హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): బీజేపీ అస్తవ్యస్త విధానాలతో దేశ ఆర్థిక పరిస్థితి నానాటికీ క్షీణించిపోతున్నదని, ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకే సీఎం కేసీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారిందని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. ఢిల్లీలో బుధవారం బీఆర్ఎస్ జాతీయ కార్యాయం ప్రారంభోత్సవంలో పాల్గొన్న అనంతరం స్థానిక మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు.
నల్లధనం, పేదరిక నిర్మూలన, స్వామినాథన్ సిఫారసుల మేరకు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని, యువతకు ఏటా 2 కోట్ల ఉద్యోగావకాశాలు కల్పిస్తానని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన నరేంద్రమోదీ.. అందులో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. రైతుల పట్ల మోదీ సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. 75 ఏండ్లు దేశ ప్రజలు కష్టపడి నిర్మించిన ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్, వైజాగ్ స్టీల్ వంటి సంస్థలను, ఆఖరికి ప్రభుత్వ రంగంలో ఉండాల్సిన ఓడరేవులు, ఎయిర్పోర్టులను కూడా బీజేపీ సర్కారు తెగనమ్ముతున్నదని మండిపడ్డారు.
ఆర్థిక నేరాలను అరికట్టేందుకు వాజ్పేయి హయాంలో ఈడీని ఏర్పాటుచేస్తే, నేటి మోదీ సర్కారు రాజకీయ స్వార్థం కోసం దానిని వాడుకొంటున్నదని ధ్వజమెత్తారు. అన్నింటికీ మించి భారత సమాజ పునాది అయిన ప్రజాస్వామ్య, లౌకిక వాదాలనే బీజేపీ ధ్వంసం చేస్తున్నదని విమర్శించారు. ఈ నేపథ్యంలో దేశానికి కొత్త నాయకత్వం అవసరమని, కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ అవతరించిందని చెప్పారు. రైతు సర్కార్ రావాలన్నదే బీఆర్ఎస్ ఆకాంక్ష అని వెల్లడించారు.
ఇటీవల దేశంలో ఎక్కువగా వరి విస్తీర్ణం పెంచి రాబడి పెంచుకొన్న రాష్ట్రంగా తెలంగాణను సీఎం కేసీఆర్ నిలబెట్టారని తెలిపారు. తెలంగాణ పదాన్ని టీఆర్ఎస్ కోల్పోయిందని కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేయడాన్ని ఆయన ఖండించారు. గుజరాత్ ఎన్నికల కోసం 10 నెలల్లోనే ప్రధాని మోదీ ఆ రాష్ట్రంలో దాదాపు రూ.1.35 లక్షల కోట్ల నిధులు కుమ్మరించారని ధ్వజమెత్తారు.