Foreign Education | హైదరాబాద్, మే19 (నమస్తే తెలంగాణ): విదేశీ విద్యానిధికి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు స్కాలర్షిప్ కోసం కండ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. దరఖాస్తులు స్వీకరించి, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తయి నెలలు గడుస్తున్నా అధికారులు మాత్రం అర్హుల జాబితాను ఇప్పటికీ ప్రకటించలేదు. ఇదేమని అడిగితే ప్రభుత్వం నుంచి కొత్త మార్గదర్శకాలు రావాల్సి ఉందని చెబుతున్నారు. దీంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
గత ఫాల్ సీజన్కు 2665 మంది దరఖాస్తు
పేదింటి బీసీ బిడ్డలు విదేశాల్లో మాస్టర్స్, పీజీ, పీహెచ్డీ కోర్సుల అభ్యాసానికి గత ప్రభుత్వం జ్యోతిబా ఫూలే విదేశీ విద్యానిధి పథకాన్ని కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రతీ సంవత్సరం జనవరిలో (ఫాల్ సీజన్) 150 మంది, ఆగస్టులో (స్పింగ్ సీజన్) 150 మందిని మొత్తంగా రెండు సెషన్లకు కలిపి ఏడాదికి 300 మంది నిరుపేద బీసీ విద్యార్థులను ఒక్కొక్కరికి రూ.20లక్షల ఆర్థికసాయాన్ని అందిస్తున్నది. అదేవిధంగా వీసా చార్జీలను, రావడానికైనా లేదంటే పోవడానికైనా సంబంధించి ఎకనామిక్ టికెట్ గరిష్ఠంగా రూ.50వేలను ప్రయాణ ఖర్చులకు అందజేస్తుంది.
ఇక జ్యోతిబా ఫూలే విద్యానిధి పథకంలో మొత్తం సీట్లలో 30 సీట్లను ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు (ఈబీసీ)లకు కేటాయించింది. ఇప్పటివరకు ఈ పథకం కింద దాదాపు 2700 మందికి పైగా వెనకబడిగిన వర్గాలకు చెందిన విద్యార్థులు లబ్ధి పొందారు. కాగా బీసీ ఓవర్సీస్ పథకం కింద గత ఒక్క ఫాల్ సీజన్కే 2665 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో 2023మంది బీసీ కులాలకు చెందినవారు కాగా, 642 మంది ఈబీసీ కులాలకు చెందిన అభ్యర్థులు ఉన్నారు.
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కూడా ఇప్పటికే పూర్తయింది. వాటిని ఆన్లైన్లో కూడా ఎన్రోల్ చేసినట్టు అధికారులు వివరిస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఫాల్ సీజన్కు సంబంధించి స్కాలర్షిప్నకు ఎంపికైన అర్హుల జాబితాను మాత్రం ప్రభుత్వం ప్రకటించలేదు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిన అనంతరం మెరిట్ జాబితాను రూపొందించి దానిని స్టేట్ లెవల్ స్క్రీనింగ్ కమిటీకి పంపాల్సి ఉంటుంది.
కమిటీలోని సంబంధిత విభాగం అధికారులతోపాటు, హయ్యర్, టెక్నికల్ ఎడ్యుకేషన్, జేఎన్టీయూకు చెందిన సభ్యులు అర్హులను ఎంపిక చేస్తారు. అయితే అధికారులు ప్రస్తుతం ఫాల్ సీజన్కు సంబంధించి మెరిట్ జాబితానే అధికారులు రూపొందించలేదని తెలుస్తున్నది. ఇదిలా ఉంటే ఇప్పటికే స్పింగ్సీజన్ కోసం దరఖాస్తులను సైతం స్వీకరించింది. ఆ దరఖాస్తుదారులకు సైతం సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించాల్సి ఉంది.
కొత్త మార్గదర్శకాల కోసమే..
గత బీఆర్ఎస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం మార్గదర్శకాలను మార్పు చేసేందుకు నూతన కాంగ్రెస్ ప్రభుత్వం సమాయత్తమైనట్టు అధికారవర్గాలు వెల్లడిస్తున్నాయి. విదేశాల్లోని అన్ని యూనివర్సిటీలకు కాకుండా కేవలం కొన్నింటికే ఈ పథకాన్ని వర్తింపచేసి, విద్యార్థులకు ఆర్థిక సాయం అందించాలని యోచిస్తున్నదని తెలుస్తున్నది.
ఈ మేరకు గతంలోనే ఆదేశాలను జారీ చేసిందని, ఆ మేరకు మార్గదర్శకాలను సిద్ధం చేయాలని సూచించిందని వివరిస్తున్నారు. అధికారులు పన్ను చెల్లింపుదారుల కుటుంబాలకు, కొన్ని నిర్దేశిత టాప్ యూనివర్సిటీల్లో చదివే విద్యార్థులకే పథకాన్ని వర్తింపజేయాలని చూస్తున్నట్టు సమాచారం. ఆ దిశగా అధికారులు ప్రతిపాదనలు చేసి ప్రభుత్వానికి నివేదించారని తెలుస్తున్నది. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గదర్శకాలు వెలువడకపోవడంతోనే విదేశీ విద్యానిధికి అభ్యర్థుల ఎంపిక జాప్యమవుతున్నదని అధికారవర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
ఇక సీఎం ఓవర్సీస్, అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ల పరిస్థితి కూడా దాదాపు ఇలానే ఉన్నది. మరోవైపు విద్యార్థులు మాత్రం స్కాలర్షిప్ వస్తుందా? ప్రభుత్వం ఇస్తుందా? లేదా? అని తెలియక తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు. తల్లిదండ్రులు కూడా ఆందోళనకు గురవుతున్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే ఏదో నిర్ణయం ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.