Telangana | సమాజంలోని ఏ ఒక్కరూ నిరాదరణకు గురికాకూడదు. ప్రతి వ్యక్తికీ సమాన హక్కులు ఉండాలి. ఆత్మగౌరవంతో జీవించాలి. సంపదలో వాటా దక్కాలి. ఇది అంబేద్కర్ స్వప్నం. ఆయన ఆశయాల సాధన దిశలోనే తెలంగాణ సర్కారు ముందుకు సాగుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేసే ప్రతి పథకమూ, అభివృద్ధి కార్యక్రమం అంబేద్కర్ స్ఫూర్తిని చాటుతున్నది. 75 ఏండ్లు గడచినా గుర్తింపునకు నోచుకోక, అభివృద్ధి ఫలాలను అందుకోలేక కునారిల్లుతున్న సంచార జాతులు, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లతోపాటు అందరికీ హక్కులను కల్పిస్తున్నది కేసీఆర్ సర్కార్. ఆయా వర్గాలకు కల్పిస్తున్న అవకాశాలపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం..
సోమవారం అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, కొప్పుల ఈశ్వర్, బుద్ధవనం ఓఎస్డీ మల్లేపల్లి లక్ష్మయ్య తదితరులు
హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): సమాజంలో దళితులు, గిరిTelజనులతోపాటు అంతకంటే అధమస్థాయిలో, వారికంటే ఎక్కువగా వివక్షను, సమస్యలను ఎదుర్కొంటున్న అనేక జనసమూహాలున్నాయి. దివ్యాంగులు, లింగమార్పిడి వ్యక్తులు, ఒంటరి మహిళలు, వయోవృద్ధులు, సంచారజాతులు ఇప్పటికీ అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉన్నాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడచినా వారి సమస్యలకు పరిష్కార మార్గాలు చూపిన ప్రభుత్వాలు లేవు. కానీ స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సర్కారు అంబేద్కర్ చూపిన మార్గంలో నడుస్తూ అట్టడుగు వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. వినూత్న పథకాలతో, సంక్షేమ కార్యక్రమాలతో గుర్తింపునిస్తున్నది.
దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమం
వయోవృద్ధులు, దివ్యాంగులు ఎదుర్కొనే సమస్యలు అన్నీఇన్నీ కావు. అందులోనూ ఆర్థిక స్థోమత లేని నిరుపేదల జీవనం మరింత దయనీయం. తెలంగాణ ప్రభుత్వం వారి సంక్షేమం కోసం రాష్ట్ర ఏర్పాటు నుంచీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. వృద్ధులకు రూ.2,016 పెన్షన్ ఇస్తున్నది. దివ్యాంగులకు రూ.3,016 అందిన్నది. దేశంలోనే మొదటిసారి వయోవృద్ధుల కోసం టోల్ఫ్రీ హెల్ప్లైన్ నంబర్ 14567, దివ్యాంగుల కోసం 155326 సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన హెల్ప్లైన్ సేవలను స్ఫూర్తిగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం కూడా ఇలాంటి సేవలను దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నది. ఇక దివ్యాంగులకు ఉపకరణాలు అందించటంతోపాటు విద్యా, ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నది. ఉద్యోగావకాశాల్లో 4 శాతం, ప్రభుత్వ పథకాల్లో 5 శాతం రిజర్వేషన్ను కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నది.
సంచార జాతులకు సామాజిక గుర్తింపు
రాష్ట్రంలో కొన్ని సంచార జాతుల పరిస్థితి అత్యంత దయనీయం. ఇప్పటికీ వారు కనీస గుర్తింపునకు నోచుకోలేదు. అందులో గోత్రాల, అద్దపువారు, బాగోతుల, బైలి కమ్మర, ఏనూటి, గంజికూటి, గౌడశెట్టి, కాకిపడిగెల, పాఠంవారు, ఓడ్, సొన్నాయిల, శత్రియ రామజోగి, తెరచీరెల, తోలుబొమ్మల కులాలున్నాయి. ఓటరు గుర్తింపుకార్డులు ఇచ్చిన పార్టీలే తప్ప, ఆ కులాలను గుర్తించి కుల సర్టిఫికెట్లు అందించిన పార్టీలు లేవు. కులం సర్టిఫికెట్లు లేక రేషన్కార్డులే కాదు ప్రభుత్వం అమలు చేసే ఏ సంక్షేమ పథకాన్ని అందుకోలేని దుస్థితి. ఆ కులాల్లోని చిన్నారులు విద్యకు దూరమయ్యారు. కేసీఆర్ ప్రభుత్వం ఆ సంచారజాతులను బీసీ ‘ఏ’ జాబితాలో చేర్చింది. కుల సర్టిఫికెట్లను మంజూరు చేస్తున్నది. ఫలితంగా ఆయా కులాలకు చెందినవారు అన్ని ప్రభుత్వ పథకాలను, అభివృద్ధి ఫలాలను అనుభవిస్తున్నారు. గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో వారికి 5 శాతం రిజర్వేషన్ కల్పించింది. ఎంబీసీల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ‘ఈ ఆటో రిక్షా’ పథకాన్ని ప్రవేశపెట్టి ఎలక్ట్రిక్ ఆటోలను అందిస్తున్నది. సంచార జాతులను గుర్తించడమేగాకుండా ఎంబీసీ కులాల ఆత్మగౌరవ భవన నిర్మాణానికి ఉప్పల్ భగాయత్లో స్థలంతోపాటు, నిధులను కూడా కేటాయించింది. కానీ, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ వారిని ఓబీసీ జాబితాలో చేర్చకపోవటం గమనార్హం.
