విస్తీర్ణాన్ని 33.53 లక్షల ఎకరాలుగా వ్యవసాయ శాఖ నిర్ణయించింది. అయితే, దీనికి రెట్టింపు సాగు అవుతుందనే అంచనాలు ఉన్నాయి.
గత ఏడాది యాసంగి వరి సాగుపై కేంద్రం కొర్రీలు పెట్టిన విషయం తెలిసిందే. తెలంగాణ రైతుల నుంచి బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయబోమని కేంద్రంలోని బీజేపీ సర్కారు ఆంక్షలు పెట్టింది. యాసంగిలో వరికి బదులు ఇతర పంటలు సాగు చేయాలని సూచించింది. ఈ నేపథ్యంలో ఆందోళన చెందిన రైతులు వరి సాగుకు దూరంగా ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం సాగుకు అవసరమైన కరెంట్, సాగునీళ్లు, పెట్టుబడి సాయం లాంటి సౌకర్యాలు అన్నీ కల్పించినా కేంద్రం తీరుతో కొందరు అన్నదాతలు వరి వేయలేదు. పొలాలను బీడుగానే ఉంచారు. కానీ, తెలంగాణ ప్రభుత్వం రైతులకు అండగా నిలిచింది. కేం ద్రం కొర్రీలు పెట్టినా ధాన్యం కొనుగోలు చేసింది. ఈ ధైర్యంతోనే రైతులు ఈ యాసంగిలో భారీ విస్తీర్ణంలో వరి సాగుకు కదిలారు.