పదేండ్లు అల్లర్లు, మతఘర్షణలు లేకుండా తెలంగాణ శాంతిభద్రతల నిలయంగా పరిఢవిల్లింది. ఫలితంగా పెట్టుబడుల వరద పారింది. ఏటా పోలీసు వ్యవస్థకు ఆర్థిక తోడ్పాటును అందిస్తూ, అత్యాధునిక సౌకర్యాలు కల్పించటంతో తెలంగాణ పోలీస్ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలిచింది.
Telangana | హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): పదేండ్ల తెలంగాణలో పోలీస్ శాఖది చెరగని ముద్ర. శాంతిభద్రతలకు, మతసామరస్యాలకు తెలంగాణ నిలయంగా మారిందంటే కారణం.. మన అంతర్గత రక్షణ వ్యవస్థ పటిష్టంగా ఉండటమే. ఉమ్మడి పాలనలో అస్తవ్యస్తంగా ఉన్న పోలీస్ వ్యవస్థను కేసీఆర్ సర్కారు గాడిలో పెట్టింది. దేశానికే నంబర్ వన్ పోలీస్గా తీర్చిదిద్దింది. ఇదే విషయాన్ని ‘ఇండియా జస్టిస్ రిపోర్టు-2022’, ‘తెలంగాణ సోషియో ఎనకానమిక్స్ సర్వే-2023’ కూడా కుండబద్దలు కొట్టాయి.
ఇండియా జస్టిస్ రిపోర్టు-2022 సర్వేలో తొలిసారిగా తెలంగాణ పోలీస్శాఖ మొదటి ర్యాంకును సొంతం చేసుకొన్నది. 2019లో 11వ స్థానంలో, 2020లో 10వ ర్యాంకులో కొనసాగిన తెలంగాణ.. 2022లో ఒకేసారి 9 ర్యాంకులు ఎగబాకి తొలిస్థానానికి చేరుకొన్నది. తక్కువ ఖాళీలు, ఎక్కువ భర్తీలు, పోలీస్ వ్యవస్థ తలసరి వ్యయంలో పెరుగుదల, సిబ్బంది శిక్షణకు నిధుల ఖర్చు, అత్యాధునిక పోలీస్స్టేషన్లు, కేటాయించిన నిధులు, మహిళా పోలీస్సిబ్బంది, పోలీసు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, మహిళలకు 33.3 శాతం రిజర్వేషన్ అమలు, బడ్జెట్ కేటాయింపులు, గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే గస్తీ, సీసీ కెమెరాల నిర్వహణ, పోలీస్స్టేషన్లలో ఉమెన్ హెల్ప్డెస్క్లు, పోలీసులకు సమర్థవంతమైన శిక్షణ, పోస్టుల భర్తీల్లో పారదర్శకత వంటి అంశాలు తెలంగాణ పోలీస్ వ్యవస్థను దేశానికి ఆదర్శంగా నిలిపాయి. జైళ్ల నిర్వహణలో సైతం జాతీయస్థాయిలో తెలంగాణ మూడోస్థానంలో నిలిచింది. బాధితులకు సత్వర న్యాయాన్ని అందించటంలో 5వ స్థానంలో ఉన్నది.
సీసీ కెమెరాలతో పటిష్ట నిఘా
ఉమ్మడి పాలనలో తెలంగాణవ్యాప్తంగా లక్ష వరకు మాత్రమే సీసీ కెమెరాలు ఉండేవి. గత పదేండ్లలో తెలంగాణవ్యాప్తంగా 11.10 లక్షల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ‘స్టేటస్ ఆఫ్ పోలీసింగ్ ఇన్ ఇండియా-2023’ ప్రకారం పోలీస్శాఖ ఆధీనంలో ఉన్న సీసీ కెమెరాల్లో తెలంగాణది మొదటిస్థానం. దేశంలోనే అత్యధికంగా సీసీ కెమెరాలున్న రాష్ట్రంగా అనతికాలంలోనే తెలంగాణ అవతరించింది. కాగా, ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సీసీ కెమెరాలున్న టాప్-20 నగరాల్లో హైదరాబాద్ 16వ స్థానంలో నిలిచింది.
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో నమోదవుతున్న కేసుల్లో 90 శాతం కేసులను సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా ఛేదిస్తున్నారంటే నిఘా వ్యవస్థను మన ప్రభుత్వం ఎంత పటిష్టంగా మార్చిందో అర్థం చేసుకోవచ్చు. దేశంలోనే అతిపెద్ద రాష్ర్టాలైన ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటివి తెలంగాణ తర్వాతే ఉన్నాయి. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల్లో కల్తీలు, నకిలీలపై కఠినంగా వ్యవహరించి పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపేలా ఆర్డినెన్స్ తెచ్చిన తొలి రాష్ట్రం కూడా తెలంగాణే.
