హైదరాబాద్/సంగారెడ్డి, ఫిబ్రవరి 21: ప్రజల అభీష్టం మేరకు అభివృద్ధి పనులు సాగితేనే ప్రగతిపథాన ముందుకు వెళ్తామని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు అంతా కలిసి ప్రజల ఆకాంక్షల మేరకు నడుచుకోవాలని ఆదేశించారు. సోమవారం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే..
ఊరూరు వరుసబట్టి తిరిగిన
ఒకప్పుడు నేను రవాణామంత్రిగా ఉన్న సమయంలో సంగారెడ్డి, జహీరాబాద్, పటాన్చెరు, అందోల్లో గల్లీగల్లీ పాదయాత్ర చేసిన. సంగారెడ్డి డాక్ బంగళాలో ఏ మంత్రీ ఉండేది కాదు. నేను అక్కడనే వారం, పదిరోజులు ఉండుకుంటూ జిల్లా కలెక్టర్ను, అధికారులందరినీ వెంబడేసుకొని రేగోడు, రాయికోడు, మనూరు, కంగ్టి, న్యాల్కల్ అన్ని వరుసబట్టి తిరిగినం. కొన్ని పనులు చేయగలిగినం. ఆనాడు చాలా వెనుకబాటుతనం ఉండేది. బుగ్గర రామన్న చెరువు.. గంగకత్వ అని ఒకటుండేది. జహీరాబాద్ నియోజకవర్గంలో ఏడాకులపల్లి చెరువుగాని, బడంపేట చెరువు కానీ తాంబాళాల్లా తయారైపోయినయి. అప్పటి ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, బాగన్న, గోవర్ధన్రెడ్డి నన్ను తీసుకెళ్లి, అన్నా ఇవ్వన్నీ బాగు కావాలన్నరు. కొంత ప్రయత్నం చేసినం.
మీ బిడ్డను.. మాట నిలబెట్టుకొన్నా
ఎంపీ బీబీ పాటిల్ ఎన్నిక సమయంలో అల్లాదుర్గంలో సమావేశం జరిగింది. ఇంచుమించు ఇవ్వాల జరిగినంత పెద్ద సభ జరిగింది. ఆ రోజు మీకు మాట ఇచ్చిన. ‘కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తవుతుంది.. అందోల్, నారాయణఖేడ్, జహీరాబాద్, సంగారెడ్డి నియోజకవర్గాలకు నీళ్లు తెచ్చి ఇచ్చే బాధ్యత నాది. నేను ఈ జిల్లా బిడ్డను. మీ కాళ్లల్లో చేతుల్లో పెరిగిన వాణ్ణి’ అని చెప్పిన. నాకు ఈ రోజు చాలా గర్వంగా, సంతోషంగా ఉన్నది. సుమారు 4 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే ప్రాజెక్టుకు రూ.4 వేల కోట్లతోని ఇవ్వాళ నా చేతితోనే శంకుస్థాపన చేశాను.
ఎమ్మెల్యే క్రాంతి చాలా అదృష్టవంతుడు..
అందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ చాలా అదృష్టవంతుడు. గజ్వేల్, సిద్దిపేటలకు వచ్చిన దానికంటే ఎక్కువ నీళ్లు ఇవ్వాల అందోల్కు వస్తున్నయి. దాదాపు 1.70 లక్షల ఎకరాలకు 4 ప్రాజెక్టుల ద్వారా నీళ్లు రాబోతున్నాయి. చాలా సంతోషం. స్థానిక ఎమ్మెల్యే ఉండాలని గెలిపించుకున్నరు. ఇవ్వాల క్రాంతికిరణ్ ఏమి చేసిండో మీ కండ్లముందున్నది. యువకుడు, ఉత్సాహవంతుడు. ఇంకా ముందుకు పోవాలె. మీ కలలన్నీ పండాలని కోరుతున్నా. వారం, పది రోజుల తర్వాత సంగమేశ్వర దేవాలయానికి వస్త. అప్పుడు సంగారెడ్డిలో మెడికల్ కాలేజీకి ఫౌండేషన్ వేసుకుంటం. నిజాంపేట మండలం కావాలని భూపాల్రెడ్డి కోరారు. దాన్ని మంజూరుచేస్తున్న.
హుషారు మంత్రి హరీశ్
మీ మంత్రి హరీశ్ మంచి హుషారున్నడు.. ‘మీరు వచ్చి ఫౌండేషన్ వేస్తే చాలు.. మిమ్మల్ని ఏమీ అడగం’ అన్నడు.. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది కావాలి.. అది కావాలి అని మళ్ల దుకాణం పెట్టిండు. నాయకులు అట్లనే ఉండాలి. అట్ల ఉంటనే అభివృద్ధి జరుగుతది. హరీశ్ క్రియాశీలమైన మంత్రి. ప్రజల కోసం అద్భుతంగా పనిచేయాలన్న తపన ఉండే మంత్రి. ఆయన ఈ జిల్లాల ఉన్నడు కాబట్టే మంచి కార్యక్రమాలు చాలా జరుగుతున్నయి. ఏడాదిన్నరలోపు.. మీరు అధికారులు, కాంట్రాక్టర్ల వెంబడి పడి, ఇక్కడి స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీ కలిసి నీళ్లు గలగల దుంకిపియ్యాలె. సంగారెడ్డి, జహీరాబాద్కు రూ.50 కోట్ల చొప్పున కావాలని హరీశ్ అడిగిండు. రేపు జీవో ఇష్యూ చేస్తం. ఖేడ్, జోగిపేట, సదాశివపేట, బొల్లారం, అమీన్పూర్, తెల్లాపూర్ మున్సిపాలిటీలకు రూ.25 కోట్ల చొప్పున మంజూరు చేస్తున్నం. దయచేసి డబ్బు వృథా చేయవద్దు. గతంలో నేను చేసిన మాదిరిగా మీరంతా మీ కలెక్టర్లు, అధికారులను వెంటపెట్టుకుని ఈ 8 మున్సిపాలిటీల్లో పాదయాత్ర చేయండి. ప్రజలను కలిసి, వారికి ఏవి అవసరమో ఆ పనులు చేసి, వారి గౌరవాన్ని పొందాలి. 699 గ్రామ పంచాయతీలకు 20 లక్షల చొప్పున రూ.140 కోట్లు మంజూరుచేస్తం.