Telangana | హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ సర్కారు ఆవిష్కరణలకు ఇచ్చిన ప్రోత్సాహ ఫలితంగా దేశంలోనే తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచింది. ఆవిష్కరణల్లో ఏ రాష్ట్రం సాధించని విధంగా 4 శాతం వృద్ధి సాధించింది. ఈ వృద్ధి మరింత పెరిగే అవకాశం ఉన్నదని తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఎకోరాప్ సంస్థ 3ఐ (ఇండియా, ఇంక్యుబేటింగ్, ఇన్నోవేషన్స్) పేరుతో విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం దేశంలో ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, ఫిజిక్స్, బయోటెక్నాలజీ, సివిల్, మెటలర్జీ తదితర రంగాల్లో ఆవిష్కరణలు అధికంగా జరుగుతున్నాయి. గుజరాత్, తెలంగాణ, రాజస్థాన్,పంజాబ్, హర్యానా తదితర రాష్ర్టాలు ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇన్నోవేషన్లో నాయకత్వ స్థానానికి ఎదుగుతున్నాయి. 2004-2013 మధ్య ఇన్నోవేషన్స్లో తెలంగాణ వాటా 0.1 శాతంగా ఉండగా, 2014-2023 మధ్య 4 శాతం వాటాను సాధించింది. రాష్ట్రంలోని గ్రామాల్లోనూ ఆవిష్కరణలు విస్తరిస్తున్నాయి.
1.2 శాతం నుంచి 2.3 శాతం వృద్ధితో రాజస్థాన్ ద్వితీయస్థానంలో నిలిచింది. భారత్లో 2004-13 మధ్యకాలంలో సింగిల్ ఇన్వెంటర్స్ వాటా 22.9 శాతం ఉండగా, 2014-23 మధ్య ఇది 35.5 శాతానికి చేరిందని ఎమర్జింగ్ టెక్నాలజీస్ నిపుణులు, సెవెన్ సీస్ ఎంటర్టైన్మెంట్ ఎండీ ఎల్ మారుతి శంకర్ తెలిపారు. ఉత్తరాఖండ్, ఒడిశా, అండమాన్ నికోబార్ దీవులు, ఛత్తీస్గఢ్, జమ్ముకశ్మీర్, పుదుచ్చేరి, హిమాచల్ప్రదేశ్ తదితర రాష్ర్టాల్లో కూడా ఆవిష్కరణలు వృద్ధి చెందుతున్నట్టు నివేదిక తెలిపింది. రాష్ట్రంలో ఐటీ, పరిశ్రమల మంత్రిగా కేటీఆర్ ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు పెద్దఎత్తున చర్యలు చేపట్టారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆవిష్కరణల కోసం టీ-హబ్ను ఏర్పాటుచేసి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అందించారు. ఐటీ, ఎమర్జింగ్ టెక్నాలజీస్ రంగంలో రాష్ర్టాన్ని అగ్రభాగాన నిలిపేందుకు కృషిచేశారు. ఆ కృషి సత్ఫలితాలను ఇస్తున్నదని తాజాగా ఎకోరాప్ నివేదిక స్పష్టం చేసింది.