హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): ఉద్యమ నేత, సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం బంగారు తెలంగాణగా రూపుదిద్దుకొంటున్నది. గత ఏడేండ్లలో ఎన్నో అద్భుత విజయాలు సాధించింది. ప్రత్యేకించి విద్యుత్తు రంగంలో తెలంగాణ సాధించిన విజయాలు ఎనలేనివి, ఎంతో ఘనమైనవి. స్వరాష్ట్రంగా ఆవిర్భవించాక 6 నెలల్లోనే గృహ, వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు నిరంతరాయంగా 24 గంటలూ నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేసి చరిత్ర సృష్టించిన సీఎం కేసీఆర్.. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో వ్యవసాయ రంగంతోపాటు అట్టడుగు వర్గాలకు నిరంతరాయంగా ఉచిత విద్యుత్తును అందిస్తున్నారు. మరికొన్ని బడుగు వర్గాలకు సబ్సిడీలతో విద్యుత్తును అందించి దేశానికే ఆదర్శంగా నిలిచారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడేనాటికే తెలంగాణలోని విద్యుత్తు సంస్థలు తీవ్రమైన నష్టాల్లో చిక్కుకొన్నా.. వాటికి కేంద్ర ప్రభుత్వం చేయూత ఇవ్వకపోయినా.. రాష్ట్ర ప్రభుత్వంపై సబ్సిడీల భారం పెరిగినా సీఎం కేసీఆర్ ఎన్నడూ తగ్గిందే లేదు. విద్యుత్తు చార్జీలను పెంచిందీ లేదు. అయినా ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలోనే విద్యుత్ చార్జీలు చాలా తక్కువగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, అడ్డగోలు విధానాలు రాష్ట్రంలోని విద్యుత్తు సంస్థలకు పెనుభారంగా పరిణమించాయి. ఈ కష్టాల నుంచి గట్టెక్కాలంటే విద్యుత్తు చార్జీల పెంపు అనివార్యమని ఆయా సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. ఈ విషయమై ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు, ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, జేఎండీ శ్రీనివాసరావు, ఎస్పీడీసీఎల్ డైరెక్టర్లు శ్రీనివాస్, స్వామిరెడ్డి తదితరులు గత 3 రోజుల నుంచి మంత్రివర్గ ఉపసంఘంతో చర్చిస్తున్నారు. ఈ క్రమంలో ఆర్థిక మంత్రి హరీశ్రావు, విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డితో బుధవారం మరోసారి సమావేశమై.. విద్యుత్తు చార్జీలను పెంచక తప్పదని గట్టిగా కోరారు. ఇందుకు సంబంధించిన పలు అంశాలను మంత్రులకు వివరించారు.
రాష్ట్రంలో నెలకు 50 యూనిట్లలోపు విద్యుత్తును వాడే గృహ వినియోగదారులకు ఒక్కో యూనిట్ను రూ.1.45కే అందిస్తున్న విషయాన్ని అధికారులు గుర్తుచేశారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో సైతం ఇంత తక్కువ ధరకు విద్యుత్తును సరఫరా చేయడంలేదని, ఈ క్యాటగిరీలో ఒక్కో యూనిట్కు రూ.3.30 వసూలు చేస్తున్నారని తెలిపారు. ఇదే క్యాటగిరీలో ప్రతి యూనిట్కు ఉత్తరప్రదేశ్లో రూ.3, పంజాబ్లో రూ.3.49, పశ్చిమ బెంగాల్లో రూ.4.02 వసూలు చేస్తున్నట్టు వివరించారు.
100 యూనిట్లలోపు విద్యుత్తును వినియోగించుకొనేవారికి సరాసరి బిల్లు తెలంగాణలో రూ.239 ఉంటే.. ఉత్తరప్రదేశ్లో రూ.457, పంజాబ్లో రూ.473, కేరళలో రూ.476, గుజరాత్లో రూ. 601, మహారాష్ట్రలో రూ.677, కర్ణాటకలో రూ.702, పశ్చిమ బెంగాల్లో రూ.759, రాజస్థాన్లో రూ.861 వసూలు చేస్తున్నట్టు మంత్రులకు వివరించారు. తెలంగాణలో 200 యూనిట్ల వరకు వాడుతున్న వినియోగదారులకు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ అందిస్తున్నందున నెలకు సగటున రూ.822 వసూలు చేస్తున్నారు. మహారాష్ట్రలో రూ.1,689, రాజస్థాన్లో రూ.1,666, పశ్చిమబెంగాల్లో రూ.1,630, కర్ణాటకలో రూ.1,556, మధ్యప్రదేశ్లో రూ.1,427, గుజరాత్లో రూ.1,285, కేరళలో రూ.1,224 వసూలు చేస్తున్నట్టు చెప్పారు.
దేశంలో వ్యవసాయ రంగానికి ఉచితంగా 24 గంటలూ విద్యుత్తును సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే. వ్యవసాయానికి రోజులో కేవలం 9 గంటలు మాత్రమే విద్యుత్తును అందిస్తున్న గుజరాత్లో ఒక్కో కనెక్షన్కు ప్రతినెలా రూ.667, ఉత్తరప్రదేశ్లో రూ.2,408, పశ్చిబెంగాల్లో రూ.4,558, మహారాష్ట్రలో రూ.1,609, కేరళలో రూ.2,952 వసూలు చేస్తున్నారు. రాజస్థాన్లో 7 గంటలు విద్యుత్తు సరఫరాచేసి రూ.2,952 తీసుకొంటున్నారు.
రాష్ట్రంలో ఒక్కో యూనిట్ విద్యుత్ సరఫరాకు రూ.7.24 వెచ్చిస్తున్న డిస్కంలు.. 50 యూనిట్లలోపు గృహ వినియోగదారులకు రూ.1.45కే సరఫరా చేస్తున్నాయి. 100 యూనిట్లలోపు వినియోగించుకొనేవారి నుంచి రూ.2.60, 200 యూనిట్లలోపు వినియోగదారుల నుంచి రూ.4.30 చొప్పున మాత్రమే వసూలు చేస్తున్నాయి. సరఫరా వ్యయానికి, వినియోగదారులు చెల్లిస్తున్న చార్జీలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్నది. ఉదాహరణకు 50 యూనిట్లలోపు వినియోగదారులు రూ.362 చెల్లించాల్సి ఉన్నప్పటికీ రూ.101 మాత్రమే చెల్లిస్తున్నారు. మిగిలిన 261 రూపాయలను ప్రభుత్వం చెల్లిస్తున్నది. అయినా విద్యుత్తు పంపిణీ సంస్థలకు నష్టాలు తప్పడంలేదని అధికారులు వాపోతున్నారు.