హైదరాబాద్, మార్చి 08 : దేశంలో మహిళల కోసం అత్యధికంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని, అంగన్ వాడీలకు సైతం దేశంలోనే అత్యధిక వేతనాలు కూడా ఇస్తున్నామని స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని మంగళవారం రవీంద్ర భారతిలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి సత్యవతి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
సీఎం కేసిఆర్ నాయకత్వంలో మహిళా, శిశు సంక్షేమ శాఖలో అద్భుతమైన పథకాలు అమలు జరుగుతున్నాయి. మహిళలకు సంబంధించి మహిళా దినోత్సవం జరుపుకోవడానికి ఒకరోజు సరిపోదు అని మూడు రోజుల పాటు నిర్వహించుకుంటున్నామని తెలిపారు.
ఈ మూడు రోజులుగా అనేక వేదికల్లో మహిళలను సన్మానించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మహిళల కోసం అమలు చేస్తున్న పథకాలు తెలియజెప్పి, వారందరినీ భాగస్వామ్యం చేసేందుకు ఈ మూడు రోజుల వేడుకలు చేశామని మంత్రి తెలిపారు.
నాడు ఎన్టీఆర్ పద్మావతి విశ్వ విద్యాలయం తీసుకొస్తే..నేడు మళ్లీ సీఎం కేసీఆర్ ఇక్కడ మహిళా విశ్వ విద్యాలయం ఏర్పాటుపై బడ్జెట్ లో ప్రకటన చేశారు. ఇందుకు మహిళల తరపున నేను సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. గర్భం దాల్చిన ప్రతి మహిళ పోషకాహారం తినాలి అని దేశంలో ఎక్కడా లేని విధంగా ఆరోగ్య లక్ష్మి పథకం తీసుకొచ్చి, వారికి మంచి ఆహారం ఇస్తున్నాం. ఇందుకు కృషి చేస్తున్న అంగన్వాడీలు అభినందనీయులన్నారు.
మహిళల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నామన్నారు. మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రంలో మా ఆడపడచులు ఖాళీ బిందెలతో నీళ్లకు వెళ్లకుండా..ఇంటింటికీ నల్లా నీళ్లు ఇస్తున్న అపర భగీరథులు సీఎం కేసీఆర్ అన్నారు. మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ..మహిళలు నేడు పురుషులతో సమానంగా పని చేస్తున్నారు. గతంలో మహిళా దినోత్సవం రోజున సెలవు పెట్టుకుని రావాల్సి వచ్చేది.
కానీ సీఎం కేసీఆర్ నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజును హాలిడేగా ప్రకటించారు. అందుకే మహిళా బంధు అయ్యారన్నారు. తెలంగాణ ప్రభుత్వం మహిళల రక్షణ కోసం షీ టీమ్స్, భరోసా, సఖీ కేంద్రాలు పెట్టి చర్యలు తీసుకుంటుందన్నారు.
కార్యక్రమంలో మంత్రితో పాటు మహిళా మహిళా ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ చైర్ పర్సన్ ఆకుల లలిత, బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ శ్రీనివాస రావు, ప్రభుత్వ సలహాదారు శోభారాణి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, షాద్ నగర్ జడ్పీటీసి రాజమ్మ, స్థానిక కార్పొరేటర్ విజయా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.