హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): ఆంధ్రపద్రేశ్ రాష్ట్ర విభజన తర్వాత కూడా నిర్దిష్ట పన్ను చెల్లింపుదారుల కస్టమర్ చిరునామాలను అప్డేట్ చేయకపోవడంతో భారీ మొత్తంలో ఆదాయం దారి మళ్లుతున్నదని తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు జీఎస్టీ కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చారు. కొంతమంది పన్ను చెల్లింపుదారుల రికార్డుల్లోని కస్టమర్ చిరునామాలు తెలంగాణలోనే ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్గానే పరిగణనలో ఉన్నాయని పేర్కొన్నారు. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో చండీగఢ్లో రెండు రోజులపాటు నిర్వహించిన 47వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో హరీశ్రావు మాట్లాడుతూ.. రాష్ర్టానికి సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించారు.
పన్ను చెల్లింపుదారుల రికార్డుల్లోని కస్టమర్ చిరునామాల విషయంలో ప్రతిపాదిత కొత్త 3బీ ఫారమ్లో జీఎస్టీఆర్ 3బీ రిటర్న్ల్లో ప్రతికూల విలువ (నెగిటీవ్ వాల్యూ)ను అనుమతించాలని ప్రతిపాదించినందుకు కౌన్సిల్కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుత 3బీ రిటర్న్లోనూ అదే సదుపాయాన్ని పొందుపరచాలని జీఎస్టీ కౌన్సిల్ చైర్పర్సన్ను కోరారు. తద్వారా ప్రస్తుత సంవత్సరంలో పన్ను చెల్లింపుదారుల చిరునామాల్లోని తప్పులను సరిదిద్దడానికి అవకాశం ఏర్పడుతుందని పేర్కొన్నారు.
మళ్లించిన ఐజీఎస్టీని రికవరీ చేయడానికి, రాష్ట్రం వెలుపల ఉన్న పన్ను చెల్లింపుదారుల టాక్స్ అధికార పరిధి (జ్యురిస్డిక్షన్) విషయంలో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాల అధికారుల సహకారం కావాలని కోరారు. ఈ విషయంలో రెవెన్యూశాఖ కార్యదర్శి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక అధికారులతో సమావేశం నిర్వహించి సమస్యను పరిషరించాలని సూచించారు. పన్ను చెల్లింపుదారులపై మళ్లీ ఐజీఎస్టీ చెల్లింపుతో భారం పడకుండా, ఇప్పటికే చెల్లించిన పీవోఎస్తో ఐజీఎస్టీని తిరిగి ఇచ్చేయాలని విజ్ఞప్తి చేశారు.
స్వచ్ఛ పరికరాల మినహాయింపు జాబితా విస్తరించాలి
స్థానిక సంస్థలకు అందజేసిన స్వచ్ఛ పరికరాలకు సంబంధించిన మినహాయింపుల జాబితాను విస్తరించాలని, దీనిపై అధ్యయనం చేసేందుకు ఫిట్మెంట్ కమిటీకి పంపాలని హరీశ్రావు కోరారు. లేదంటే స్థానిక సంస్థలపై భారం పడుతుందని వివరించారు. ఇప్పటికే స్థానిక సంస్థలు ఆర్థిక ఒత్తిడిలో ఉన్నాయని తెలిపారు.
గజిబిజిగా జీఎస్టీ అప్పిలేట్ నిబంధనలు
జీఎస్టీ అప్పిలేట్ ప్రతిపాదిత నిబంధనలు గజిబిజిగా ఉన్నాయని, ఆచరణాత్మకంగా లేవని హరీశ్రావు పేర్కొన్నారు. దీనితో ఏకీభవించిన జీఎస్టీ కౌన్సిల్ చైర్పర్సన్.. దీనిపై ఆగస్టు 1లోగా ప్రతిపాదనలు సమర్పించాలని మంత్రుల బృందాన్ని (జీవోఎం) ఆదేశించారు. కాసినోలు, గుర్రపు పందాలు, ఆన్లైన్ గేమింగ్లపై జీవోఎం ప్రతిపాదనల విషయంలో గోవా అభ్యర్థనకు స్పందించి కాసినోలను ఆమోదించినట్టుగానే గుర్రపు పందాల విషయంలోనూ జీవోఎంకు మళ్లీ సూచించాలని హరీశ్రావు కోరారు. ఇందుకు జీఎస్టీ చైర్పర్సన్ అంగీకరిస్తూ.. దీనిపై జూలై 15లోగా నివేదిక ఇవ్వాలని జీవోఎంను ఆదేశించారు.
చండీగఢ్ పీజీఐ దవాఖానను సందర్శించిన హరీశ్రావు
జీఎస్టీ కౌన్సిల్ సమావేశాల్లో పాల్గొనేందుకు చండీగఢ్కు వెళ్లిన మంత్రి హరీశ్రావు బుధవారం ప్రతిష్ఠాత్మక ‘చండీగఢ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్’ ను సందర్శించారు. హరీశ్రావుకు దవాఖాన డైరెక్టర్ డాక్టర్ వివేక్లాల్, డీన్ డాక్టర్ పురి, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వివేక్కౌశల్ స్వాగతం పలికారు. దవాఖానలోని సదుపాయాలు, సేవల గురించి మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశనంలో తెలంగాణ వైద్య రంగంలో తీసుకొస్తున్న మార్పులను తెలియజేశారు. రాష్ట్రంలో మరింత మెరుగైన వైద్య వసతులు కల్పించడానికి సలహాలు, సూచనలను చండీగఢ్ వైద్య సిబ్బంది నుంచి స్వీకరించారు. మంత్రి హరీశ్రావు వెంట వాణిజ్య పన్నులశాఖ కమిషనర్ నీతూ ప్రసాద్, సీఎంవోఎస్డీ డాక్టర్ గంగాధర్, నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మనోహర్ ఉన్నారు.