ట్రాన్స్జెండర్లకు భరోసా
ట్రాన్స్జెండర్లు అంటే సమాజంలో ఒక చులకన భావం. వారిని చూస్తేనే చాలామంది అసహ్యించుకొంటారు. జీవనం సాగించే దారిలేక అనేక మంది భిక్షాటన చేస్తూ పొట్ట పోసుకోవాల్సిన దుస్థితి. వీరిని గతంలో ఆదుకొన్న ప్రభుత్వాలు లేవు. తొలిసారి తెలంగాణ సర్కారు ఆ దిశగా చర్యలు చేపట్టింది. లింగమార్పిడి వ్యక్తుల హక్కుల రక్షణ, సాధికారత కోసం ట్రాన్స్జెండర్స్ వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేసి రూ.2 కోట్ల నిధులను సైతం కేటాయించింది. ట్రాన్స్జెండర్స్ను స్వయం ఉపాధి దిశగా మళ్లించేందుకు రూ.54,79,226 వ్యయంతో సూరారంలో జ్యూట్ బ్యాగుల ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పింది. ట్రాన్స్జెండర్లకు ఉపాధి శిక్షణతోపాటు ఉచిత భోజన వసతి, రోజుకు రూ.200 ఉపకార వేతనం అందిస్తున్నది. అటు తరువాత ఏడాదిపాటు రూ. 15,650 గౌరవవేతనం చెల్లిస్తున్నది. శిక్షణ పొందిన ట్రాన్స్జెండర్స్ సొంతంగా యూనిట్లు ఏర్పాటు చేసుకొన్నారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారి ట్రాన్స్ ఉత్సవ్ను ప్రభుత్వం ఈ ఏడాది నిర్వహించింది.
పకడ్బందీగా చట్టాల అమలు
అభివృద్ధిలో అట్టడుగు స్థానంలో ఉన్న వర్గాల కోసం తెలంగాణ ప్రభుత్వం స్వయంగా పలు చర్యలను తీసుకోవటంతోపాటుగా కేంద్రం రూపొందించిన చట్టాలను పకడ్పందీగా అమలు చేస్తున్నది. అవసరమైన వ్యవస్థలను నెలకొల్పుతున్నది. తల్లిదండ్రులు, వయోవృద్ధుల పోషణ, సంక్షేమ చట్టం- 2007, లింగమార్పిడి వ్యక్తుల హక్కుల రక్షణ, సాధికారత చట్టం- 2020, దివ్యాంగుల చట్టం- 2016 అమలుకు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ చట్టం-2017ను అనుసరించి సలహా మండళ్లను ఏర్పాటు చేసింది.
