హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ హామీ మేరకు ఆదిలాబాద్లో కొత్త వ్యవసాయ కళాశాల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఈ అకడమిక్ ఇయర్ (2023-24)లో 60 సీట్లకు అడ్మిషన్లు నిర్వహించనున్నారు. శనివారం ఇన్చార్జి వీసీ రఘునందన్రావు అధ్యక్షతన వ్యవసాయ యూనివర్సిటీ అకడమిక్ కౌన్సిల్ సమావేశం జరిగింది. సంగారెడ్డి అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ కళాశాలలో సాయిల్, వాటర్ కన్జర్వేషన్ ఇంజినీరింగ్లో పీహెచ్డీ కోర్సు, ఫార్మ్ మిషనరీ అండ్ పవర్ ఇంజినీరింగ్, ప్రాసెసింగ్ అండ్ ఫుడ్ ఇంజినీరింగ్లో పీజీ కోర్సులను ప్రారంభించడానికి అకడమిక్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. 2023-24 విద్యా సంవత్సరానికి పీజీ కోర్సుల సీట్లను 210కి పెంచుతూ తీర్మానించింది.
పీహెచ్డీ సీట్లని 61గా కౌన్సిల్ నిర్ధారించింది. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులో రీవాల్యుయేషన్ విధి విధానాలు రూపొందించడానికి అంగీకరించింది. 2023-24 విద్యా సంవత్సరంలో బీఎస్సీ (హానర్స్) అగ్రికల్చర్ కోర్సులో 955 సీట్లు, బీటెక్(అగ్రికల్చరల్ ఇంజినీరింగ్)లో 87 సీట్లు, బీటెక్(ఫుడ్ టెక్నాలజీ)లో 77 సీట్లు, బీఎస్సీ(హానర్స్) కమ్యూనిటీ సైన్స్లో 121 సీట్ల భర్తీకి ఆమోదం తెలిపింది. వరంగల్, అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలల్లో బీఎస్సీ కోర్సులో అత్యధిక ఓజీపీఎస్ సాధించిన విద్యార్థులకు ‘గ్రోమోర్’ బంగారు పతకాలను ఇవ్వడానికి కౌన్సిల్ పచ్చజెండా ఊపింది. డిప్లొమా కోర్సుల్లో 760 సీట్లకు ఆమోదం తెలిపింది. వీటితో పాటు అనేక పరిపాలనాపరమైన అంశాలపై కూడా చర్చించి, వాటికి ఆమోదం తెలిపింది.