రాయ్పూర్, ఆగస్టు 18: రాయ్పూర్లో ఆగస్టు 7న నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో మాజీ మహిళా మావోయిస్టుల ర్యాంప్ వాక్ దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. దీనిని తమ విజయగాథగా, మహిళా సాధికారతగా ఛత్తీస్గఢ్లోని బీజేపీ ప్రభుత్వం అభివర్ణించుకుంది. కానీ సుక్మాలోని పునరావాస కేంద్రంలో ఉంటున్న మాజీ మహిళా మావోయిస్టులు ప్రభుత్వ తీరును తప్పుబడుతున్నారు. ర్యాంప్ వాక్లో తాము పాల్గొనటం స్వచ్ఛందంగా జరిగింది కాదంటున్నారు.
టైలరింగ్లో శిక్షణ ఇప్పిస్తామంటూ రాయ్పూర్ తీసుకుపోయారని, అక్కడికి వెళ్లాక ర్యాంప్ వాక్లో శిక్షణ ఇచ్చారని నలుగురు మాజీ మహిళా మావోయిస్టులు తాజాగా మీడియా ముందు వాపోయారు. ర్యాంప్ వాక్ గురించి తమకు ముందే తెలిసి ఉంటే, అక్కడికి వెళ్లేవాళ్లం కాదని అన్నారు. సుక్మా పునరావాస కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్న మహిళా పోలీసు అధికారి సీమా పోయం కూడా ఆ మహిళల ర్యాంప్ వాక్ గురించి తమకు ముందుగా ఏమీ తెలియదని అన్నారు. వారిని టైలరింగ్ తరగతుల కోసం తీసుకెళ్తున్నట్టు మాత్రమే తనకు సమాచారముందని అన్నారు.