తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 11.30 గంటలకు సభ ప్రారంభమవగానే ఆర్థిక మంత్రి హరీష్రావు బడ్జెట్ ప్రసంగం చదివి వినిపించారు. ఈ బడ్జెట్ ప్రసంగంలోని హైలెట్స్ను నమస్తే తెలంగాణ వెబ్సైట్ పాఠకుల కోసం అందిస్తున్నాం..
1. దళిత బంధు పథకానికి గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఈ ఏడాది నిధులను భారీగా పెంచారు. గత వార్షిక బడ్జెట్లో వెయ్యి కోట్లను కేటాయించగా ఈసారి ఏకంగా రూ.17,700 కోట్లు కేటాయించారు. దళిత బంధు పథకాన్ని హుజురాబాద్ నియోజకవర్గంతోపాటు చింతకాని, తిరుమలగిరి, నిజాంసాగర్, చారగొండ మండలాల్లో ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్నది. అంతేగాక రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గానికి వందమంది చొప్పున మొత్తం 118 నియోజకవర్గాల్లో 11 వేల 800 కుటుంబాలకు దళితబంధు పథకం కింద ఆర్థికసహాయం అందిస్తున్నది. వచ్చే సంవత్సరాంతానికి రెండు లక్షల మందికి లబ్ధి చేకూర్చాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఈ బడ్జెట్లో నిధులను భారీగా పెంచింది.
2. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా దృష్టి కేంద్రీకరిస్తూ మనఊరు- మనబడి పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లోనూ ఇంగ్లీషు మీడియంలో విద్యాబోధనను అందించడానికి శ్రీకారం చుట్టింది. పేదలకు ఆంగ్ల మాధ్యమం అందని ద్రాక్ష కాకూడదనీ, వారు కూడా మిగతా ప్రపంచంతో సమానంగా ఎదగాలనీ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియంను ప్రవేశపెడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 7,289 కోట్ల రూపాయలతో దశల వారీగా పాఠశాలల్లో అభివృద్ది పనులను చేపడుతున్నది. మొదటి దశలో మండలాన్ని యూనిట్గా తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా 9,123 పాఠశాలల్లో రూ.3,497 కోట్లతో కార్యాచరణ ప్రారంభించింది.
3. రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం ఈ ఆర్థిక సంవత్సరంలో వంద కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నది.
4. ఈ ఆర్ధిక సంవత్సరంలో రాష్ట్రంలో కొత్తగా అటవి విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం ఈ బడ్జెట్లో వంద కోట్ల రూపాయలను కేటాయించింది.
5. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రాబోయే రెండేళ్లలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ సంవత్సరం కొత్తగా ప్రభుత్వం ఎనిమిది వైద్య కళాశాలలను ఆసిఫాబాద్, భూపాలపల్లి, వికారాబాద్, సిరిసిల్ల, జనగామ, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం జిల్లాలలో ఏర్పాటు చేస్తున్నది. 2023లో రాష్ట్రంలోని మిగతా ఎనిమిది జిల్లాలైన మెదక్, మేడ్చల్, రంగారెడ్డి, ములుగు, వరంగల్, నారాయణపేట, గద్వాల, యాదాద్రిల్లో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయనుంది. నూతన మెడికల్ కాలేజీల స్థాపనకు ఈ బడ్జెట్లో ప్రభుత్వం వెయ్యికోట్లు కేటాయించింది.
6. ప్రభుత్వ హాస్పిటళ్లలో రోగులకు చికిత్సతో పాటు పోషకాహారాన్ని అందించాలనీ, ఇందుకోసం డైట్ ఛార్జీలను రెట్టింపు (డబుల్) చేయాలని ప్రభుత్వంనిర్ణయించింది. టీబీ క్యాన్సర్ తదితర రోగులకు బలవర్ధకమైన ఆహారం అందించడం కోసం బెడ్ ఒక్కంటికి ఇచ్చే డైట్ ఛార్జీలను రూ.56 నుంచి 112 కు పెంచాలని, సాధారణ రోగులకు ఇచ్చే డైట్ ఛార్జీలు బెడ్ ఒక్కంటికి రూ.40 నుంచి 80కి పెంచాలని ఈ బడ్జెట్ లో ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం ప్రభుత్వం ప్రతి ఏటా రూ.43.5 కోట్లు ఖర్చు చేయనుంది.
