హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ సరికొత్త రికార్డు సృష్టించింది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు పౌర సరఫరాల సంస్థ రైతుల నుంచి రూ.88 వేల కోట్ల విలువైన 5.6 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలుచేసింది. కేవలం ఏడేండ్లలోనే రికార్డు కొనుగోళ్లు సాధించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదలే ప్రధాన కారణం. ఈ స్థాయిలో కొనుగోళ్లు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణయే కావడం విశేషం. నిజానికి ధాన్యం కొనుగోళ్లు ఆర్థికంగా భారం కావడంతో రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ఏ రాష్ట్ర ప్రభుత్వమూ ముందుకురావడం లేదు. రైతులకు ఇబ్బంది కలుగకూడదన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ మొత్తం ధాన్యం కొనుగోలు చేయిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో వరి ఉత్పత్తిలో తెలంగాణ స్వయం సమృద్ధి సాధించడమే కాకుండా దేశానికి అవసరమైన బియ్యాన్ని సరఫరా చేసే స్థాయికి ఎదిగింది. ఇలాంటి పరిస్థితుల్లో మరింత చేయూతనివ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లపై ఆంక్షలు విధిస్తున్నది. గతంలో లేని నిబంధనలు పెట్టి, ఏడాదికాలంగా అనేక ఇబ్బందులకు గురిచేయడం పట్ల రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్రంలో ఏటేటా ధాన్యం కొనుగోళ్లు పెరుగుతుంటే, కేంద్రం కొత్త బంధనలతో ఆంక్షలను విధించడం వల్ల రైతాంగానికి భవిష్యత్తులో పెనుసవాళ్లు తప్పవనే ఆందోళన వ్యక్తమవుతున్నది. రైతుల సంక్షే మం, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని కేంద్రం తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాల్సి ఉన్నది.
అకాల వర్షాలకు తోడు కేంద్ర ప్రభుత్వ నిబంధనల కారణంగా కొన్నిచోట్ల ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరుగుతున్నదని తెలంగాణ పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర నిబంధనల ప్రకారం తేమ 17 శాతం, చెత్త, తాలు, 1 శాతం, మట్టి పెళ్లలు, రాళ్లు1 శాతం మించి ఉండకూడదని చెప్పారు. ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా రైతులు తీసుకొస్తున్న ధాన్యంలో తేమ శాతం ఎక్కువగా ఉంటున్నదని, వీటిని కొనుగోలు చేయడానికి కేంద్ర నిబంధనలు ఒప్పుకోవడం లేదని వివరించారు. తేమ శాతం విషయంలో కేంద్రం నిబంధనలు సడలిస్తే కొనుగోళ్లు జరపడానికి ఇబ్బంది లేదని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయడానికి ప్రయత్నిస్తున్నామని, కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు రైతులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం రోజుకు లక్ష టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తున్నామని, ఇప్పటికే 17 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని వివరించారు. గతేడాదికి ఇదే సమయంలో కొనుగోలు చేసినదానికంటే ఇది 2 లక్షల టన్నులు ఎక్కువని పేర్కొన్నారు.