హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలు, దూరదృష్టి కారణంగా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. బడ్జెట్ అసెంబ్లీ సమావేశంలో గురువారం ఎస్సీల పద్దుపై ఆయన మాట్లాడారు. ఇటీవల ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ జనరంజకంగా ఉందని ప్రశంసించారు.
కేంద్ర ప్రభుత్వం ఎటువంటి సాయం చేయనప్పటికీ తొమ్మిదేండ్ల కాలంలో తెలంగాణ ప్రగతిపథాన దూసుకుపోతుందని పేర్కొన్నారు. 75 ఏండ్ల స్వతంత్ర దేశంలో ఎస్సీల అభివృద్ధి కోసం పాలకులు మాటలు చెప్పారని, ఆచరణలో చూపలేదని ఎద్దేవా చేశారు. ఎస్సీల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధి, అంకితభావంతో పనిచేస్తుందని అన్నారు.
దళితబంధు పథకం..
దుర్భర దారిద్య్రాన్ని అనుభవిస్తున్న దళితుల కళ్లలో వెలుగులు నింపాలన్న సంకల్పం కోసం దళిత బంధు పథకం రూపొందించిందన్నారు. దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా దళిత కుటుంబానికి ఉపాధి కల్పన కోసం రూ. 10 లక్షలు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా గ్రాంట్గా అందిస్తున్నామని వెల్లడించారు.
కూలీగా ఉన్న వారు ఈ పథకం కింద ఓనర్గా మారారని వివరించారు. ఇప్పటి వరకు 38,323 మంది లబ్ధిదారులకు రూ. 4191.8 కోట్లు ఖర్చు చేశామని మంత్రి తెలిపారు. ప్రస్తుత బడ్జెట్లో రూ. 17,700 కోట్లను ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు.
గురుకుల విద్యాలయాలు..
ప్రతి ఒక్కరూ విద్యావంతులై ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసంతో ఉన్నప్పుడే జాతి బాగుపడుతుందన్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆలోచనలను సీఎం కేసీఆర్ తెలంగాణలో పెద్ద ఎత్తున గురుకులాలను ప్రారంభించారని తెలిపారు. 268 గురుకుల పాఠశాలలు, 238 జూనియర్ కళాశాలలు, మహిళల కోసం 30 డిగ్రీ కళాశాలలను నెలకొల్పామని తెలిపారు.
దళిత యువత విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ను రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షలకు పెంచుకున్నామని మంత్రి కొప్పుల స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 953 మంది విద్యార్థులకు రూ. 168 కోట్లు ఖర్చు చేశామని పేర్కొన్నారు.