న్యూఢిలీ: భారత సంతతి నాసా వ్యోమగామి అనిల్ మీనన్ అంతరిక్షంలో పండించిన తాజా ఆకుకూరలను కోసి వంట వండారు. భవిష్యత్ దీర్ఘకాలిక యాత్రలలో ఆహారాన్ని ఎలా ఉత్పత్తి చేయవచ్చో తన ప్రదర్శన ద్వారా తెలియజేశారు. ‘ఎక్స్’ వేదికగా పంచుకున్న వీడియోలో మీనన్, తోటి వ్యోమగామి జెస్సికా మెయర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లోపల పండించిన కాలే(క్యాబేజీ తరహా), వసాబి(ఆవ జాతికి చెందిన) ఆకు కూరలను కోస్తూ, దానిని అంతరిక్ష భోజనంగా సిద్ధం చేశారు. అంతరిక్షంలో నానా పరిశోధనలలో భాగంగా ఈ కూరగాయలను దాదాపు నెల పాటు సాగుచేశారు.
ఇందుకు సహకరించిన నాసా వెజ్జీ బృందానికి ధన్యవాదాలు. మార్స్ గ్రహంపై ఆలూ పండించిన మార్స్ వాట్నీ(సినిమా పాత్ర) కూడా దీనిని చూసి గర్వపడతారు అని మీనన్ ఆ వీడియో పోస్టులో రాశారు. ఈ ప్రయోగం నాసాకు చెందిన వెజ్జీ ప్లాంట్ గ్రోత్ చాంబర్ లోపల జరిగింది. మొక్కలు సూక్ష్మ గురుత్వాకర్షణకు ఎలా స్పందిస్తాయో శాస్త్రవేత్తలు అర్థం చేసుకునేందుకు ఇది సహాయపడుతుంది.