హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): కృష్ణా జలాల పంపిణీ విషయంలో కేంద్రంలోని బీజేపీ సర్కారు తెలంగాణపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నది. కొత్త ట్రిబ్యునల్ వేయవచ్చని కేంద్ర న్యాయశాఖ సలహా ఇచ్చినా, పదేపదే సంప్రదింపుల పేరుతో ఎనిమిదేండ్లుగా తాత్సారం చేస్తున్నది. ఇంతకాలం కాలయాపన చేసి, ఇప్పుడు ఏకంగా ట్రిబ్యునల్ ఏర్పాటును వ్యతిరేకించే నిర్ణయాలు తీసుకొంటున్నదన్న విషయం ఆర్టీఐ దరఖాస్తుతో వెలుగులోకి వస్తున్నది. కేంద్రం తీరుపై తీవ్ర ఆగ్రహంగా ఉన్న తెలంగాణ సర్కారు మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నది.
తొలుత ఆమోదించి.. ఆపై కేంద్రం వెనకడుగు
ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం కృష్ణా, గోదావరి నదుల జలాలను ప్రాజెక్టులవారీగా పంపిణీ చేయాలని మాత్రమే అప్పటికే ఉన్న బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్కు నాటి కేంద్ర ప్రభుత్వం రిఫర్ చేసింది. అలా చేస్తే తెలంగాణకు ఒరిగేదేమీ ఉండబోదని తెలంగాణ సమాజం అనాడే వ్యతిరేకించింది. పరీవాహక ప్రాంతం ఆధారంగా నీటి వాటాలు తేల్చాలని డిమాండ్ చేసింది. దీంతో రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. అంతర్రాష్ట్ర జలవివాదాల చట్టం 1956లోని సెక్షన్ 3 ప్రకారం కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి నీటి వాటాలు తేల్చాలని 2014 జూలై 14న వినతిపత్రం అందజేశారు. తెలంగాణ అభ్యర్థనపై సలహా ఇవ్వాలని కేంద్రం అదే ఏడాది ఆగస్టు 29న న్యాయశాఖను కోరింది. దీనిపై న్యాయశాఖ 2014 సెప్టెంబర్ 8న అభిప్రాయం వెల్లడిస్తూ.. తెలంగాణ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవచ్చని సూచించింది. అయినా కేంద్రం ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. తెలంగాణ అభ్యర్థనను పునఃసమీక్షించాలని మళ్లీ న్యాయశాఖను కోరుతూ కాలయాపన చేయడం మొదలు పెట్టింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
సుప్రీంలో పిటిషన్ ఉపసంహరణకు మెలిక
కోర్టులో వాదనలు కొనసాగుతున్న క్రమంలోనే తెలంగాణకు అనుకూలంగా న్యాయశాఖ ఇచ్చిన సలహాను నాటి కేంద్ర జలవనరుల శాఖ నవంబర్ 17, 2015న ఆమోదించింది. ఆ తరువాత 20 రోజులు తిరగకుండానే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొన్నది. సలహాను మరోసారి సమీక్షించుకోవాలని డిసెంబర్ 7, 2015న న్యాయశాఖకు సూచించింది. ఆ తరువాత తెలంగాణ ప్రభుత్వం ఎన్నిలేఖలు రాసినా సమాచారం ఇవ్వకుండా కేంద్రం నిరాకరిస్తూ వచ్చింది. అక్టోబర్ 6, 2020న నిర్వహించిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ట్రిబ్యునల్ ఏర్పాటుపై సీఎం కేసీఆర్ పట్టుబట్టడంతో కేంద్రం అంగీకరించింది. కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలా? ప్రస్తుతమున్న బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్కే సెక్షన్ 3 ప్రకారం నీటి వాటాలు పంపిణీ చేసే అధికారాలు కల్పించాలా? అనేదానిపై న్యాయశాఖ సలహా తీసుకోవాలని నిర్ణయించింది.
సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ను ఉపసంహరించుకొంటేనే న్యాయసలహా కోరతామని షరతు విధించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ను గత ఏడాది సెప్టెంబర్లో ఉపసంహరించుకొన్నది. ఇప్పటికి ఏడాది గడిచినా కేంద్రం నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంపై తెలంగాణ ఇంజినీర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడాన్ని తెలంగాణ ప్రభుత్వం సైతం తీవ్రంగా పరిగణిస్తున్నది. ఈ అంశంపై ఎలా ముందుకుపోవాలనే అంశంపై న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నది. మరోసారి సుప్రీంను ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ ఇటీవల సమీక్ష నిర్వహించారు. అంతరాష్ట్ర జల మండలి అధికారులు, సీనియర్ న్యాయవాదుల సలహా తీసుకొని సీఎం కేసీఆర్ దృష్టికి తెచ్చారు. సీఎం నుంచి కూడా సానుకూలత రావడంతో సుప్రీంలో పిటిషన్ వేసేందుకు సిద్ధమయ్యారని సమాచారం.