పదేండ్లలో 59,200 కోట్ల ఖర్చు
తెలంగాణకు పెట్టుబడులు రావాలంటే పోలీస్ వ్యవస్థను పటిష్టంగా మార్చాలని కేసీఆర్ ప్రభుత్వం భావించింది. సీఎంగా కేసీఆర్ మొదటి సమావేశంలోనే పోలీస్ వ్యవస్థకు రూ.375 కోట్లు మంజూరు చేశారు. ఆ తర్వాత అదే పద్దు కింద మరో రూ.500 కోట్లు ఇప్పించారు. జిల్లాల పునర్విభజన తర్వాత 9 కమిషనరేట్లను ఏర్పాటు చేశారు. పోలీస్ సబ్డివిజన్ల సంఖ్యను 139 నుంచి 164కు, సరిళ్ల సంఖ్యను 688 నుంచి 719కు, పోలీస్స్టేషన్ల సంఖ్యను 712 నుంచి 815కు ప్రభుత్వం పెంచింది. రాష్ట్రం ఏర్పడేనాటికి పోలీస్శాఖకు 5 వేల వాహనాలుంటే, 2023 నాటికి 20 వేలకుపైగా వాహనాలు ఉన్నాయి. పదేండ్లలో పోలీస్ శాఖకు రూ.59,200 కోట్లను బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు చేసింది.
సంస్కరణలకు పెద్దపీట
మహిళలు, పిల్లల పట్ల నేరాలు అరికట్టేందుకు, మానవ అక్రమ రవాణాను నివారించేందుకు దేశంలోనే తొలిసారిగా ‘ఉమెన్ సేఫ్టీ వింగ్’ను కేసీఆర్ సర్కారు ఏర్పాటు చేసింది. దీని ద్వారా అన్ని జిల్లాల్లో షీటీమ్స్ను రంగంలోకి దించింది. సైబర్ నేరాల నియంత్రణకు ‘తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో’ ఏర్పాటు చేసింది. డ్రగ్స్, ఇతర మాదకద్రవ్యాలను అడ్డుకొనేందుకు ‘తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో’ ఏర్పాటు చేసింది.
నిష్పక్షపాతంగా నియామకాలు
రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ‘తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ)’ ద్వారా పోలీసు ఉద్యోగాలు అర్హులైనవారికి దక్కుతున్నాయి. తొమ్మిదేండ్లలో 45,800 మంది పోలీసు కొలువులు చేపట్టారు. పోలీస్ ఉద్యోగాల్లో 95 శాతం స్థానికులకే అవకాశాలు కల్పించారు. మహిళలకు 33.3 శాతం రిజర్వేషన్ను అమలు చేస్తున్నారు.
రూ.600 కోట్లతో కమాండ్ కంట్రోల్ సెంటర్
దేశంలోనే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు కలిగిన పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ తెలంగాణ సొంతం. బంజారాహిల్స్లోని ఈ అద్భుతమైన పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో లక్ష కెమెరాల పుటేజీని ఒక నిమిషంలోనే పరిశీలించే ఆధునిక పరికరాలు, పరిజ్ఞానం అందుబాటులో ఉన్నాయి. క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్ (సీసీటీఎన్ను)ను, ఇంటర్ ఆపరేబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ (ఐసీజేఎస్) అనుసంధానించిన తొలి రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది.
దేశంలోనే ఆటోమేటెడ్ ఫింగర్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ (ఏఎఫ్ఐఎస్)ను కొనుగోలు చేసిన తొలి రాష్ట్రం తెలంగాణే. పోలీస్శాఖ చర్యల ఫలితంగా స్వలాభం కోసం జరిగే హత్యలు 32.94 శాతం తగ్గాయి. మొత్తంగా 19.42 శాతం హత్యలు తగ్గగా, మహిళలపై జరిగే నేరాల్లో 40 శాతం వరకు తగ్గుముఖం పట్టాయి. తెలంగాణ రాష్ట్ర పోలీసులు గత పదేండ్లలో 60కి పైగా జాతీయ, అంతర్జాతీయ అవార్డులను గెలుచుకున్నారు.
అధునాతన పోలీస్ భవనాలు
తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా 90 పోలీస్స్టేషన్లలో ఫ్రంట్ ఆఫీసుల నిర్మాణాన్ని కేసీఆర్ ప్రభుత్వం చేపట్టింది. ఆ తర్వాత ప్రతి మండలానికి ఒక పోలీస్స్టేషన్ ఉండాలన్న నిర్ణయంతో ఈ కార్పొరేషన్ సుమారు 137 కొత్త పోలీస్ స్టేషన్లకు భవనాల నిర్మాణం చేపట్టింది. కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో 17 జిల్లా పోలీస్ అధికారుల కార్యాలయాల (డీపీవో)ను రూ.654.50 కోట్లతో నిర్మాణాలు చేపట్టింది. రూ.38.50 కోట్ల ఖర్చుతో అత్యాధునిక, సాంకేతిక వసతులతో ఒక్కో డీపీవోకు నిర్మిస్తున్నారు. కార్పొరేషన్ చేపట్టిన పోలీస్ భవనాలన్నీ ‘స్మార్ట్ బిల్డింగ్స్’ వ్యవస్థతో రూపొందించారు.