నెలరోజుల్లోనే తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేనిలోటు స్పష్టంగా కనిపిస్తుందని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. ఎన్నికలకు ముందు ఎన్నో హామీలిచ్చి నెలరోజులు దాటుతున్నా ఏమీ చేయలేదని ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అన్నారు. మంగళవారం హైదరాబాద్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఖమ్మం లోక్సభ నియోజకవర్గ సన్నాహక సమావేశం జరిగింది.
సమావేశం అనంతరం నామా నాగేశ్వరరావుతో కలిసి వద్దిరాజు రవిచంద్ర మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ సీఎం పదవిలో లేకపోవడాన్ని ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారని తెలిపారు. అందుకే.. ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్కే ఓటెయ్యాలని ప్రజలు నిర్ణయించుకున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ 420 హామీలిచ్చి.. అడిగితే ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ శ్రేణులంతా ఒక్క తాటిపైకి వచ్చి ఖమ్మంలో నామా నాగేశ్వరరావుతోపాటు మిగిలిన అన్ని లోక్సభ సీట్లను గెలుచుకుని తీరుతామని తెలిపారు.