Secretariat | హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలమేరకు ఐదంచెల భద్రతను ఏర్పాటు చేయనున్నారు. నూతన సచివాలయానికి పటిష్టమైన భద్రతను అందించే బాధ్యతను డీజీపీ అంజనీకుమార్ ‘తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్’ (టీఎస్ఎస్పీ)కు అప్పగించారు. ఈ మేరకు తక్షణమే విధుల్లోకి చేరేలా చర్యలు తీసుకోవాలని టీఎస్ఎస్పీ అడిషనల్ డీజీ స్వాతి లక్రాను డీజీపీ అంజనీకుమార్ ఆదేశించారు. అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో.. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్మించుకున్న నూతన సచివాలయాన్ని ఈ నెల 30న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఇంద్రభవనాన్ని తలపిస్తున్న మన సచివాలయాన్ని చూసేందుకు ఇప్పటికే ఎంతోమంది సందర్శకులు క్యూ కడుతున్నారు. సచివాలయం ప్రారంభమైన తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, ప్రజల రాకతో సచివాలయ ప్రాంగణం కిక్కిరిసిపోయే అవకాశం ఉన్నందున భద్రతాపరంగా ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పటిష్టమైన రక్షణ కల్పించాలని ప్రభుత్వం యోచించింది. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు సచివాలయానికి పోలీస్ శాఖ ఐదంచెల భద్రతను ఏర్పాటు చేసింది.
ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ బెటాలియన్స్ నుంచి మూడు కంపెనీలు నిరంతరం గస్తీ కాస్తాయి. బీఆర్ అంబేద్కర్ సచివాలయానికి పక్కనే అమరవీరుల స్థూపం, అంబేద్కర్ 125 అడుగుల భారీ విగ్రహం, ఎన్టీఆర్ ఘాట్, పక్కనే హుస్సేన్ సాగర్, నెక్లెస్ రోడ్ ఈవెంట్స్, ఆ పక్కనే ఐమాక్స్ ఉండటం, ఆ ప్రాంతమంతా టూరిస్ట్ స్పాట్గా మారడంతో భద్రతాపరంగా ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. టీఎస్ఎస్పీ బెటాలియన్ నుంచి ఒక్కో కంపెనీలో 90 మంది సిబ్బంది ఉంటారు. వీరిలో ముగ్గురు కమాండెంట్లు, ఆరుగురు అసిస్టెంట్ కమాండెంట్లు, రిజర్వ్ ఇన్స్పెక్టర్ ర్యాంకు సిబ్బంది ఆరుగురు, ఆర్ఎస్ఐలు 12 మంది, ఏఎస్ఐలు 18, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు కలిపి మొత్తం 90 మంది ఉంటారు. ఇలా మూడు కంపెనీల నుంచి మొత్తం 270 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తారు. పాత సచివాలయానికి కేవలం 150 మంది ఎస్పీఎఫ్ సిబ్బందితో రక్షణ కల్పించగా.. కొత్త సచివాలయానికి ఆ సంఖ్య నాలుగింతలు పెరిగింది.
టీఎస్ఎస్పీ కంపెనీల బలగాలకు తోడు ఆక్టోపస్ నుంచి ఓ యూనిట్ను సచివాలయ భద్రతకు కేటాయించారు. ఈ స్పెషల్ యూనిట్లో మొత్తం 21 మంది సిబ్బంది ఉంటారు. వీరికి ర్యాంకులవారీగా విధి విధానాలు ఉంటాయి. సిటీ సెక్యూరిటీ వింగ్కు చెందిన 80 మంది సిబ్బంది కూడా సచివాలయ భద్రతలో భాగం కానున్నారు. వీరు ప్రత్యేకంగా చెకింగ్, బ్యాగేజీ చెకింగ్, బాంబ్, మెటల్ చెకింగ్ వంటి విధులు నిర్వర్తిస్తారు. ఈ విభాగంలో అడిషనల్ డీసీపీ ర్యాంకు అధికారి ఒకరు, ఏసీపీ ర్యాంకు అధికారులు ముగ్గురు, ఆర్ఐలు ఆరుగురు, ఆర్ఎస్ఐలు, ఏఎస్ఐలు, హెడ్కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు ఉంటారు. వీరితోపాటు సివిల్ పోలీసుల (సివిల్ ఫోర్స్) నుంచి ఇద్దరు డీఎస్పీలు, ముగ్గురు సీఐలు, ఎస్ఐలు ఆరుగురు, మిగతా సిబ్బంది మొత్తం కలిపి 32 మంది కేవలం సచివాలయ భద్రత కోసం పనిచేస్తారు. ఇంటలిజెన్స్ విభాగం నుంచి అడిషనల్ ఎస్పీ ఒకరు, ఏసీపీ ఒకరు, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, ఇతర సిబ్బంది భద్రతలో భాగమవుతారు. ఇక స్పెషల్ బ్రాంచ్ నుంచి ఏసీపీ, సీఐ, ఇద్దరు ఎస్ఐలు, సుమారు 8 మంది కానిస్టేబుళ్లు విధులు నిర్వర్తిస్తారు.
