హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ) : పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పీజీఈసెట్) నోటిఫికేషన్ ఈ నెల 28న విడుదల చేయనున్నట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి, జేఎన్టీయూ వీసీ కట్టా నరసింహారెడ్డి తెలిపారు. ఎంటెక్, ఎం ఫార్మసీ, ఎంఆర్క్ వంటి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈ పరీక్షకు మార్చి 3 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు.
శుక్రవారం హైదరాబాద్ జేఎన్టీయూలో వారు పీజీఈసెట్ షెడ్యూల్ను విడుదల చేశారు. మొత్తం 19 రకాల పేపర్లకు మే 29 నుంచి జూన్ 1 వరకు పీజీఈసెట్ పరీక్షలుంటాయని వివరించారు. ఈ పరీక్షలను హైదరాబాద్, వరంగల్ పట్టణాల్లో నిర్వహిస్తామని చెప్పారు. జనరల్ క్యాటగిరీ విద్యార్థులు రూ.1100, ఎస్సీ, ఎస్టీ, వికలాంగ విద్యార్థులు రూ. 600 పరీక్ష ఫీజుగా చెల్లించాలని తెలిపారు. వివరాలకు www.pgecet.tsche.ac. in వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు. సమావేశంలో పీజీఈసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ బీ రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.