అడవుల నిర్వహణలో తెలంగాణ ఆదర్శం
అన్ని రాష్ర్టాల అటవీ అధికారుల ప్రశంసలు
హైదరాబాద్, ఫిబ్రవరి 26 : అడవుల నిర్వహణ, పచ్చదనం పెంపుదలలో తెలంగాణ ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా ఉన్నదని కంపా నేషనల్ సీఈవో సుభాష్చంద్ర, వివిధ రాష్ర్టాల అటవీ సంరక్షణ ప్రధాన అధికారులు ప్రశంసించారు. అటవీశాఖ జాతీయ సదస్సుకు హాజరైన అధికారులు శనివారం హైదరాబాద్ శివారులోని కండ్లకోయ ఆక్సిజన్ అర్బన్ ఫారెస్ట్ పార్క్తో పాటు, హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ఔటర్రింగ్ రోడ్డు వెంట సుమారు 70 కిలోమీటర్ల మేర ఏర్పాటుచేసిన పచ్చదనం, ఎవెన్యూ ప్లాంటేషన్ను పరిశీలించారు. ఆక్సిజన్ అర్బన్ ఫారెస్ట్ పార్క్లో సౌకర్యాలు బాగున్నాయని కితాబిచ్చారు. ఈ సందర్భంగా సుభాష్చంద్ర మాట్లాడుతూ.. ప్రత్యామ్నాయ అటవీకరణ నిధులను నిబంధనల మేరకు వినియోగిస్తూ తెలంగాణ అటవీశాఖ మంచి ఫలితాలు సాధిస్తున్నదని ప్రశంసించారు. పట్టణీకరణ నేపథ్యంలో ప్రజలకు స్వచ్ఛమైన ఆక్సిజన్ను అందించేందుకు అర్బన్పార్క్లు లంగ్స్పేస్లుగా పనిచేస్తాయని, ఈ విషయంలో తెలంగాణ ప్రదర్శిస్తున్న చొరవ మిగిలిన రాష్ర్టాలకు ఆదర్శంగా ఉన్నదని ఉత్తరప్రదేశ్ అటవీ సంరక్షణ ప్రధానాధికారి (పీసీసీఎఫ్) సంజయ్ శ్రీవాస్తవ కొనియాడారు. తెలంగాణను ఆదర్శంగా తీసుకొని తమ రాష్ట్రంలోనూ అర్బన్ ఫారెస్ట్ పార్కులు ఏర్పాటు చేస్తామని మణిపూర్ పీసీసీఎఫ్ ఆదిత్యజోషి చెప్పారు. కార్యక్రమంలో తెలంగాణ పీసీసీఎఫ్(కంపా) లోకేశ్జైస్వాల్, హైదరాబాద్ చీఫ్ కన్జర్వేటర్ ఎంజే అక్బర్, అర్బన్ ఫారెస్ట్రీ డైరెక్టర్ డాక్టర్ బీ ప్రభాకర్ పాల్గొన్నారు.