హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్ల నిర్మాణంలో తెలంగాణ ముందంజలో ఉన్నది. దేశవ్యాప్తంగా అత్యధికంగా టాయిలెట్లు నిర్మించిన టాప్-5 రాష్ర్టాల్లో తెలంగాణ చోటు దక్కించుకున్నది. 36,159 టాయిలెట్లను నిర్మించి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ విషయాన్ని 2020-21 వార్షిక నివేదికలో కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. ఆర్టీఈ యాక్ట్ నిబంధనల ప్రకారం 80 మంది బాలురకు ఒక మరుగుదొడ్డి, రెండు మూత్రశాలలు, 40 మంది బాలికలకు ఒక మరుగుదొడ్డి, రెండు మూత్రశాలలు, విద్యార్థులకు సరిపోయేంత సురక్షిత తాగునీటిని అందుబాటులో ఉంచాలి. ఇందుకు సమగ్రశిక్ష ప్రాజెక్ట్ ద్వారా పెద్ద ఎత్తున నిధులు వెచ్చించి టాయిలెట్లను నిర్మిస్తున్నారు. స్కూళ్లలో అత్యధికంగా టాయిలెట్లు నిర్మించిన టాప్-5 రాష్ర్టాలో వరుసగా బీహార్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమబెంగాల్, తెలంగాణ ఉన్నాయి. ప్రభుత్వం, సమగ్రశిక్షకు తోడు పలు ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేట్ కంపెనీలు సైతం బడుల్లో టాయ్లెట్ల నిర్మాణానికి తోడ్పాటునందిస్తున్నాయి. అయితే, బీజేపీ పాలిత రాష్ర్టాలు టాప్-5లో చోటుదక్కించుకోలేకపోయాయి.
దేశవ్యాప్తంగా పలు సంస్థలు నిర్మించిన టాయిలెట్ల వివరాలు
17 వేల కిచెన్ షెడ్ల నిర్మాణం
సర్కారు బడుల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన పథకం అమలులో భాగంగా పెద్ద ఎత్తున కిచెన్షెడ్లను నిర్మిస్తున్నారు. ఇందులోనూ తెలంగాణ పురోగతి సాధించింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 17,483 కిచెన్ షెడ్లను నిర్మించారు. మరో 3,698 నిర్మాణ దశలో ఉన్నాయి. మరో 9,227 షెడ్లను చేపట్టాల్సి ఉన్నది. ఏపీలో 56, కేరళలో 55 శాతం, జమ్ముకశ్మీర్లో 40, రాజస్థాన్లో 29, ఛత్తీస్గఢ్లో 30, మధ్యప్రదేశ్లో 16 శాతం కిచెన్షెడ్లను ఇంత వరకు చేపట్టలేదు.
మనోళ్లే అధికం
ఇంటర్ సహా ఇతర వృత్తివిద్యాకోర్సుల్లోని విద్యార్థులకు కేంద్రం అందజేసే సెంట్రల్ సెక్టార్ స్కాలర్షిప్స్కు 2020 -21 సంవత్సరంలో 7,810 మంది తెలంగాణ విద్యార్థులు ఎంపికయ్యారు. జాతీయంగా 1,10,281 విద్యార్థులు దీనికి ఎంపికైతే అత్యధికంగా మహారాష్ట్ర విద్యార్థులు 11,622 మంది, కర్ణాటక నుంచి 10,609 మంది, మధ్యప్రదేశ్ నుంచి 8,947 మంది, పశ్చిమబెంగాల్ నుంచి 8,743 మంది ఎంపికయ్యారు.