7. హైదరాబాద్లోని 18 మేజర్ ప్రభుత్వ హాస్పటళ్లలో రోగి సహాయకులకు కూడా సబ్సిడీపై భోజన సదుపాయం కల్పించాలని ఈ బడ్జెట్లో నిర్ణయించారు. రెండు పూటలా వారికి ఈ భోజనం అందుతుంది. ప్రతిరోజు సుమారు 18,600 మందికి ఈ ప్రయోజనం కలుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీని కోసం సంవత్సరానికి రూ.38.66 కోట్లు ఖర్చవుతాయి.
8. పారిశుధ్య కార్మికులకు, ఇతర సిబ్బందికి వేతనాలు పెంచాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు బడ్జెట్లో ప్రభుత్వం బెడ్ ఒక్కంటికి చేసే పారిశుద్ద్య ఖర్చును రూ.5000 నుంచి రూ.7500కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇందు కోసం రూ.338 కోట్లను ప్రతి ఏడాది వెచ్చించనుంది.
9. రాష్ట్రవ్యాప్తంగా 61 మార్చురీల ఆధునీకరణకు రూ.32.50 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది .
10. 2022-23 సంవత్సరంలో బడ్జెట్లో పామాయిల్ సాగును ఎక్కువగా ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2.5 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసం ఈ బడ్జెట్లో రూ.1000 కోట్లను కేటాయించింది. దేశంలో ఇంత పెద్దఎత్తున ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తోన్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే.
11. ప్రభుత్వం వ్యవసాయ రంగానికి బడ్జెట్లో గత ఏడేళ్లుగా పెద్దఎత్తున నిధులు కేటాయిస్తున్నది. గత ఎనిమిది వ్యవసాయ సీజన్లలో రైతుబంధు పథకం కింద రూ.50,448 కోట్లను 63 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమచేసింది. రైతు మరణిస్తే రైతు బీమా పథకం ద్వారా వారి కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నది. ఇలా ఇప్పటివరకు 75 వేల కుటుంబాలకు రూ.3,775 కోట్లు అందజేసింది. ఈ వార్షిక బడ్జెట్లో వ్యవసాయ రంగానికి మొత్తంగా రూ.24,254 కేటాయించింది. గతంలో ఇచ్చిన హామీ మేరకు ఈ ఏడాది రూ.75 వేలలోపు రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించింది.
12. వృద్ధాప్య పింఛన్ల మంజూరు కోసం విధించిన వయోపరిమితిని ప్రభుత్వం 65 ఏండ్ల నుంచి 57 ఏండ్లకు తగ్గించింది. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి సడలించిన వయోపరిమితి ప్రకారం కొత్త లబ్దిదారులకు ఆసరా ఫించన్లను ప్రభుత్వం అందజేస్తుంది. ఆసరా ఫించన్ల కోసం 2022-2023 వార్షిక బడ్జెట్లో రూ.11,728 కోట్లు ప్రతిపాదించింది.
13. సొంత జాగ కలిగిన వారు తమ స్థలంలో డబుల్ బెడ్రూం ఇల్లు కట్టుకోవడం కోసం మూడు లక్షల రూపాయల చొప్పున అందించాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఈ బడ్జెట్లో అందుకు నిధులు కేటాయించారు. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు లక్షల మందికి సొంత స్థలంలో డబుల్బెడ్రూం ఇండ్ల నిర్మాణం కోసం ఒక్కొక్కరికి మూడు లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం ఇవ్వబోతున్నది. నియోజకవర్గానికి మూడువేల ఇండ్ల చొప్పున కేటాయించనున్నది. ఈ ఆర్థిక సంవత్సరంలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం కోసం రూ.12000 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.
14. ఎస్టీ నివాస ప్రాంతాలకు రోడ్ల నిర్మాణం కోసం ఎస్టీఎస్డీఎఫ్ నిధుల నుంచి రూ.1000 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.
