రైతులకు నిరంజన్రెడ్డి పిలుపు
ధాన్యం కొనాలని 12,600 గ్రామపంచాయతీల తీర్మానం
ఎమ్మెల్యేలతో మంత్రి టెలికాన్ఫరెన్స్
వనపర్తి, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): ధాన్యం కొనుగోలుకు నిరాకరిస్తున్న కేంద్రంపై సీఎం కేసీఆర్ నాయకత్వంలో యుద్ధానికి సన్నద్ధం కావాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి రైతులకు పిలుపునిచ్చారు. శనివారం ఆయన మరో మంత్రి శ్రీనివాస్గౌడ్తోపాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు, రైతుబంధు సమితి నాయకులు, పార్టీ శ్రేణులతో టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారు. తెలంగాణ ఒక వ్యవసాయిక రాష్ట్రమని, అనతి కాలంలోనే వ్యవసాయ రంగంలో అగ్రగామిగా నిలిచిందన్నారు.
తెలంగాణలో పండిన ధాన్యం కొనుగోలుకు కేంద్రం ముందుకు రావడం లేదని, ఇదే విషయాన్ని ముందే గ్రహించి రైతులకు ఇతర పంటల సాగుపై అవగాహన కల్పించినట్టు చెప్పారు. అయితే యాసంగిలో పండిన ధాన్యాన్ని కొనుగోలు చేయలేమని కేంద్ర మంత్రులు చెప్పడం సరికాదన్నారు. ప్రజల ప్రయోజనాలు పట్టని గుడ్డి ప్రభుత్వం కేంద్రంలో ఉన్నదని దుయ్యబట్టారు. ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్రాన్ని కోరుతూ ఇప్పటికే 12,600 గ్రామ పంచాయతీలు తీర్మానం చేస్తూ మోదీ ప్రభుత్వానికి లేఖలు పంపించినట్టు తెలిపారు. ఇప్పటికైనా రైతులపై వివక్ష మానుకొని వెంటనే వడ్లను కొనుగోలు చేయాలని ఆయన కేంద్రాన్ని కోరారు.