హైదరాబాద్: గణేష్ ఉత్సవాల నిర్వహణపై రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గణేష్ ఉత్సవాల నిర్వహణ, ఉత్సవాలు సజావుగా సాగేందుకు అనుసరించాల్సిన వ్యూహం, తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై ఈ సమావేశంలో మంత్రులు, అధికారులు చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి రాష్ట్రంలో అన్ని మతాల పండుగలను ప్రజలు కలిసిమెలిసి జరుపుకుంటున్నారని చెప్పారు. ప్రజలు, ప్రజాప్రతినిదులు , అధికారులు, భాగ్యనగర్ ఉత్సవ కమిటీ, మండపాల నిర్వాహకులు ఇలా అందరూ శాంతియుత వాతావరణంలో ప్రశాంతంగా గణేష్ ఉత్సవాలు జరిగేలా సహకరించాలని కోరారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి గణపతి ప్రతిమలను పంపిణీ చేస్తామన్నారు. ఇండ్లలో కూడా మట్టి వినాయక విగ్రహలను ప్రతిష్టించి, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పూజలు జరుపుకోవాలని సూచించారు.