15. గొల్ల కురుమల సంక్షేమం కోసం ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు కేటాయించింది. రూ.11,000 కోట్ల వ్యయంతో 7.3 లక్షల యూనిట్ల గొర్రెల పంపిణీ లక్ష్యంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. అందుకు ఈ బడ్జెట్లో రూ.1000 కోట్లు కేటాయించింది.
16. రైతు బీమా మాదిరిగానే నేతన్నలు మరణిస్తే వారి కుటుంబాలను ఆదుకునేందుకు ఐదు లక్షల రూపాయల బీమా పథకాన్ని అమలు చేయాలని ఈ బడ్జెట్లో ప్రభుత్వం ప్రతిపాదించింది.
17. గీత కార్మికుల సంక్షేమం కోసం వందకోట్ల రూపాయలతో ప్రత్యేక పథకాన్ని త్వరలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ఈ బడ్జెట్లో నిర్ణయం తీసుకుంది.
18. బాలింతలలో రక్తహీనత సమస్య ఎక్కువగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ లోపాన్ని నివారించేందుకు ‘కేసీఆర్ నూట్రీషియన్ కిట్’ అనే పేరుతో పోషకాహారంతో కూడిన కిట్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ కిట్స్ ద్వారా ప్రతి సంవత్సరం లక్షా 25 వేల మంది మహిళలు ప్రయోజనం పొందనున్నారు.
19. రాష్ట్రవ్యాప్తంగా అన్నిప్రభుత్వ పాఠశాలల్లో, జూనియర్ కాలేజీల్లో 7 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్ధినులకు ఉచితంగా హెల్త్ అండ్ హైజనిక్ కిట్స్ ను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఈ పథకంవల్ల రాష్ట్రవ్యాప్తంగా ఏడు లక్షల మంది బాలికలకు ప్రయోజనం చేకూరనుంది.
20. హైదరాబాద్ చుట్టూ, ఔటర్ రింగ్ రోడ్డు చుట్టు ఉన్న గ్రామాలు, మున్సిపాలిటీల్లో నీటి కొరతను శాశ్వతంగా తీర్చేందుకు రూ.1200 కోట్లను ఈ వార్షిక బడ్జెట్లో ప్రతిపాదించారు.
21. దూపదీప నైవేధ్య పథకంలో హైదరాబాద్లోని దేవాలయాలను చేర్చాలన్న అర్చకుల కోరిక మేరకు ఈ ఏడాది 1736 దేవాలయాలను కొత్తగా ఈ పథకంలో చేరుస్తున్నారు. దూపదీప నైవేద్య పథకానికి రూ.12.50 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.
22. రోడ్ల నిర్మాణం, మరమ్మతులు, నిర్వహణ కోసం రూ.1542 కోట్లను ప్రభుత్వం తాజా బడ్జెట్లో కేటాయించింది.
23. మెట్రో రైలును పాతబస్తీలో 5.5 కిలోమీటర్లకు అనుసంధానించేందుకు ఈ బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించింది.
24. భవననిర్మాణ కార్మికుల సంక్షేమానికి కొత్త పథకం ప్రవేశపెట్టనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఆ పథకంలో భాగంగా మొదటి విడుతలో లక్షమంది కార్మికులకు మోటార్ సైకిళ్లను ఇవ్వాలని బడ్జెట్లో ప్రతిపాదించింది. విధివిదానాలను త్వరలో ప్రకటించనుంది.
25. రైతుబందు పథకం తరహాలో నేత కార్మికుల కోసం ఈ ఏడాది ప్రత్యేక పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
26. గిరిజన, ఆదివాసీ గ్రామ పంచాయతీలకు సొంత భవనాల నిర్మాణాన్ని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం ఈ ఏడాది రూ.600 కోట్లను వెచ్చించనుంది.
27. కాళేశ్వరం టూరిజం సర్య్యూట్ కు ఈ బడ్జెట్లో రూ.750 కోట్లు కేటాయించింది.
28. అర్బన్ మిషన్ భగీరథకు ఈ బడ్దెట్లో రూ.800 కోట్లు కేటాయించింది.
