హైదరాబాద్, మార్చి 7(నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ కేశవులుపై వేటు పడింది. ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణకు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఆయనను ఎండీ బాధ్యతల నుంచి తప్పించి ఐఏఎస్ అధికారి హరితకు అదనపు బాధ్యతలను అప్పగించారు. వ్యవసాయ శాఖ అనుబంధ కార్పొరేషన్లకు సంబంధించి గత పదేండ్ల పనితీరుపైనా మంత్రి విచారణకు ఆదేశించారు.
గురువారం సచివాలయంలో కార్పొరేషన్లపై మంత్రి సమీక్ష నిర్వహించారు. కార్పొరేషన్ల నిర్ణయాలు, విధానాలపై పూర్తిస్థాయి విచారణ జరిపి 10 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆ శాఖ కార్యదర్శి రఘునందన్రావును మంత్రి తుమ్మల ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో ఐదు కార్పొరేషన్లకు వ్యవసాయ శాఖ డైరెక్టర్ను విచారణాధికారిగా నియమించగా, మరో ఐదింటికి కోఆపరేషన్ డైరెక్టర్ను నియమించారు. రాష్ట్ర హార్టికల్చర్ అభివృద్ధి కార్పొరేషన్ సంస్థకు డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ను, టెస్కాబ్కు దాని కార్యదర్శిని స్వయంగా విచారణ జరపాలని నిర్ణయించారు.మరోవైపురాష్ట్ర సీడ్ కార్పొరేషన్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని, తనపై వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలేనని రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ ఎండీ కేశవులు తెలిపారు.