Medical Colleges | హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతో ఏర్పాటుచేస్తున్న మెడికల్ కాలేజీలను కేంద్ర ప్రభుత్వ ఖాతాలో వేస్తూ తప్పుడు ప్రచారం జరుగుతున్నది. వాస్తవానికి ఈ ఏడాది నేషనల్ మెడికల్ కమిషన్ దేశవ్యాప్తంగా 50 మెడికల్ కాలేజీలకు అనుమతులు మంజూరు చేసింది. ఇందులో ప్రభుత్వ, ప్రైవేట్, ట్రస్ట్ ఆధ్వర్యంలో నడిచే కాలేజీలు ఉన్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణలో ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తొమ్మిది మెడికల్ కాలేజీలతోపాటు మరో నాలుగు ప్రైవేట్ కాలేజీలకు ఎన్ఎంసీ అనుమతులు ఇచ్చింది.
ఇది ప్రతి సంవత్సరం జరిగే సాధారణ ప్రక్రియ. ఈ విషయాన్ని తప్పుదోవ పట్టిస్తూ కేంద్ర ప్రభుత్వమే ఈ ఏడాది 50 మెడికల్ కాలేజీలు మంజూరు చేసినట్టుగా సోషల్ మీడియాలో దుష్ప్రచారం మొదలైంది. కేంద్ర వైద్యారోగ్యశాఖ తెలంగాణకు 13 మెడికల్ కాలేజీలు మంజూరు చేసిందని కొందరు ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతో ఏర్పాటుచేస్తున్న కాలేజీలను కేంద్రం ఖాతాలో వేయడానికి ప్రయత్నించారు. ఈ ప్రచారాన్ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఖండించింది. కేంద్రం కేవలం అనుమతులు ఇచ్చిందని, కాలేజీల ఏర్పాటులో ఒక్క రూపాయి కూడా కేంద్రం వాటా లేదని స్పష్టం చేసింది.