Congress Govt | హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అత్యంత ప్రధానమైన 14 స్టేట్ రోడ్లను నాలుగు లేన్ల జాతీయ రహదారులుగా తీర్చిదిద్దాలన్న ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. తెలంగాణలో పెరిగిన ప్రజావసరాలను దృష్టిలో పెట్టుకొని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రోడ్లను జాతీయ రహదారులుగా అభివృద్ధి చేయాలని కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పించింది.
వీటిలో జిల్లా కేంద్రాలు, పారిశ్రామికవాడలు, పర్యాటక ప్రాంతాలు, ప్రధాన ఆలయాలు, అంతర్రాష్ట్ర రహదారులను కలిపే రోడ్లు ఉన్నాయి. కానీ, వాటిని మంజూరు చేయకుండా తెలంగాణ పట్ల మోదీ సర్కారు వివక్ష ప్రదర్శించింది. రాష్ట్రంలోని ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు ఈ రోడ్ల అభివృద్ధి కోసం కేంద్రానికి మరోసారి ప్రతిపాదనలు సమర్పించి చేతులు దులిపేసుకున్నది.
రాష్ట్ర ప్రభుత్వ నిధులతో దశలవారీగా ఈ రోడ్లను అభివృద్ధి చేసే అవకాశం ఉన్నప్పటికీ రేవంత్రెడ్డి సర్కారు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసిన రోడ్లను సైతం రద్దుచేసి రాజకీయాలు చేస్తున్నది. స్వరాష్ట్రం ఏర్పాటు తరువాత తెలంగాణ సమగ్రాభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించిన కేసీఆర్ ప్రభుత్వం.. రహదారుల అభివృద్ధికి విస్తృత చర్యలు చేపట్టింది. అందులో భాగంగా అనేక గ్రామీణ రోడ్లను రాష్ట్ర రహదారులుగా అభివృద్ధి చేసింది.
సింగిల్ లేన్ రోడ్లను రెండు లేన్లుగా, మెటల్ రోడ్లను డాంబర్ రోడ్లుగా మార్చింది. ఈ క్రమంలో అత్యంత ప్రధానమైన 14 రాష్ట్ర రహదారులను నాలుగు లేన్లుగా అభివృద్ధి చేయాలని కేంద్రానికి ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలను ఆమోదించాలని మోదీ సర్కారుకు పలు వినతిపత్రాలను సమర్పించడమే కాకుండా కేసీఆర్ స్వయంగా కేంద్ర మంత్రితో మాట్లాడినా ఫలితం లేకపోయింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే ఈ రోడ్లను అభివృద్ధి చేయాలని గత కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది.
అనంతరం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఈ 14 రోడ్ల అభివృద్ధి అటకెక్కింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన వారం రోజుల్లోనే ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీలో కేంద్ర మంత్రి గడ్కరీని కలిసి ఈ 14 రోడ్ల అభివృద్ధి కోసం వినతిపత్రం ఇచ్చినప్పటికీ ఆయన నుంచి ఎలాంటి హామీ లభించలేదు.
చేతులెత్తేసిన రాష్ట్ర ప్రభుత్వం
రాష్ట్రంలోని రోడ్ల అభివృద్ధికి ప్రస్తుత ఆర్థిక సంవత్సర బడ్జెట్లో కేటాయించాల్సిన నిధులపై చర్చించేందుకు ఫిబ్రవరిలో ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించినప్పటికీ ఈ 14 రోడ్ల అంశం కనీసం ప్రస్తావనకు కూడా రాలేదు. మొత్తం 1,656 కి.మీ. పొడవైన ఈ రోడ్లకు బడ్జెట్లో కొంతైనా నిధులు కేటాయిస్తే దశలవారీగానైనా వాటిని అభివృద్ధి చేసేందుకు వీలుండేది. కానీ, ఎంతో ప్రధానమైన ఈ రోడ్లను రేవంత్ సర్కారు పూర్తిగా గాలికి వదిలేసింది. వాటి అభివృద్ధి కోసం కేంద్రానికి మరోసారి ప్రతిపాదనలు సమర్పించి చేతులెత్తేసింది. దీంతో కేంద్ర ప్రభుత్వం కనికరించే వరకు ఈ రోడ్ల అభివృద్ధికి మోక్షం లభించే అవకాశం కనిపించడం లేదు.