దుబ్బాక/గజ్వేల్, జూలై 28: దళితబంధు పథకం కొత్తగా ఉపఎన్నిక కోసం ప్రవేశ పెట్టలేదని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. 2021 అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే సీఎం కేసీఆర్ సూచనల మేరకు ఆర్థికశాఖ మంత్రిగా తాను దళితుల అభ్యున్నతి కోసం బడ్జెట్ కేటాయించిన విషయాన్ని గుర్తుచేశారు. వచ్చే రెండేండ్లలో దళితబంధు పథకం ద్వారా నిరుపేద దళితులకు సాయం అందిస్తామన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక, సిద్దిపేట, గజ్వేల్లో కొత్త రేషన్కార్డుల పంపిణీ, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డితో కలిసి పాల్గొన్నారు. దుబ్బాకలో రూ.4 కోట్లతో మోడల్ బస్టాండ్, రూ.3 కోట్లతో సీసీ, కమ్యూనిటీ భవనాలకు మంత్రి, ఎంపీలు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడే పనిచేస్తున్నదని, ఓట్ల కోసం కాదని చెప్పారు. రాజకీయాలకతీతంగా అందరికీ రేషన్ కార్డులు ఇస్తున్న ఘనత ఒక్క టీఆర్ఎస్ సర్కార్కే దక్కిందన్నారు. సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా టీఆర్ఎస్ సర్కార్ పనిచేస్తున్నదని, ఇచ్చిన మాటకు కట్టుబడి 3 లక్షల మందికి కొత్తగా రేషన్కార్డులు అందజేస్తున్నామని తెలిపారు. రూ.2,700 కోట్లతో రాష్ట్రంలో 90.5 శాతం మందికి రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. రైతులు ఆయిల్ పామ్ తోటల సాగుపై దృష్టి పెట్టి ఆర్థికాభివృద్ధి సాధించాలని సూచించారు. సంక్షేమానికి టీఆర్ఎస్ సర్కారు చిరునామాగా మారిందన్నారు. అభివృద్ధిలో తెలంగాణ.. దేశానికి రోల్మోడల్గా నిలిచిందన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, ఎమ్మెల్యే రఘునందన్, కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి, గడా ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.