హైదరాబాద్, మార్చి 15 : భౌగోళిక పరంగా 12వ స్థానంలో ఉన్న తెలంగాణ, అభివృద్ధిలో మాత్రం నంబర్ 1గా ఉన్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. దార్శనికత, దక్షత, దాతృత్వం, దృఢ సంకల్పం, దైర్యమున్న నాయకుడు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ద్వారానే ఇది సాధ్యమైందని కొనియాడారు. మంగళవారం శాసనమండలిలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. రాకెట్ సైన్స్ అయినా.. రబీ పంట గురించి అయినా.. నీటి పారుదల అయినా.. పేదలకు ఇచ్చే ఆసరా పెన్షన్ అయినా.. కరెంటు కష్టాలు తీర్చినా.. కల్యాణలక్ష్మి ఇచ్చినా అది కేసీఆర్కి మాత్రమే దక్కిందన్నారు. అభివృద్ధి సంక్షేమంతో పాటు 25 సూచికల్లో దేశంలో తెలంగాణ నంబర్ 1గా నిలవడం గర్వకారణమన్నారు. సీఎం కేసీఆర్ విజన్ వల్ల తెలంగాణ పవర్హౌజ్గా నిలబడుతున్నదని చెప్పారు. 2014లో బడ్జెట్ రూ.లక్ష కోట్లు ఉండగా, 2022 సంవత్సరంలో రూ. 2.56 లక్షల కోట్లకు చేరడం అభివృద్ధికి సూచిక అని ప్రశంసించారు. సామాజిక, ఆర్థిక అసమానతలను తొలగించే విధంగా అంచలంచెలుగా బట్జెట్ కేటాయిస్తూ ముందుకు వెళ్తున్నామని ఎమ్మెల్సీ కవిత వివరించారు.
దేశ జీడీపీకి అత్యధికంగా తెలంగాణ రాష్ట్రమే బాసటగా నిలుస్తున్నదని పేర్కొన్నారు. రూ. 29 వేల కోట్ల పెట్టుబడి వ్యయం పెట్టిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. 2014లో ఇక్కడి సగటు తలసరి ఆదాయం రూ.1.24 లక్షలని, కేవలం ఎనిమిదేండ్లలో రూ.2.78 లక్షలకు తలసరి ఆదాయం పెరగటం రాష్ర్టాభివృద్ధికి సూచిక అన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం ప్రగతి చెందుతుందనే సిద్ధాంతంతో ముందుకు వెళ్తూ దేశంలోనే ఎక్కడాలేని విధంగా పల్లె ప్రగతి కోసం నిధులు కేటాయిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని కొనియాడారు. దేశంలోనే అత్యధిక శాతం జీఎస్డీపీ 7.4% ఉన్న రాష్ట్రం తెలంగాణ అని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. తెలంగాణలో ప్రతి మనిషిపై అత్యధికంగా ఏడాదికి రూ.24,758 ఖర్చు పెడుతున్నామని వెల్లడించారు. ఇది దేశంలోనే అత్యధికమని పేర్కొన్నారు. గొప్పలు చెప్పుకొనే గుజరాత్లో రూ.16,581, యూపీలో రూ.9,556 మాత్రమే ఖర్చు చేస్తున్నారన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధగా ‘గ్రీన్ ఫండ్’ ఏర్పాటు చేసిన తెలంగాణ దేశానికి రోల్ మోడల్గా నిలిచిందన్నారు. ఆలయాల అభివృద్ధికీ ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నదని తెలిపారు. దుబ్బ రాజేశ్వరస్వామి గుడికి రూ.70 లక్షలు, కొండగట్టు అంజన్న స్వామికి రూ.10 కోట్లు నిధులు గతంలోనే ప్రభుత్వం విడుదల చేసిందని చెప్పారు. మెప్మా, సెర్ప్ ఉద్యోగులకు అనుకూలంగా అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటన చేసినందుకు ఎమ్మెల్సీ కవిత ధన్యవాదాలు తెలిపారు.