సచివాలయ పరిసరాల పరిధిలో ట్రాఫిక్ను నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇందుకోసం సుమారు 25 మంది ట్రాఫిక్ సిబ్బంది షిఫ్టులవారీగా విధులు నిర్వర్తిస్తారు. ప్రస్తుతం సెక్రటేరియట్కు 22 మంది ట్రాఫిక్ సిబ్బందిని కేటాయించారు. ఇన్స్పెక్టర్, ఎస్ఐ, మిగిలిన ర్యాంకుల సిబ్బంది ఉంటారు. వీరు సెక్రటేరియట్ పార్కింగ్, సీఎం మూమెంట్, మంత్రుల పార్కింగ్, విజిటర్స్ పార్కింగ్, ఉద్యోగులు, పౌరుల కోసం పనిచేస్తారు. అమరవీరుల స్థూపం, అంబేద్కర్ భారీ విగ్రహం, సచివాలయం ప్రాంతాలకు ఎక్కువగా పర్యాటకులు వచ్చే అవకాశం ఉండటంతో.. సచివాలయంలోకి వెళ్లే ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు విధులకు ఇబ్బంది కలుగకుండా ట్రాఫిక్ సిబ్బందిని సిద్ధం చేశారు. ట్రాఫిక్ రద్దీ పెరిగిన మరుక్షణమే సిబ్బందిని పెంచేందుకు ప్రణాళికలు రూపొందించినట్టు హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఇక నుంచి అంబేద్కర్ నూతన సచివాలయం భద్రతను టీఎస్ఎస్పీ చూసుకుంటుంది. సిటీ పోలీస్, ఆక్టోపస్, ఇంటలిజెన్స్, ట్రాఫిక్ వంటి విభాగాలను సమన్వయం చేసుకొంటూ కట్టుదిట్టమైన భద్రతను కల్పిస్తాం. రక్షణ విషయంలో రాజీ లేకుండా పహారా కాసే మూడు కంపెనీల సిబ్బందికి ఇప్పటికే ప్రత్యేక శిక్షణ ఇప్పించాం. మొత్తం 300 మందిని సిద్ధంగా ఉంచాం. వీరంతా త్వరలో విధుల్లో చేరే అవకాశం ఉంది. రాబోయే కాలంలో ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, పౌరులు, సచివాలయ భద్రతల దృష్ట్యా మా సిబ్బందిని మరింత పెంచే అవకాశం ఉంది.
– స్వాతి లక్రా, ఏడీజీ టీఎస్ఎస్పీ బెటాలియన్స్
నూతన సచివాలయ భద్రతకు సంబంధించి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ (సీఎస్వో)గా తక్షణమే బాధ్యతలు స్వీకరించాలని టీఎస్ఎస్పీ 3వ బెటాలియన్ అడిషనల్ కమాండెంట్ పీ వెంకట్రాములుకు టీఎస్ఎస్పీ అడిషనల్ డీజీ స్వాతి లక్రా ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ కమిషనరేట్ సీపీ సీవీ ఆనంద్, సిబ్బందితో కలిసి సమన్వయంతో సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. టీఎస్ఎస్పీ నుంచి 1వ, 3వ, 8వ బెటాలియన్స్కు చెందిన మూడు కంపెనీలు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ పీ వెంకట్రాములు ఆధ్వర్యంలో సచివాలయంలో విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ పీ వెంకట్రాములు ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ.. సచివాలయానికి పటిష్టమైన భద్రతను అందించేందుకు సుమారు 468 మంది సిబ్బంది నిరంతరం విధులు నిర్వర్తిస్తారని వెల్లడించారు. భద్రత విషయంలో రాజీ పడకుండా గస్తీ కాస్తామని తెలిపారు.