29. ఏయిర్పోర్టు మెట్రో కనెక్టవిటీకి ఈ బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించింది. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుకు మరో రూ.1500 కోట్లు కేటాయించింది.
30. పరిశ్రమలకు ప్రోత్సాహకాలుగా రూ.2,142 కోట్లు, పరిశ్రమలకు విద్యుత్ రాయితీ కింద రూ.190 కోట్లను తాజా బడ్జెట్లో ప్రభుత్వం కేటాయించింది.
31. పావలా వడ్డీ స్కీమ్ను ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు వర్తింపజేయడానికి, మహిళలు చిన్నతరహా పరిశ్రమలను ఏర్పాటు చేసేలా ప్రోత్సహించడానికి రూ.187 కోట్లు కేటాయించింది.
32. హైదరాబాద్ మెట్రో పరిధిలో రోజుకు 20 లీటర్ల ఉచిత నీరు అందించేందుకు రూ.300 కోట్ల రూపాయలను ఈ బడ్జెట్లో కేటాయించింది.
33. అదేవిధంగా ఆర్టీసీని బలోపేతం చేసేందుకు ఈ బడ్జెట్లో రూ.1500 కోట్లు కేటాయించింది.
34. హైదరాబాద్లో 350 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ప్రస్తుతం నగరంలో 256 బస్తీ దవాఖానలు సేవలందిస్తున్నాయి. వీటిలో వైద్య సేవలతోపాటు 57 రకాల పరీక్షలు చేస్తున్నారు. ఉచితంగా మెడిసిన్ అందిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మరో 60 బస్తీ దవాఖానలను ప్రారంభించనున్నట్లు ఆర్థికమంత్రి హరీష్రావు చెప్పారు.
35. దేశంలో ఎక్కడాలేని విధంగా న్యాయవాదుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించిందని, నిధుల నిర్వహణ బ్యాధతను అడ్వకేట్ వెల్ఫేర్ ట్రస్ట్కు అప్పగించిందని మంత్రి హరీశ్రావు చెప్పారు. వెల్ఫేర్ ట్రస్ట్ ద్వారా 22వేల మంది న్యాయవాదులకు ఇన్సూరెన్స్ పాలసీలు అందించినట్లు తెలిపారు.
36. జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం రూ.100 కోట్ల నిధిని ఏర్పాటు చేసిందని మంత్రి తెలిపారు. ఇప్పటివరకు రూ.52 కోట్లు తెలంగాణ ప్రెస్ అకాడమీకి కేటాయించిందని, ఎవరైనా జర్నలిస్ట్ మరణిస్తే ప్రెస్ అకాడమీ ద్వారా రూ.లక్ష, శాశ్వత అంగవైకల్యం సంభవిస్తే రూ.50 వేల ఆర్థిక సాయం అందిస్తున్నట్లు చెప్పారు.
37. రాష్ట్రంలోని గీత కార్మికుల సంక్షేమం కోసం రూ.100 కోట్లతో ప్రత్యేక పథకాన్ని ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టబోతున్నదని ఆర్థిక మంత్రి హరీశ్రావు తన బడ్జెట్ ప్రసంగంలో స్పష్టం చేశారు. గౌడన్నల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. చెట్లకు పన్ను వసూలు చేసే విధానానికి తెలంగాణ ప్రభుత్వం స్వస్తి చెప్పిందని గుర్తుచేశారు. నీరా ఉత్పత్తి, సేకరణ కోసం రూ.20 కోట్లను ప్రభుత్వం కేటాయించిందన్నారు. భువనగిరి సమీపంలోని నందనంలో నీరా ప్రాసెసింగ్ యూనిట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నెక్లెస్ రోడ్డులో నిర్మిస్తున్న నీరా కేఫ్ను ప్రభుత్వం త్వరలోనే ప్రారంభించనుందని తెలిపారు.
38. ఈ బడ్జెట్లో ప్రభుత్వం పల్లె ప్రగతికి రూ.3,330 కోట్లు, పట్టణప్రగతికి రూ.1394 కోట్లు కేటాయించింది. మొత్తంగా ఈ రెండు కార్యక్రమాలకు కలిపి రూ.4724 కోట్లు ప్రతిపాదించింది.