హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ మొక్కవోని దీక్ష, పట్టుదల వల్లే ‘పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం’ ఆవిష్కృతమవుతున్నదని తెలంగాణ రాష్ట్ర విశ్రాంత ఇంజినీర్లు హర్షం వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా కృష్ణా జలాల కోసం ఎదురుచూస్తున్న పాలమూరు జిల్లావాసుల కల సాకారమవుతున్నదని సంతోషం వ్యక్తం చేశారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల బృందం ఇటీవల సందర్శించింది. ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అంజనగిరి రిజర్వాయర్, నీటి ఎత్తిపోతలకు సిద్ధమైన మోటర్లు, పంప్హౌస్లను పరిశీలించి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు విశ్రాంత ఇంజినీర్లు మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి దశాబ్దాల క్రితమే రూపకల్పన జరిగిందని, ఉమ్మడి పాలకులు ప్రాజెక్టును చేపట్టకుండా, ముందుకు కదలకుండా అడుగడుగునా అడ్డంకులు సృష్టించారని గుర్తుచేశారు. ప్రాజెక్టును మంజూరు జీవో రావడానికే దశాబ్దకాలం పట్టిందని, కేసీఆర్ నేతృత్వంలో కొనసాగిన తెలంగాణ ఉద్యమ నేపథ్యం, ఒత్తిడి ఫలితంగానే మంజూరైందని తెలిపారు.
స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా ప్రాజెక్టును చేపట్టారని, త్వరితగతిన ప్రారంభించారని కొనియాడారు. అయినప్పటికీ అనేక కేసులతో పనులకు ఆటంకం ఏర్పడిందని, వాటన్నింటినీ సీఎం కేసీఆర్ ఎంతో పట్టుదలతో అధిగమించారని, సవాళ్లను ఎదుర్కొని ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు కూడా తీసుకొచ్చారని హర్షం వ్యక్తం చేశారు. అనుమతుల మంజూరుతో ప్రాజెక్టు పనులు శరవేగంగా పూర్తి చేస్తున్నారని, శ్రీశైలం నుంచి కృష్ణా జలాల తరలింపునకు కావాల్సిన రిజర్వాయర్లు, కాలువలుసహా ప్రధాన పనులన్నీ పూర్తి చేశారని, నీటి సరఫరాకు ఉద్దేశించిన కాలువ పనులను కూడా చేపట్టేందుకు ఇటీవలే టెండర్లను ఆహ్వానించడం సంతోషంగా ఉన్నదని చెప్పారు. ప్రాజెక్టులో మొదటి పంపును ఆన్ చేయడం ద్వారా పాలమూరు బిడ్డల దశాబ్దాల కల సాకారం కానున్నదని, ఈ ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని కొనియాడారు. ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతోపాటు రంగారెడ్డి జిల్లాలో 12.30 లక్షల ఎకరాలకు సాగునీరందనున్నదని వివరించారు.
కుట్రలను ఛేదించి.. కేసులు అధిగమించి
దశాబ్దాలుగా వివక్షకు గురైన పాలమూరుకు కృష్ణమ్మ పరుగుపరుగున రానున్నది. ఈ ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దే. ఉమ్మడి రాష్ట్రంలో ప్రాజెక్టు చేపట్టాలని కోరుతూ ఎంతోమంది సీఎంలు, మంత్రులను కలిశాం. ఒక్కరూ స్పందించలేదు. పనులను చేపట్టేందుకైనా ముందుకు రాలేదు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఈ ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. పర్యావరణ అనుమతులు సాధించడం కేసీఆర్ సాధించిన అపూర్వ, చరిత్రాత్మక విజయం. ఎత్తిపోతలను ప్రారంభించనుండటం ఆనందంగా ఉంది. కేసీఆర్కు కృతజ్ఞతలు.
-శ్యాంప్రసాద్రెడ్డి, విశ్రాంత ఇంజినీర్ల సంఘం అధ్యక్షుడు
సంకల్పం ఉంటే సాధించలేనిది ఏదీ లేదు
కృష్ణా జలాలు పాలమూరుకు దక్కకుండా సీమాంధ్ర పాలకులు అనేక కుట్రలు చేశారు. స్వరాష్ట్రం వచ్చాక పాలమూరు రూపురేఖలే మారిపోతున్నాయి. ఇప్పటికే సీఎం కేసీఆర్ చేపట్టిన మిషన్కాకతీయ, మిషన్ భగీరథ పథకాలు, చెక్డ్యామ్ల నిర్మాణం వల్ల పాలమూరు నీటి గోస తీరింది. ఇప్పుడు పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కార్యరూపం దాల్చనుండటంతో శాశ్వతంగా సుభిక్షం కానున్నది. ఈ ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుంది.
– టీ వెంకటేశం, విశ్రాంత ఇంజినీర్ల సంఘం ప్రధాన కార్యదర్శి
పాలమూరు గోస తీరింది
ఏండ్లుగా నీళ్లకు గోసపడ్డ జిల్లా మాది. ఎందరో నాయకులు వచ్చారు. ప్రాజెక్టుల ఆశ చూపారు. ఓట్లు గుద్దించుకున్నరు. ఆ తర్వాత చేతులు దులుపుకున్నరు. మా జిల్లాకు నీళ్లు దక్కకుండా ఎన్నో కుట్రలు చేశారు. ఎక్కడో 700 కిలోమీటర్ల అవతల చెన్నైకి తాగునీళ్లను తీసుకుపోయిన సీమాంధ్ర పాలకులు కృష్ణమ్మ గట్టునే ఉన్న మా గొంతు తడపలేదు. ఇన్నాళ్లకు మా కల నెరవేరుతున్నది. పాలమూరు గడ్డకు కృష్ణమ్మ తరలిరానున్నది. ఇది సీఎం కేసీఆర్ మొక్కవోని దీక్షాపట్టుదల వల్లే సాధ్యమైంది. పాలమూరు బిడ్డగా ఎంతో ఆనందంగా ఉన్నది.
– శ్రీనివాస్, విశ్రాంత ఇంజినీర్, డ్యామ్ సేఫ్టీ నిపుణుడు
సీఎం కేసీఆర్ వల్లే సాధ్యం
సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. అందుకు కాళేశ్వరం ప్రాజెక్టుతోపాటు పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు కూడా ఒక ఉదాహరణ. అత్యంత స్వల్పకాలంలోనే భారీ సాగునీటి ప్రాజెక్టులను నిర్మించడం, వాటి ఫలాలను ప్రజానీకానికి అందించడం సీఎం కేసీఆర్కే సాధ్యమైంది. పాలమూరు ప్రాజెక్టుతో ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల ముఖచిత్రమే మారనున్నది.
– గణపతిరావు, రిటైర్డ్ ఎస్ఈ