హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మెడికల్ కాలేజీలో వంద ఎంబీబీఎస్ సీట్లకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) శనివారం అనుమతి ఇచ్చింది. ఈ ఏడాది ప్రారంభం కానున్న తొమ్మిది మెడికల్ కాలేజీల్లో ఇప్పటికే ఆరు మెడికల్ కాలేజీలకు అనుమతులు లభించాయి. సిరిసిల్ల కాలేజీతో ఆ సంఖ్య ఏడుకు చేరింది. ఎన్ఎంసీ అనుమతులపై వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ట్విట్టర్ వేదికగా శనివారం హర్షం వ్యక్తంచేశారు.
‘రాజన్న సిరిసిల్ల ప్రభుత్వ వైద్య కళాశాలకు 100 ఎంబీబీఎస్ సీట్లతో ఆమోదం లభించింది. సీఎం కేసీఆర్ గారి ఆరోగ్య తెలంగాణ లక్ష్యంలో భాగంగా.. 24 ప్రభుత్వ వైద్యకళాశాలతో కలిపి.. ‘ఒక జిల్లాకు ఒక వైద్యకళాశాల’ ఆశయం విజయవంతంగా ముందుకు కొనసాగుతున్నది’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు. ఇప్పటికే జనగామ, ఆసిఫాబాద్, కామారెడ్డి, ఖమ్మం, వికారాబాద్, భూపాలపల్లి, సిరిసిల్ల ప్రభుత్వ కాలేజీలకు ఎంబీబీఎస్ సీట్లు అనుమతి లభించింది. నిర్మల్, కరీంనగర్ మెడికల్ కాలేజీల అనుమతుల ప్రక్రియ తుదిదశకు చేరుకున్నది.