అందరికీ సమాన రీతిలో సాయం
తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి వివక్షకు తావు లేకుండా పథకాలను అమలు చేస్తున్నది. సబ్బండ వర్గాలకు సమానంగా నిధులను అందజేస్తున్నది. పెన్షన్లు, కల్యాణలక్ష్మి/షాదీముబారక్ తదితర పథకాలన్నీ ఈ కోవలోనివే. కల్యాణలక్ష్మి తరహాలో హర్యానా ప్రభుత్వం ‘ముఖ్యమంత్రి వివాహ్ షగున్’ పథకాన్ని అమలు చేస్తున్నప్పటికీ.. అందులో అడుగడుగునా వివక్షే. వృద్ధులకు పెన్షన్లు ఇచ్చేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానామైతే మరీ విడ్డూరం. 65 నుంచి 80 ఏండ్ల లోపువారికి నెలకు రూ.600, ఎనిమిది పదుల వయసు దాటితే రూ.1000 పెన్షన్ అందజేస్తున్నది. దివ్యాంగులకు పెన్షన్లు అందించేందుకు చాలా రాష్ర్టాలు 80% వైకల్యాన్ని ప్రామాణికంగా తీసుకొంటున్నాయి. కొన్ని రాష్ర్టాలు మాత్రమే 60 శాతాన్ని కొలమానంగా తీసుకొని అందిస్తున్నాయి. ఏ పథకానికైనా ఆదాయ పరిమితిని అత్యల్ప స్థాయికి కుదించి ఆదిలోనే అనేక మందిని పథకాలకు దూరం పెడుతున్నారు. పథకం ద్వారా లబ్ధిపొందాలంటే కాళ్లు అరిగేలా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిందే. అడుగడుగునా పైరవీలతో పైసలు విదిల్చితే తప్ప పథకం అందని దుస్థితి. కానీ తెలంగాణలో పూర్తి భిన్నం. అందుకు కల్యాణలక్ష్మి/షాదీముబారక్ పథకం అమలు తీరే ప్రబల నిదర్శనం. సంక్షేమ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు అన్ని రాష్ర్టాలు రూ.1 లక్ష నుంచి రూ.1.80 లక్షల వార్షిక ఆదాయ పరిమితి విధిస్తే.. తెలంగాణలో ఆ పరిమితి రూ.2 లక్షలుగా ఉన్నది. పథకం కింద ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలందరికీ ఏకరీతిలో రూ.1,00,116 చొప్పున.. దివ్యాంగులకైతే మరో 25% అదనంగా (రూ.1,25,145 చొప్పున) అందిస్తున్నది. అన్ని రాష్ర్టాలు 60-80 శాతం వైకల్యమున్న దివ్యాంగులకు మాత్రమే పెన్షన్ అందిస్తున్నప్పటికీ తెలంగాణలో 40% వైకల్యమున్నా అందిస్తుండం విశేషం.
విభిన్న వర్గాలకు వినూత్న పథకాలు
మన సమాజంలో పేదలతోపాటు దళితులు, గిరిజనులు, మహిళలు, చిన్నారులు, వయోవృద్ధులు సహా వివిధ వర్గాలవారు ఉన్నారు. వారి సమస్యలు, సామాజిక-ఆర్థిక స్థితిగతులు, అవసరాలు భిన్నమైనవి. వాటన్నింటినీ సీఎం కేసీఆర్ అవగాహన చేసుకొని ఏ వర్గానికి అవసరమైన సంక్షేమ పథకాలను ఆ వర్గానికి అమలు చేస్తున్నారు. వ్యవసాయానికి నిరంతర ఉచిత విద్యుత్తు, రైతుబంధు, రైతు బీమా, చేనేత బీమా, దళితబంధు, నాయీబ్రాహ్మణులు, రజకులకు నెలకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్తు సరఫరా, చేపలు, గొర్రెలు, బర్రెల పంపిణీ, కల్లుగీత కార్మికులకు ప్రమాద ఎక్స్గ్రేషియా, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ తదితర పథకాలన్నీ ఈ కోవ లోనివే. లక్షిత వర్గాల ప్రాధాన్యపరంగా ఈ పథకాలను పక్కాగా అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తన లక్ష్యాన్ని చేరుకుంటుండటం ఎంతో అభినందనీయం.
విధి వంచితులకు ఆలంబన
తెలంగాణ ప్రభుత్వం అనాథలకు, ఒంటరి మహిళలకు ఆలంబనగా నిలుస్తున్నది. అనాథ బాలలకు బీసీ సర్టిఫికెట్లను అందజేస్తున్నది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకుల విద్యాలయాల్లో 3 శాతం రిజర్వేషన్లను కల్పిస్తున్నది. అనాథ బాలల కోసం త్వరలోనే సమగ్ర పాలసీని రూపొందించే పనిలో నిమగ్నమైంది. ఒంటరి మహిళలకు రూ.2,016 పెన్షన్ అందిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా 1,43,450 మందికి పెన్షన్లు అందిస్తూ ఆర్థిక భరోసాను కల్పిస్తున్నది. ఫైలేరియా, హెచ్ఐవీ, డయాలసిస్ వ్యాధిగ్రస్తులకు సైతం పెన్షన్లు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే కావటం గర్వకారణం.
దస్కత్లు, దరఖాస్తులు లేవు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గానీ, ప్రస్తుతం దేశంలోని మెజార్టీ రాష్ర్టాల్లో గానీ నిరుపేదలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను, అభివృద్ధి ఫలాలను అందుకోవాలంటే పెద్ద పోరాటమే చేయాలి . అధికార పార్టీ నేతలతో పైరవీలు చేయించుకుని, అధికారుల చేతులు తడిపితే గానీ ఏ పథకం అందేది కాదు. కానీ, ప్రస్తుతం సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణలో అలాంటి పరిస్థితులు మచ్చుకైనా లేవు. దరఖాస్తుదారులకు నిర్దేశిత అర్హతలుంటే రూ.2,016 ఆసరా పెన్షన్ అయినా, రూ.10 లక్షల దళితబంధు అయినా రాష్ట్ర ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేస్తుండటం విశేషం.