న్యూఢిల్లీ, ఆగస్టు 18: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) పరీక్ష విధానాలలో భారీ మార్పులను ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. ఇందులో నాలుగు అంచెల జవాబు పత్రాల పరిశీలన ప్రక్రియ, 600 మంది నిపుణులను తొలగించి వారి స్థానంలో కొత్తవారిని నియమించడం, కార్యాలయాలకు సీఐఎస్ఎఫ్ భద్రత కల్పించడం వంటివి ఉన్నాయి. ప్రతాలకు సంబంధించిన ఇటీవలి లోపాలు, అంతకుముందు జరిగిన నీట్-యూజీ ప్రశ్న పత్రం లీక్ వ్యవహారాలపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న విద్యా శాఖ పరిస్థితులను చక్కదిద్దేందుకు ముమ్మరంగా చర్యలు చేపట్టింది. విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అధ్యక్షతన సోమవారం ఒక సమీక్షా సమావేశం జరిగింది.
పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన భద్రత, సంబంధిత మౌలిక సదుపాయాలను కల్పించాలని ఆయన ఆదేశించినట్టు మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటించింది. మంత్రి ఆదేశాల మేరకు దేశంలో అనేక పరీక్షల నిర్వహణ బాధ్యత కలిగిన ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ ఆ సంస్థ చేపట్టిన చర్యల గురించి మంత్రిత్వ శాఖకు వివరించారు. వచ్చే రెండు, మూడు వారాల్లో 20-25 మంది అధికారులను విధుల్లోకి తీసుకోనుండగా తదుపరి నియామకాల ప్రణాళికను కూడా సమీక్షించారు. అలాగే ఎన్టీఏ కార్యాలయాలను యుద్ధ ప్రాతిపదికన కొత్త భవనాలకు తరలించనున్నామని, అక్కడ సీఐఎస్ఎఫ్ బృందాలతో భద్రతను మరింత కట్టుదిట్ట చేయనున్నామని మంత్రిత్వ శాఖ తెలిపింది.