హైదరాబాద్, ఫిబ్రవరి 3 : ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ రాష్ట్రం ఆల్ టైం రికార్డు సాధించి, దేశంలోనే మూడో స్థానంలో నిలిచిందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. వానకాలం సీజన్లో ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడూ లేనంతగా అత్యధికంగా 70.30 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు వెల్లడించారు. ఈ సీజన్లో 12,87,029 మంది రైతుల నుంచి రూ.13,757 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేసి, వారం రోజుల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమచేసినట్టు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరిస్తున్న రైతు అనుకూల విధానాలతో ప్రతికూల పరిస్థితుల్లోనూ అన్నదాతలు సిరుల పంట పండించారని ఆయన పేర్కొన్నారు. కరోనా గడ్డు పరిస్థితులకు తోడు కేంద్ర ప్రభుత్వం అడుగడుగునా ప్రతికూల పరిస్థితులను సృష్టించినా చివరి గింజ వరకూ ధాన్యం కొన్నామని వెల్లడించారు. వానకాలం ధాన్యం కొనుగోళ్ల ప్రక్రి య ముగింపు సందర్భంగా గురువారం మంత్రి గంగుల కమలాకర్ వివరాలు వెల్లడించారు. 2014-15 వానకాలం సీజన్లో 11.04 లక్షల టన్నులుగా ఉన్న ధాన్యం కొనుగోళ్లు ఏటేటా పెరుగుతూ 2021-22లో అత్యధికంగా 70.30 లక్షల టన్నులకు చేరినట్టు వివరించారు. ఈ సీజన్లో అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 6,86,160 టన్నులు, అత్యల్పంగా ఆదిలాబాద్లో 2,468 టన్నులు కొనుగోలు చేసినట్టు పేర్కొన్నారు. కరోనా నిబంధనలతో అత్యధికంగా 6,872 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ వానకాలం సీజన్లో కేంద్రం తొలుత 40 లక్షల టన్నుల బియ్యం సేకరణకు అనుమతివ్వగా, సీఎం కేసీఆర్ ఒత్తిడి మేరకు మరో 6 లక్షల టన్నులకు పెంచిందని ఆయన గుర్తుచేశారు. కేంద్రం నిర్దేశించిన లక్ష్యానికి మించి కొనుగోలు చేసినట్టు వివరించారు. సీఎమ్మార్ ప్రక్రియను సైతం వేగంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే దాదాపు 8 లక్షల టన్నుల బియ్యాన్ని, లక్ష్యంలో 18 శాతాన్ని ఎఫ్సీఐకి అందించడమే కాకుండా మరో 20 వేల టన్నుల బియ్యం మిల్లింగ్ చేస్తున్నట్టు ఆయన వివరించారు. ధాన్యం సేకరణలో ఈ ఘనత సాధించేందుకు సహకరించిన ఐకేపీ, కో-ఆపరేటివ్ సొసైటీలు, పౌరసరఫరాలశాఖ సిబ్బందితోపాటు భాగస్వామ్యం వహించిన అధికారులు, ఉద్యోగులకు మంత్రి గంగుల అభినందనలు తెలిపారు.
ఆరె కులసంఘానికి భూమి పట్టా
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఉప్పల్ భగాయత్లో ఆరె కులసంఘానికి కేటాయించిన ఎకరా భూమికి సంబంధించిన పట్టాను గురువారం మంత్రి గంగుల కమలాకర్ అందజేశారు. ఆత్మగౌరవ భవనం కోసం ఆరె కుల సంక్షేమ సంఘం నేతలు ఏక సంఘంగా ఏర్పడి మంత్రిని కలువగా వారికి పట్టా అందజేశారు. మిగిలిన కులాలవారు సైతం ఈ నెల 15లోపు ఏక సంఘంగా ఏర్పడి భవనాలు నిర్మించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆరె కుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ శివాజీ, నాయకులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ చేపట్టిన రైతు అనుకూల విధానాలతో ప్రతికూల పరిస్థితుల్లోనూ అన్నదాతలు సిరుల పంట పండించారు. కరోనా గడ్డు పరిస్థితులకు తోడు కేంద్ర ప్రభుత్వం అడుగడుగునా సమస్యలను సృష్టించినా ముఖ్యమంత్రి సంకల్పంతో చివరి గింజ వరకూ కొనుగోలు చేశాం. ఈ సీజన్లో 12,87,029 మంది రైతుల నుంచి రూ.13,757 కోట్ల విలువైన 70.30 లక్షల టన్నుల ధాన్యం కొన్నాం. – పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్